డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడలకు దిగుతున్నది. రాజకీయంగా, భౌగోళికంగా తనకు పోటీగా ఉన్న రష్యాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు, డబ్ల్యూటీఓలో సభ్యత్వం కోసం ఏండ్లకేండ్లు వేచి చూసిన చైనా ఇప్పుడు అదే సంస్థను ఆసరాగా చేసుకొని అమెరికాకు, పాశ్చాత్యదేశాలకు గుణపాఠం నేర్పించాలని చూస్తోంది.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ దాడికి గురైంది. అమెరికా నిత్యం నిందించే చైనా, రష్యాల నుంచి కాదు.. స్వయంగా అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి ఈ దాడి జరిగింది. ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవగానే ఈ దేశాలు రష్యాపై విస్తృతమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బతీయడమే వాటి ఉద్దేశం. కానీ అవి రష్యానే కాదు, యావత్ ప్రపంచ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. అంతర్జాతీయ చెల్లింపువ్యవస్థ ‘స్విఫ్ట్’ నుంచి రష్యన్ బ్యాంకుల తొలగింపు, పాశ్చాత్య దేశాల్లో రష్యా కేంద్రబ్యాంకు నిల్వల స్తంభన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆర్థిక అణుయుద్ధంగా పేరొందిన ఈ ఆంక్షలతో అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థికయుద్ధాన్ని ప్రారంభించాయి. అయితే, ఈ క్రమంలో మొత్తం ప్రపంచానికి ఉపయోగపడాల్సిన అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పశ్చిమదేశాల ఆయుధంగా మారింది. ఈ పరిణామం పాశ్చాత్యేతర దేశాల నమ్మకాన్ని కుదిపేసింది. అమెరికా తదుపరి లక్ష్యం తామే కావచ్చన్న అనుమానంతో అవి అమెరికా నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థకు దూరం జరుగుతున్నాయి. అమెరికా డాలర్ ఆధిపత్యం నుంచి, స్విఫ్ట్ నుంచి తప్పుకొనే ఉద్యమం ఊపందుకుంది. రష్యా, భారత్లాగా పలు దేశాలు సొంత కరెన్సీల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించాయి. చైనాకు చెందిన ‘ఇంటర్ బ్యాంక్ చెల్లింపు వ్యవస్థ’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తున్నది. అమెరికా డాలర్ బలహీనపడుతున్నది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థికరంగంలో పెను మార్పులకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ‘అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ’ పతనమై అనేక ప్రత్యర్థి ఆర్థిక వ్యవస్థలు ఉద్భవించే పరిస్థితులు ఏర్పడవచ్చు.
2020 సెప్టెంబర్లో జాతీయ భద్రత’ పేరుతో రూ.16 లక్షల కోట్ల విలువైన చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివక్షా పూరితమైనవని, తద్వారా డబ్ల్యూటీఓ నిబంధనలను అమెరికా ఉల్లంఘించిందని డబ్ల్యూటీఓ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. డబ్ల్యూటీఓ సభ్యదేశాలుగా ఉన్న అర్మేనియా, అజర్బైజాన్ వంటివి తరుచు సాయుధ సంఘర్షణల్లో ఉంటాయి. అయినప్పటికీ అవి అమెరికాలాగా మినహాయింపు నియమాన్ని ఆశ్రయించలేదు. కానీ, అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా మాత్రం అన్ని నియమాలనూ కాలదన్నింది.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ‘జీ-20’ ఎజెండాను కూడా రాజకీయం చేసింది. సభ్యదేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లతో కూడిన జీ-20 సమావేశం గత నెలలో జరిగింది. రష్యాను ఖండించాలని అమెరికా, పశ్చిమ దేశాలు పట్టుబట్టాయి. రష్యా మంత్రి ఉపన్యాసాన్ని అడ్డుకొని చర్చలను బహిష్కరించాయి. కరోనాతో కకావికలమైన ప్రపంచ ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపజేయటం, కరోనా టీకాల పంపిణీ వంటి కీలక సమస్యలను వదిలేశాయి. ఫలితంగా ఏకాభిప్రాయ తీర్మానం కుదరలేదు. 14 ఏండ్ల చరిత్రలో తొలిసారి జీ-20 సదస్సు ప్రకటనను జారీ చేయలేకపోయింది. గత ఏడాది నవంబర్లో (అప్పటికింకా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాలేదు) జరిగిన జీ-20 సమావేశంలో కూడా రష్యా లక్ష్యంగా అమెరికా కుయుక్తులకు పాల్పడింది. ఉక్రెయిన్ను పిలవకుంటే సమావేశాల్ని బహిష్కరిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ బెదిరించారు. జీ-20 సదస్సుని ఆర్థికేతర సమావేశంగా మార్చాలని ప్రయత్నించారు. సదస్సే రద్దయ్యే పరిస్థితి ఉండటంతో ఆతిథ్య దేశం ఇండోనేషియా బైడెన్కు సహకరించింది. దీంతో జీ-20 ఎజెండా పక్కదారిపట్టింది. ఈ విధంగా అమెరికా, పాశ్చాత్య దేశాలు తమ భౌగోళిక, రాజకీయ లక్ష్యాల కోసం ప్రపంచ ఆర్థిక సమస్యలను పక్కకునెట్టాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించవలసిన సమయంలో జీ-20 ఈ విధంగా బలహీనపడటం బాధాకరం.
