2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జాబితాకెక్కలేదు. దేశంలో బీసీ ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో, అసలు వాళ్ల చదువులు ఎట్లున్నయి, వాళ్ల ఆరోగ్యం ఎట్లున్నది, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎందరు? నిరుద్యోగులు ఎందరు? చేతివృత్తులు చేస్తున్నవారెందరు? ఓబీసీల జనగణన చేయకుండా దేశాభివృద్ధిని అంచనా వేయడం అసాధ్యం. అందుకే బీసీల జనగణన యుద్ధప్రాతిపదిక మీద జరపాల్సిన అవసరం అత్యంత అవశ్యం.
ఏదేని ఒక సమస్యను మూలం నుంచి తెలుసుకుంటే దాని పరిష్కారం తేలికవుతుంది. మూలంలోకి వెళ్లని ఏ చికిత్స రోగాన్ని నయం చేయదు. దేశంలో బాధలు పడుతున్న సమూహాలు ఎవరో, వాళ్లు ఎంతమంది ఉన్నారో తెలియకుండా వాళ్ల అభివృద్ధికి ప్రణాళికలు ఎలా రూపొందిస్తారు? కులగణన చేయకపోతే బహుళ సంస్కృతుల భాషల దేశంలో సమస్యల వైవిధ్యాన్ని ఎలా తెలుసుకుంటారు? సరైన సమాచారం లేకుండా తీసుకునే అరకొర చర్యల కారణంగా ఎలాంటి అభివృద్ధి సాధిస్తారు? బీసీ కులగణన చేయమని ఏడు దశాబ్దాల నుంచి ఓబీసీలు అభ్యర్థిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ కనీసం వాళ్ల గోడు పట్టించుకోవడం లేదు. ఈ రెండు పార్టీలు ఓబీసీలను ఓటుబ్యాంకులుగా చూస్తున్నారు తప్ప పట్టించుకోవటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ఓబీసీల పాట పాడతారు. ఎన్నికలు ముగియగానే కార్పొరేట్ యాజమాన్యాలకు సేవ చేస్తూ పోతుంటారు. ఎన్నికలు ముగియగానే దేశ ఆర్థికవ్యవస్థ తాళంచేతులు కార్పొరేట్ల చేతికి అప్పగించేస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరిని మించి మరొకరు దేశాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. కానీ, బహుజనుల జీవితాల్లో మార్పు కోసం మాత్రం ఆ పార్టీలు చేసిందేమీ లేదు.
దేశం సమస్యల వలయంలో ఉన్నప్పుడు బీజేపీ జమిలి ఎన్నికలకు పోవటానికి సిద్ధపడుతున్నది. సగం జనాభా సమస్యల్లో విలవిలలాడుతూ బతుకుదెరువు కోసం అల్లాడుతుంటే దేశం అభివృద్ధి పథంలో వెలిగిపోతుందని ఎట్లా చెప్తుంది? దేశానికి స్వాతంత్య్రం వచ్చినా బీసీల బతుకులు ఎందుకు మారలేదు? స్వాతంత్య్ర పోరాటం దగ్గర్నుంచి ఇప్పటికీ దేశంలో జరుగుతున్న అన్నిరకాల ప్రగతిశీల పోరాటాలు, ఉద్యమాల్లో బీసీలు ధారపోసిన నెత్తురుతో దేశంలోని నేల గడ్డకట్టుకు పోయింది. ఇప్పటికీ విశ్వ విపణిలో దేశ ప్రతిష్ఠకు సంబంధించి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందని చెప్తే అది ఓబీసీల శ్రమతోనే అన్నది నగ్నసత్యం. దేశాభివృద్ధి రథచక్రాన్ని నడిపిస్తున్నది సగం జనాభా గల బీసీలేనన్నది ఎవ్వరైనా ఒప్పుకొని తీరవలసిందే.
