ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండనున్నది? అది మెజారిటీ ప్రజానీకం అవసరాలనూ, ఆకాంక్షలనూ నెరవేర్చే దిశగా ఉండగలదా? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పుకునే ముందు ఇక్కడ అసలు బడ్జెట్ అనేదాని అవసరం ఏమిటి? ప్రతి ఏడాది ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహించుకుంటున్నాం? అనే ప్రశ్నలకు సంక్షిప్తంగా ఒక సమాధానం అవసరం.
ఒకానొక దేశపు ప్రజానీకం తన ప్రభుత్వాలను, నేతలను ఎన్నుకునేది.. వారిని పాలకపక్షంగా కూర్చోబెట్టడానికి కారణం.. దేశీయ సమస్యల పరిష్కారం, ఆర్థిక పురోగతి వంటివి. కాగా, ఏ దేశంలోనైనా ఆ దేశంలోని అన్ని సమస్యలనూ, ఏ ప్రభుత్వమూ రాత్రికి రాత్రే సంపూర్ణంగా పరిష్కరించలేదు. దీనికి కారణం ఆయా ప్రభుత్వాలకు, ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో అందుబాటులో ఉండే వనరులు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఎప్పుడూ పరిమితమైనవిగానే ఉండడం. అలాగే, దేశంలోని ప్రజానీకం అందరూ ఏకరూప ప్రయోజనాలను కలిగి ఉండరు. అంటే ప్రజానీకంలోని విభిన్న వర్గాల ప్రయోజనాలు విభిన్న రీతుల్లో ఉంటాయి. కాబట్టి, ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించేటప్పుడు తన ప్రాధామ్యాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే, తక్షణ కాల వ్యవధికా? దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకా? ఏ ప్రాధామ్యాల కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను కేటాయించాలి? అలాగే, ఏయే వర్గాల అవసరాలకు పెద్దపీట వేయాలి? వంటి ప్రశ్నలు ప్రభుత్వం ముందు ఉంటాయి. ఇవన్నీ ఆయా ప్రభుత్వాలలోని వారి సామాజిక, వర్గ ప్రయోజనాలు… మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. అలాగే, మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆయా దేశాల ఆర్థిక నిర్ణయాలపై, అంతర్జాతీయ సంస్థలూ… ఇతరత్రా ప్రభావాలు కూడా ఉంటాయి.
ఈ నేపథ్యంలో రేపటి రోజున ప్రవేశ పెట్టే బడ్జెట్ గురించిన అంచనాలను వేసుకోవాలి. ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
పైన పేర్కొన్న తక్షణ అవసరాలను
తీర్చటంలో బీజేపీ ప్రభుత్వం
తాలూకు పరిమితులు..
స్థూలంగా ఈ నేపథ్యంలో అంటే దేశీయ ప్రజల తక్షణ అవసరాలూ… అందుబాటులోని వనరులూ… అలాగే బీజేపీ తాలూకూ రాజకీయ ఆర్థిక ఆభిముఖ్యాలు, అనుకూలతలు… అంతర్జాతీయ ఒత్తిడులు అన్నీ పరిగణనలోకి తీసుకుంటేనే మనం రేపటి బడ్జెట్ ఎలా ఉంటుందో ఒక అంచనాకు రాగలం.!
ముందుగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రధాన సమస్య ప్రజల కొనుగోలు శక్తి పతనం (నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల వల్ల). దీనికి పరిష్కారం ఉపాధి కల్పన, ధరల నియంత్రణ, మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాల అమలు వంటివి. కా గా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 1. ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలి. 2. ప్రభుత్వమే పూనుకొని భారీగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలి. 3. గ్రామీణ ఉపాధిహామీ పథకం వంటి వాటితోపాటుగా నగర ప్రాంతాలలో కూడా ఉపాధి కల్పన కార్యక్రమాలను చేపట్టాలి.
