ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అనేక ప్రయోజనాలను కాంగ్రెస్ ‘తమవి’గా చెప్పుకొంటున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులతో సీఎం రేవంత్రెడ్డి సభ సందర్భంగా హరీశ్రావు, దేశపతి శ్రీనివాస్ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా…
ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి…
పదోన్నతి పొందిన వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనలు. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘తమవి’ అని చెప్పుకొంటున్న కొన్ని అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం వల్ల వాస్తవాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో, అదే విధంగా అమలు చేయవలసిన మీ హామీలతో పాటు వెంటనే పరిష్కరించవలసిన సమస్యలను గుర్తుచేయడానికి, విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ లేఖ రాస్తున్నాం.
వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఈ కింది హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి, ఆదేశాలివ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది.
1. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి పర్యాయం 43 శాతం, రెండో పర్యాయం 30 శాతం ఫిట్మెంట్ను కల్పించింది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనా 30 శాతం పీఆర్సీ ప్రకటించి కేసీఆర్ గారు ఉపాధ్యాయ, ఉద్యోగుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రకటించిన దానికన్నా గొప్పగా పీఆర్సీని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో ఇప్పటికే పీఆర్సీ అమలులోకి వచ్చింది. మరి తెలంగాణలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో విస్పష్టంగా ప్రకటించాలి. మీరు, మీ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్లో ఉన్న కనీసం 4 డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో చెప్పాలి.
2. న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీంను ఎప్పటినుంచి అమలుచేస్తారో ప్రకటించాలి.
3. సర్వశిక్షా అభియాన్లో సేవలందిస్తున్న ఉద్యోగులను మీ మాటలలో చెప్పాలంటే చాయ్ తాగినంత వ్యవధిలో క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చారు. దాని ఊసేలేదు. వారి సమస్యను ఎప్పుడు తీరుస్తారో ప్రకటించండి.
4. పాఠశాలలకు స్కావెంజర్స్ను అనుమతిస్తామన్నా రు. ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలివ్వాలి.
5. పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదు. మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటినీ పరిష్కరించాలి.
6. బదిలీ అయినా ఇప్పటివరకు రాష్ట్రంలో నూతన పాఠశాలలో చేరని ఎస్జీటీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి. బదిలీల వల్ల ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యా వాలంటీర్లను వెనువెంటనే నియమించాలి.
7. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు మీరు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలి.
8. పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారం అందించే పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.