మే నెలలో రెండు వారాల పాటు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బ్రిటన్, అమెరికా పర్యటించినప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ ఆఫీసులు, ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని ప్రకటించాయి. వీటివల్ల మన రాష్ట్ర యువతకు 42,000 ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి 3-4 పరోక్ష ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయి. అంటే సుమారు లక్షన్నర ఉద్యోగావకాశాలు. ఇవ్వాళ దేశంలో మరే రాష్ట్రంలో ప్రైవేట్రంగంలో ఇన్ని కొత్త ఉద్యోగాలు రావడం లేదు. దీనికి కారణం స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రగతిశీల ప్రభుత్వమే.
పెట్టుబడుల ఆకర్షణ కోసం మంత్రి కేటీఆర్ బృందం విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా నగరాల్లో, దేశాల్లో ఉన్న భారత దౌత్యవేత్తలను, కాన్సుల్ జనరల్, హై కమిషనర్లను కలవడం పరిపాటి. ఇలా కలిసిన ప్రతిసారి మా సంభాషణల్లో తప్పకవచ్చే కితాబు ‘భారతదేశంలో 28 రాష్ర్టాలుంటే మరే ఇతర రాష్ట్రమూ పెట్టుబడుల కోసం ఇంతలా ప్రయత్నించడం లేదు. నిజంగా హ్యాట్సాఫ్ టు యూ, అండ్ యువర్ టీం!’
ఒక నగరంలో అయితే అక్కడ స్థానిక భారత కాన్సుల్ జనరల్ మంత్రి కేటీఆర్ను నేరుగానే అడిగేశాడు. ‘తెలంగాణ శ్రమిస్తున్నట్టు మరే భారత రాష్ట్రమూ శ్రమించడం లేదు. దీనికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?’ అని. ‘సర్! స్వరాష్ట్రం సాధించడం కోసం మరే ప్రాంతమూ చేయనంత సుదీర్ఘ పోరు చేసింది తెలంగాణ. అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఇది. రాష్ట్రంగా ఏర్పడితే మేము మనలేమని, ఒక విఫల రాష్ట్రం అవుతుందని అవహేళన చేశారు మమల్ని. అందుకే ఇవ్వాళ మా నాయకునికి, మాకు తెలంగాణను సమున్నతంగా నిలబెట్టాలనే ఒక కసి ఉన్నది’ అని కేటీఆర్ బదులిచ్చారు.
తెలంగాణ ఏర్పాటైన తొలిరోజుల్లో మన మీద జరిగిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేసేవాళ్లు. పరిశ్రమలన్నీ పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయనే ఈ ప్రచారం ఒక దశలో నిజమేనేమో అనే స్థాయిలో హోరెత్తింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం గొప్ప దార్శనికతతో, పక్కా ప్రణాళికతో, పటిష్ఠమైన ఆచరణతో ముందుకుసాగారు. రాష్ట్రం ఏర్పాటైన నెల రోజుల్లోనే స్థానికంగా ఉన్న అన్ని పారిశ్రామిక సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యమకాలంలో ఉన్న అనిశ్చితికి ఇక తెరపడిందని, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైనన్ని మౌలిక వసతులూ సమకూర్చి, ప్రగతిశీల పారిశ్రామిక విధానం తీసుకొస్తామని, పరిశ్రమలకు అవసరమైన కరెంటు, నీళ్లు, భూమి సమకూరుస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కొద్ది కాలంలోనే వాస్తవరూపం దాల్చింది.
ఒకనాడు వారానికి రెండు రోజుల పవర్ కట్తో అల్లాడిన పరిశ్రమలు ఆరు నెలలు తిరిగేసరికి నిరంతర విద్యుత్ అందివ్వడంతో కుదుటపడ్డాయి. టీఎస్ఐపాస్ సింగిల్ విండో ద్వారా నూతన పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులివ్వడం మొదలైంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్క్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, ఏరోస్పేస్ క్లస్టర్, మొబిలిటీ క్లస్టర్ వంటి పారిశ్రామిక పార్కులు, క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు మొదలుపెట్టింది.