డబ్ల్యూటీఓలోనూ అమెరికా ఇటువంటి కుట్రలకే పాల్పడటం గమనార్హం. డబ్ల్యూటీఓలో రష్యాకు ఉన్న అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను తొలగించడానికి, జాతీయ భద్రత సాకుతో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రయత్నించాయి. డబ్ల్యూటీఓ నెలకొల్పిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో ఎంఎఫ్ఎన్ అనేది ఒక ప్రాథమిక సూత్రం. డబ్ల్యూటీఓలో ఉన్న ప్రతీ సభ్యదేశం ఇతర సభ్యదేశాలన్నింటికీ ఈ హోదాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక నియమం. దీనిపై మినహాయింపులు పరిమితం. కానీ, అమెరికా మాత్రం అన్ని సభ్యదేశాల నుంచీ జాతీయభద్రత మినహాయింపును కోరుకుంటున్నది. ఈయూ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దండనాత్మక సుంకాల సమర్థనకు ట్రంప్ దీన్ని ఉపయోగించారు. కానీ, ఆయన తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్.. ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి కోసం’ అంటూ వాటిని రద్దు చేశారు. అంటే, జాతీయ భద్రత అంటూ అమెరికా చెబుతున్నది ఒట్టిదేనని బైడెన్ చర్య నిరూపించింది.
రష్యాకున్న ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేయడంలో అమెరికా డబ్ల్యూటీఓ శ్రేయస్సును తుంగలో తొక్కింది. తద్వారా బైడెన్ ఒక ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పారు. అమెరికాలాగే ఇతర సభ్యదేశాలూ మినహాయింపు నియమాన్ని అనుసరిస్తే డబ్ల్యూటీఓ పతనమవుతుంది. 2020లో డబ్ల్యూటీఓ అప్పీలేట్ బాడీని స్తంభింపజేసి ఆ సంస్థను అమెరికా భౌతికంగా బలహీనపర్చింది. ఇప్పుడు జాతీయ భద్రత సాకుతో రష్యా ఎంఎఫ్ఎన్ హోదాను తొలగించి డబ్ల్యూటీఓ మెదడును దెబ్బకొట్టింది. దాదాపు మూడు దశాబ్దాల కిందట డబ్ల్యూటీఓను ప్రపంచం మీద బలవంతంగా రుద్ది లాభపడిన అమెరికాకు ఇప్పుడు దాని అవసరం లేదు. అందుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాన్ని రద్దుపరిచే ప్రయత్నం చేస్తున్నది. అయితే, ఈ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటున్నది. డబ్ల్యూటీఓతో లాభపడుతున్న దశలో ఆ దేశం ఉండటమే దీనికి కారణం. డబ్ల్యూటీఓతో అమెరికా, పాశ్చాత్య దేశాలకు కళ్ళెం వేసి గుణపాఠం నేర్పాలనుకుంటున్నది చైనా. ఈ విధంగా ప్రపంచ ఆర్థికరంగంలో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటువంటి ఫలితాలకు దారితీస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490 20 4545
(వ్యాసకర్త: ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం, జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్)