అయితే కేంద్రంలోని బీజేపీ ఇప్పటి వరకూ వ్యవహరిస్తున్న తీరు పైన పేర్కొన్న ఏ ఒక్క అంశంలోనూ సంతృప్తికరంగా లేదు. దేశంలో నేడు లక్షలాది కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ, ఎన్నికల ఏడాదిలో నామమాత్రంగా కొద్దిపాటి ఉద్యోగాలు భర్తీ చేసి కొండలా పెరిగిపోతున్న నిరుద్యోగ జనాభాను ప్రభుత్వం తగ్గించలేదు. 2008లో ఆర్థిక మాంద్యం స్థితి నుంచి మన దేశాన్ని ఆదుకున్నది జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ రోజున ఈ పథకం కోట్లాది మంది దేశ గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని నిలిపి ఉంచింది. కానీ, నేడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల షరతులకు లోబడి ద్రవ్యలోటును తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన ఖర్చులను తగ్గించుకొనేందుకుగానూ ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలనూ భర్తీ చేయకుండా (మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ వంటి మోసపూరిత నినాదాలను ముసుగుగా వేసి) వదిలివేస్తున్నది. అలాగే, జాతీయ ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు తగ్గించేస్తున్నది. పథకం కింద పని అడుగకుండా, ఉపాధి కూలీకి అవసరమైన జాబ్ కార్డు ఉన్నవారిని రకరకాల పద్ధతులలో నిరుత్సాహపరుస్తూ (వేతనం చెల్లింపులలో జాప్యం, ఆధార్ లింక్ వంటివి) ఈ పథకాన్ని నిర్వీర్యపరుస్తున్నది. మరో పక్కన నేడు ఆర్థికమాంద్యం స్థితిలో దేశీయ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, వారి కొనుగోలు శక్తిని కాపాడగల ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా దేశీయ, విదేశీ కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అప్పగించి కూర్చున్న కొమ్మను నరుక్కొనే తీరులో కేంద్రంలోని ప్రభుత్వ వ్యవహారశైలి ఉన్నది.
ఈ మొత్తం క్రమంలో ధనికులు, కార్పొరేట్ల దాస్యంలో తరించే ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు కొమ్ముకాస్తున్న ప్రస్తుత కేంద్రంలోని పాలకులు రానున్న బడ్జెట్లో కూడా ఈ పరిధిని దాటి చేయలిగింది, చేసేదీ ఏమీ ఉండదు. రానున్నది ఎన్నికల ఏడాది లేదా సీజన్ అయినా సరే ఇది ముమ్మాటికీ నిజం..!!
అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, షేర్ మార్కెట్ మదుపుదారుల సెంటిమెంట్ను నొప్పించకుండా చేసే ప్రయత్నం మాత్రమే ఈ బడ్జెట్లో అనివార్యంగా ఉండి తీరుతుంది. అలాగే, పెద్దనోట్ల రద్దు మొదలుకొని… జీఎస్టీ అమలు వరకూ జరిగిన అన్ని విధానాల క్రమంలో లాగానే ‘కాకులను కొట్టి గద్దలకు వేయటం, పేదలను పిండి పెద్దలకు పెట్టటం’ అనేవి ఈ బడ్జెట్లో కూడా కొనసాగుతాయి (కాకుంటే ఎన్నికల ఏడాది మొహమాటాలు కొద్దిగా అడ్డు రావొ చ్చు). ఈ క్రమంలోనే రానున్న బడ్జెట్లో ఖర్చులను తగ్గించుకొనే పనిలో భాగంగా ఆహార సబ్సిడీలనూ, ఎరువుల సబ్సిడీలనూ తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుందని ఇప్పటికే దేశంలోని వ్యాపార పత్రికలన్నీ మహా సంతోషంగా చెబుతున్నాయి. అంటే ఇప్పటికే ప్రపంచ క్షుద్భాధితుల జాబితాలో దిగజారిపోయిన మన ర్యాంకులు, రానున్న కాలంలో మరింత తగ్గినా ఆశ్చర్యం లేదు. అలాగే, ఎరువుల సబ్సిడీలు తగ్గించుకునే క్రమంలో సహజ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం వంటి సిద్ధాంతాలూ, సూత్రీకరణలు మరింత బలంగా ముందుకు నెట్టబడుతాయి. అయితే, ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయమంటూ, రైతులను ఆ దిశగా నెట్టిన శ్రీలంకలోని రాజపక్స ప్రభుత్వం దేశంలో ఆహార కొరతలు ఏర్పడి ప్రజల తిరుగుబాటును ఎదుర్కొన్న వాస్తవాన్ని మనమిక్కడ మరువలేం.
రానున్న బడ్జెట్ తీరుకు మరొక సూచికగా, ‘టాక్స్ పేయర్ మనీ’ (పన్ను చెల్లింపుదారుల డబ్బు) అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న ప్రభుత్వ పెద్దల తీరు ఉండగలదు. అంటే, కొద్ది మంది దేశీయ పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుల ఆదాయాన్ని ‘ఉచితాలు’గా ‘అలగా’ జనానికి పంచేయటం బాధ్యతారాహిత్యం అనే వాదన. జన సామాన్యాన్ని కొల్లగొట్టి… పై వాళ్లకు… పెద్దవాళ్లకూ విందు చేస్తున్న తమ విధానాలను కప్పి పుచ్చుకునేందుకూ అలాగే దేశ సంపదకు అసలైన యజమానులైన పేదలు, సామాన్య జనం నుంచి వారి శ్రమ తాలూకూ ఫలాలను కొల్లగొట్టేందుకు చేసేవే ఈ వాదనలు.
