దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన మండలి స్థానాలు కలిగి దేశరాజకీయాల్లోనే అత్యంత ప్రాధాన్యమున్న రాష్ట్రం యూపీ. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికలపై దేశమంతటా ఆసక్తి నెలకొన్నది. ఎవరు గెలుస్తారన్నది చర్చనీయాంశం అవుతున్నది.
నేటి నుంచి దశల వారీగా ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు రాబోయే దేశ భవితవ్యానికి సూచిక అని రాజకీయ విశ్లేషకుల భావన. ఢిల్లీకి దారి యూపీ నుంచే అంటున్న వాదనల నడుమ దేశమంతా యూపీ వైపే చూస్తున్నది. అయితే ఈసారి యూపీలో బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీల మధ్యే పోరు అన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయప్రధాన కార్యదర్శి ప్రియంకా గాంధీ సారథ్యంలో దూకుడు పెంచటం ఆసక్తి రేపుతున్నది. ఇంకోవైపు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అనూహ్య నిర్ణయాలతో సమీకరణాలు తారు మారు అవుతున్నాయి.
యూపీ రాజకీయాల్లో కృష్ణుడెవరు.. కంసుడెవరు అనే చర్చకు అధికార, విపక్ష పార్టీలు తెరతీశాయి. హిం దువులను ఆకట్టుకుంటే గెలుపు నల్లేరుమీద నడకేనని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. యూపీ జనాభాలో 20 శాతం ముస్లింలు, 80 శాతం హిందువులుంటారు. అన్ని పార్టీలు మెజార్టీ మెప్పుకోసం పోటీ పడుతున్నాయి. హిందువుల ఓట్లపై బీజేపీ ధీమాతో ఉన్నది. ఎస్పీ కూడా ఇరు వర్గాల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నది. కాంగ్రెస్ కూడా అందరి మెప్పుకై గట్టిగానే ప్రయత్నిస్తున్నది.
ఇటీవల యూపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. బీజేపీ నుంచి పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు పార్టీని వీడారు. యోగి ఆదిత్యనాథ్ 80-20 శాతం ఫార్ములా పేరిట మతపరమైన విభజనకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే అఖిలేష్ యాద వ్ సారథ్యంలో సమాజ్వాదీపార్టీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టి, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని అందిపుచ్చుకుంటున్నది. అంతే గాక గత ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ ఎస్పీతో జతకట్టింది. దీని ప్రభావం పశ్చిమ యూపీలో ఎస్పీకి 50 స్థానాల్లో అనుకూలించే అవకాశమున్నది. తూర్పు యూపీలో యాదవేతర ఓబీసీనాయకులు ఎస్పీకి లాభం చేకూర్చే అవకాశాలున్నాయి. పశ్చిమ యూపీలో ముస్లిం లు ఎక్కువ. వారు బీజేపీయేతర పార్టీ వెనుకే నిలిచే అవకాశాలున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ పక్కా ప్రణాళికతో రెండోసారి యూపీ సీఎం పీఠాన్ని అధిష్ఠించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఎస్పీ కూడా కుటుంబ పార్టీ అనే ముద్రనుంచే కాకుండా, యాదవ పార్టీ అన్న అపవాదు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నది. అలాగే ఇతర ఓబీసీ వర్గాలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రె స్ తమ సీఎం అభ్యర్థి ప్రియాంక గాంధీ అని చెప్పకనే చెప్పి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకి గెలుపు అనుకున్నంత తేలిక కాబో దు. ఈసారి మతం కంటే కులమే ప్రభావం చూపుతుందని విశ్లేషకుల అంచనా. సర్వేలు.. అఖిలేష్ యాద వ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని చెబుతు న్నా, బీజేపీ ముఖ్యులు ఆ పార్టీని వీడటం సర్వే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. మోదీ, యోగి భవితవ్యాలు యూపీ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉన్నాయనటంలో సందేహం లేదు.
– పిన్నింటి విజయ్కుమార్, 90520 39109