బీసీల కోసం బీజేపీ కంటితుడుపు చర్యలు మాత్రమే చేసింది. వాళ్ల జెండా వేరు, అజెండా వేరు. ఇప్పటివరకు ఏలిన బీజేపీ, కాంగ్రెస్కు బీసీల అభ్యున్నతిపై స్పష్టత లేదు. ఆ పార్టీలకు బీసీల జీవన ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన లేదు. కేవలం బీసీలను మభ్యపెట్టడానికే బీసీ ప్రధాని అని బీజేపీ చెప్తున్నది. కానీ, బీసీ సామాజికవర్గాల అభ్యున్నతిపై ఏనాడూ చర్చ చేయలేదు. ఎన్నికల్లో గెలుపు గట్టు చేరటానికే బీసీ జపం చేస్తున్నారు. బీజేపీకి బీసీలపై నిజంగా ప్రేమనే ఉంటే తక్షణం చేయవలసింది బీసీ కులగణన. కానీ ఆ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది. బీసీలంటే బీజేపీ, కాంగ్రెస్లకు లెక్కాపత్రం లేకుండాపోయింది. దేశ ప్రజలకు సమన్యాయం జరగాలంటే బీసీ కులగణన తప్పనిసరిగా జరగాలి.
తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు బాగు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ
గురుకులాలు నెలకొల్పింది. విద్యాభివృద్ధి,ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది.
ఓబీసీల కులగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ముందుకువస్తున్నా కనీసంగా పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ల తీరును దేశంలోని బీసీ ప్రజలందరూ గమనిస్తున్నారు. కులగణన చేస్తే దేశ వనరులు ఎవరి దగ్గర ఎంతున్నాయో తేలిపోతుంది. అందుకే బీసీ కులగణనను పాలకులు పక్కన పడేస్తున్నారు. ఒక్క వనరులే కాదు, ఉద్యోగాలు, పదవులు, పలురకాల అవకాశాల్లో లెక్కలు కూడా తేలుతాయి. ప్రపంచంలో బహుళజాతి కంపెనీలన్నీ డేటాతోనే నడుస్తున్నాయి. దేనికైనా లెక్క ఉంటే మసిపూసి మారేడుకాయలు చేయటం సాధ్యం కాదు. మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో కుకీలు బర్మా నుంచి వస్తున్నారన్నారు. 1911లోని బ్రిటీష్ కాలం నాటి లెక్కలను బయటికి తీశారు. 2011 లెక్కలు తీశారు. అప్పుడు 14 శాతం కుకీలుంటే ఇప్పుడు 16 శాతం అయ్యారు.
దీన్నిబట్టి కుకీలు బర్మా నుంచి వస్తున్నారని చెప్తున్న విషయం అబద్ధమని తేలింది. ఇదే లెక్క బయటకు రాకపోతే బీజేపీ చెప్తున్నదే లెక్కగా మారేది. కులగణన చేస్తే సర్వీస్ సెక్టార్లో వారి స్థానం ఏమిటో తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బీసీల జనాభా 57 శాతం నుంచి 60 శాతం దాకా పోయింది. ఈ లెక్కల లోతుల్లోకి వెళ్తే వనరుల పంపకంలో మార్పు వస్తుంది. బీసీలలో వెనుకబడిన కులాలు, ఉప కులాల మీద నాయకులందరికీ అంతగా అవగాహన లేదు. ఒక్కసారి లెక్కలు తీయక తప్పదు. నీళ్లు, నిధులు, నియామకాలు దేశానికి ప్రాణం లాంటివి. ఇందులో ఓబీసీలకు దక్కాల్సిన వాటా వాళ్లకు దక్కాలి. లెక్కలు తీస్తే బీసీలకు రావాల్సిన వాటాను ఎవరు కొట్టేస్తున్నారో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా సొంతూళ్లను వదిలి వలసలు పోయేది ఒక్క ఓబీసీలే కావడం బాధాకరం.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్)
-జూలూరు గౌరీశంకర్