ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడితో ఆస్తి, ప్రాణ నష్టాలు అపారం. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లిన భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. వేలల్లో ఉన్న విద్యార్థుల వేదనలు చూస్తున్నవారికి ఇంతమంది అక్కడికి వెళ్లిచదువుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్న తలెత్తుతున్నది.
మన దేశంతో పోలిస్తే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశానికి ఉన్నత చదువులు, ముఖ్యంగా వైద్య విద్య చదవటం కోసం వెళ్లే పరిస్థితులు ఉండ టం విషాదం. ఈ యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారోనని భారతీయ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బంకర్లలో తలదాచుకుంటూ ప్రాణాలు నిలుపుకొంటున్న విద్యార్థులు సరిహద్దు దేశాలకు చేరుకొని మాతృదేశానికి చేరుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఎలాగోలా స్వదేశానికి తిరిగిరావాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులను అక్కడి సైనికులు, పోలీసులు అడ్డగిస్తున్న దృశ్యా లు మీడియాలో కనిపిస్తున్నాయి.
అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఉక్రెయిన్లో 18 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాగే చైనాలో 25 వేలు, ఫిలిప్పైన్స్లో 12 వేలు, కెనడాలో 49 వేలు, అమెరికాలో అత్యధికంగా లక్షమందికి పైగా ఉన్నత విద్యకోసం అక్కడికి తరలివెళ్లారు. ఇంకా రుమేనియా, బల్గేరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మొత్తం 85కు పైగా దేశాల్లో 10 లక్షలకు పైగా మన విద్యార్థులున్నారని అంచనా. మన దేశంలో ఒక రాష్ట్రం పాటి వైశాల్యం కూడా లేని చిన్న చిన్న దేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఉన్నది? స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా మన విద్యార్థులకు అవసరమైన ఉన్నత విద్యను అందించటంలో మనం ఎందుకు వెనకబడిపోయాం? మన విద్యార్థులు ఇతర దేశాల విద్యాలయాలకు కామధేనువుల్లా మారిపోయారు. ముఖ్యంగా మన విద్యార్థులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం, ఇంజినీరింగ్, వైద్య విద్య కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఈ చదువుల కోసం ఒక్కో విద్యార్థి రూ.50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఖర్చుపెడుతున్నాడు. ఈ రూపేణా ఎంతో డబ్బు విదేశాలకు తరలిపోతున్నది. ఈ దుస్థితి ఎందుకు దాపురించింది?
ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్, ఖజకిస్థాన్, రుమేనియా, బల్గేరియా వంటి దేశాల్లో మన విద్యార్థులు ఎక్కువగా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మన దేశంలో అయ్యే ఖర్చు కంటే తక్కువతో అక్కడ ఎంబీబీఎస్ పూర్తవుతున్నది. అదే మన దగ్గర వైద్య విద్య పూర్తిచేయాలంటే కోట్లు ఖర్చుపెట్టాలి. ఇలా కోట్ల రూపాయలతో చదివి డాక్టర్లయిన వారి వైద్యసేవలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. వైద్యం సేవా గుణాన్ని కోల్పోయి వ్యాపార దశను దాటి దారుణమైన దోపిడీ స్థితికి చేరుకున్నది. మన దేశంలో ప్రతి 1311 మందికి ఒక డాక్టరు మాత్రమే ఉన్నాడు. అదే ఖతార్లో ప్రతి వెయ్యి మందికి 8 మంది, క్యూబాలో ఏడుగురు, గ్రీస్లో ఆరుగురు, స్పెయిన్, ఆస్ట్రియా, జార్జియాతో సహా ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ఐదుగురు చొప్పున డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.
అతి ముఖ్య సామాజిక అవసరమైన వైద్యరంగం అభివృద్ధికి ప్రతి దేశం కట్టుబడి ఉండాలి. ఈ క్రమంలో క్యూబాలో వైద్యరంగంలో విప్లవమే తెచ్చింది. అక్కడ వైద్యరంగంలో అనేక ప్రయోగాలు జరిగాయి. వైద్య పరికరాలు, మందులతో పాటు వైద్యసేవలను కూడా ఎగుమతి చేసే స్థాయికి ఆ దేశం ఎదిగింది. కొవిడ్ సంక్షోభకాలంలో అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా క్యూబా వైద్య సేవలందించే స్థాయికి ఎదగటం గమనార్హం. కానీ మనం ఎక్కడున్నాం. కనీసం రోగులకు బెడ్లు దొరకని దుస్థితి. ఆక్సిజన్ అందక ఊపిరాగిన పరిస్థితి. ఇదంతా వైద్యరంగంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీల నిర్వాకం. ఈ దుస్థితి నుంచి దేశ వైద్యరంగం బయటపడాలి. ఒకప్పుడు భారతీయ విద్య, వైద్యరంగం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల నుంచే మన దేశానికి ఉన్నత విద్యకోసం వచ్చేవారు. ఆ క్రమంలోనే నలంద, తక్షశిల విద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదంటే.. పాలకుల ఉదాసీనతే కారణం. విద్య, వైద్యం, ప్రజారోగ్యం పట్ల నిబద్ధత లేకపోవటం.
అనేక దేశాల్లో భారత విద్యార్థులు చెల్లించే ఫీజులతోనే అక్కడి విద్యాలయాలు ఆర్థిక పరిపుష్టిని పొందుతున్న స్థితి ఉన్నదని పరిశీలకులు చెప్తున్నమాట. ఉన్నత విద్యా సౌకర్యాలు, ముఖ్యంగా వైద్య విద్య అందుబాటులో ఉంటే మన విద్యార్థులు విదేశాలకు ఎందుకెళ్తారు? మౌలిక వసతులు కల్పించి అవసరమైన సీట్లు అందుబాటులో ఉంటే ఈ దుస్థితి తప్పుతుంది కదా. అప్పు డు మన విద్యార్థులు వందల కోట్లలో విదేశీ విద్యాలయాలకు చెల్లించే డబ్బు మన దగ్గరే ఉంటుంది. ఉక్రెయిన్ లాంటి ఉపద్రవాన్ని చూసిన తర్వాతనైనా మనం కండ్లు తెరవాలి.
– ఎం.నిర్మల్ కుమార్
89197 23445