ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి, వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 202627 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి సర్కార్ ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది.
సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో, అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నది. ఒకవైపు నేతన్న అప్పులబాధతో సతమతమవుతుండగా, ఈ నిర్ణయాలు వారి బతుకులను మరింత ఆగమాగం చేస్తున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. రేవంత్ సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయం ‘కంచంలోని కూడును లాక్కున్నట్లుగా’ ఉన్నది. ఆర్డర్ను రద్దు చేయాల్సిన అవసరం ఏమున్నది? చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన పాలకులే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏమిటి?
1. స్కూల్ యూనిఫారాలు, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్ర్తాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
2. నేతన్నకు చేయూత వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి, కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు.
3. ముడిసరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు.
4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి, ఆన్లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు.
ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలు సు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేతవర్గాల్లో నిరాశను మరింతగా పెంచింది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే’ అన్నట్లు దయలేని కరుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏమి లాభం, చేనేత కార్మికుడికి కంఠశోష తప్ప! ఇకనైనా నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని వారికి సరైన న్యాయం అందించాలి.
– కోట దామోదర్ 9391480475