ముందుగా ఇప్పటికే ఇక్కడున్న పారిశ్రామికవేత్తల సమస్యలు తీర్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత నూతన పారిశ్రామిక విధానం రూపొందించింది. పలురంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కోసం సెక్టోరల్ పాలసీలను ప్రకటించడం, ఏయే రంగాల్లో అవకాశాలున్నాయో ముందుగానే పసిగట్టి ఆయా రంగాల్లో నిపుణులను ప్రభుత్వంలోకి తీసుకోవడం వంటి చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ర్టాలను తోసిరాజని ముందుకుదూసుకెళ్లింది. మొత్తం 14 ప్రాధాన్యతా రంగాలను ఎంచుకొని, ఒక్కో రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ఏమేం వనరులు అవసరమో బేరీజు వేసుకొని, తదనుగుణంగా విధానాల రూపకల్పన, ఆయా రంగాల్లో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ వంటి సంస్థల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఇవ్వాళ మనకు సత్ఫలితాలనిస్తున్నది.
పెట్టుబడుల ఆకర్షణ అనేది సామాన్యులకు సం బంధం లేని అంశం అని కొంతమంది అభిప్రా యం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడానికి అసలు కారణం ఆయా కంపెనీల రాక ద్వారా మన యువతకు దొరికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలే.
తెలంగాణ ఉద్యమంలో మన ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో నియామకాల రంగంలో తొలుత హామీ ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు దాటి లక్షా ముప్పై మూడు వేల ఉద్యోగాలు భర్తీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏ సమాజంలోనైనా కేవలం 2-3 శాతం జనాభాకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలం. మిగ తావారికి ప్రైవేటు ఉద్యోగాలు, లేదా స్వయం ఉపా ధి అవకాశాలు సృష్టించాల్సిందే. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ఆచరణతో రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ సాగుతున్నది. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రంలోకి రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా సుమారు 18 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించబడ్డాయి.
ఓ వైపు ఐటీలో దిగ్గజ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూనే మరోవైపు అంకుర సంస్థలకు ప్రోత్సా హం కల్పించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వంటి సంస్థల ఏర్పాటు ద్వారా దేశంలో మరే రాష్ట్రంలో లేని ఇన్నోవేషన్ ఎకోసిస్టం నిర్మించారు మంత్రి కేటీఆర్.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పశ్చిమ హైదరాబా ద్ వైపే కేంద్రీకృతమైన ఐటీ పరిశ్రమను నగరంలోని ఇతర భాగాలకు, రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించి నగరానికి వలసలు తగ్గించాలనే మంత్రి కేటీఆర్ ఆలోచన ఇప్పుడు వడివడిగా కార్యరూపం దాలుస్తున్నది. కండ్లకోయ దగ్గర ఐటీ పార్కు నిర్మాణం మొదలైంది. త్వరలోనే మలక్పేటలో కూడా ఐటీ పార్కుకు శంకుస్థాపన జరగనున్నది. ఇక ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్లో ఇప్పటికే ఐటీ టవర్లు ప్రారంభం కాగా త్వరలోనే నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్ పట్టణాలకు కూడా ఐటీ టవర్లు రానున్నాయి. ఐటీ రం గం తెలంగాణలోని ఇతర నగరాలకు విస్తరింపజేయడం వల్ల హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గడంతో పాటు ఇతర పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఈ కొత్త పరిశ్రమ ల్లో ఉద్యోగావకాశాలు స్థానిక యువతకే సింహభాగం దక్కాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ వారు నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పా రు. ఇదే కాక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ తదితర సం స్థల ద్వారా కూడా స్థానిక యువతకు నైపుణ్య శిక్ష ణ నడుస్తున్నది.
కొణతం దిలీప్