ఉదాహరణకు పరోక్ష పన్ను అయిన జీఎస్టీనే తీసుకుందాం: ఈ పన్ను కింద లభించే ఆదాయంలో 64 శాతం మేర చెల్లిస్తున్నది దేశ జనాభాలో దిగువన ఉన్న 50 శాతం జనాభానే..! కాగా, మధ్యలో ఉన్న 40 శాతం మంది కట్టేది పన్ను ఆదాయంలో 33 శాతం. కాగా, ఇక ధనికులైన 10 శాతం మంది చెల్లించేది కేవలం 4 శాతం వాటాయే. కాగా, ఈ విషయాన్ని విస్మరించి కేవలం ప్రత్యక్ష పన్ను అయిన ఆదాయపు పన్నునే ప్రభుత్వం ఏకైక ఆదాయ వనరుగా చిత్రీకరిస్తూ మధ్య తరగతి వర్గం వారిని సామాన్య జనంపైకి ఉసిగొల్పుతుంది. అంతిమంగా ఇటు జన సామాన్యాన్ని.. అటు మధ్య తరగతిని ఇద్దరినీ కొల్లగొట్టి కార్పొరేట్ గద్దలకు పంచుతున్నది ప్రభుత్వం. ఒక పక్క కనపడ్డ ప్రతి వస్తువు మీద, ఆఖరుకు తిండి గింజలమీదా, పాలు, పెరుగు, మజ్జిగ, మాంసంతో సహా అన్నింటిపైనా జీఎస్టీ వడ్డిస్తున్నది. మరో పక్క కార్పొరేట్ టాక్స్ను భారీగా తగ్గించి, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పేరిట కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను నజరానాగా ఇస్తుండటం ప్రభుత్వ తీరుకు స్పష్టమైన సంకేతం.
ఇది ఎన్నికల సంవత్సరం కనుక, ఈ బడ్జెట్ తన దోపిడీ దొరల సేవ కోసం, జనాలకు విషం ఎక్కించేందుకు గానూ ‘దేశభక్తి, ‘దైవభక్తి’ వంటి తీపి పూతలను మరింత రెట్టించి, దట్టించే అవకాశం ఉన్నది. ఇక తన పునాది వర్గమైన మధ్య తరతిని, ఉద్యోగులను మైమరిపించేందుకు అంతంత మాత్రపు ఆదాయపు పన్ను రాయితీ అనే కనికట్టును మాత్రం బడ్జెట్లో ప్రదర్శించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ఈ ధనికుల అనుకూల విధానం ముదిరి పాకాన పడి నేడు హిండెన్బర్గ్ అనే సంస్థ నివేదికలో ‘స్కాంస్టర్’గా ముద్రవేయబడిన, 8 ఏండ్లలోనే అత్యంత ధనికుల ఫోర్బ్స్ ర్యాంకు హోల్డర్గా నిలిచిన అదానీ పుట్టుకొచ్చాడనే ఆరోపణలు అందరికీ తెలిసినవే. కాబట్టి ప్రస్తుత బడ్జెట్ కూడా గత అనేక సంవత్సరాల బడ్జెట్ల లాగానే అదే తీరులో… అంటే ప్రజలకు పెద్దపెద్ద వాగ్దానాలు… ధనవంతులకు నజరానాలుగానే కొనసాగుతుందనటం నిస్సందేహం. కాకుంటే ఇది ఎన్నికల సంవత్సరం కనుక, ఈ బడ్జెట్ తన దోపిడీ దొరల సేవ కోసం, జనాలకు విషం ఎక్కించేందుకు గానూ ‘దేశభక్తి, ‘దైవభక్తి’ వంటి తీపి పూతలను మరింత రెట్టించి దట్టించే అవకాశం ఉన్నది. ఇక తన పునాది వర్గమైన మధ్య తరగతిని, ఉద్యోగులను మైమరిపించేందుకు అంతంత మాత్రపు ఆదాయపు పన్ను రాయితీ అనే కనికట్టును మాత్రం బడ్జెట్లో ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే ఈ భ్రమ తాలూకూ సంతోషాన్ని ఆవిరి చేసేందుకు రెండో పక్కన మార్కెట్లో పెరిగిపోతున్న ధరలూ, అలాగే, ఈ రాయితీతో తాము మిగుల్చుకోగల మొత్తం గురించిన బ్యాక్ ఆఫ్ ది ఎన్వెలప్ లెక్కలు ఎటూ కూడి ఉండనే ఉన్నాయి.!!
అందుకే బడ్జెట్ గురించి చెప్పేదొకటే. ఎక్కువ ఆదుర్దా పడొద్దు.. కాస్తంత ఆలోచించి స్థిమితపడితే అర్థమయ్యేది అంతా భ్రమేననేది…!!!
తస్మాత్ జాగ్రత్త…
డీ పాపారావు:98661 79615