ఎన్నో సుదీర్ఘ పోరాటాలు, ఎందరో త్యాగధనుల బలిదానాల ఫలితంగా.. 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలో దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ఇటు ప్రజా సంక్షేమంలో, అటు అభివృద్ధిలో యావత్ దేశానికే మార్గదర్శకంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. ‘తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది’ అని చెప్పుకొనే స్థాయికి మన రాష్ట్రం చేరుకోవడం ప్రజలందరికీ గర్వకారణం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ‘సంపదను సృష్టించు-దాన్ని ప్రజలకు పంచు’ అనే నినాదం తెలంగాణలో అమలవుతున్నది. ఆ విధంగా పెరిగిన సంపదే రాష్ట్రంలో ఆర్థిక సుస్థిరత నెలకొల్పటంలో కీలకపాత్ర పోషిస్తున్నది. తెలంగాణ అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టి అడ్డుకున్నా రాష్ట్రం ఏనాడూ రాజీ పడలేదు, తలవంచలేదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యాక, నాటి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సారథి కావడంతో ప్రజలకు ఏం చేయాలో స్పష్టత వచ్చింది. ఉమ్మడి ఏపీలో వివక్షకు, విధ్వంసానికి గురైన తెలంగాణ ప్రజానీకానికి స్వరాష్ట్రంలో భరోసానిచ్చేందుకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, తాగు, సాగు నీటి కోసం మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పూర్తి, కేసీఆర్ కిట్స్.. ఇట్లా ఎన్నో పథకాలు రూపుదిద్దుకున్నాయి. సీఎం కేసీఆర్ మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనికతతో కూడిన ప్రణాళిక రచన, పారదర్శక పాలన.. వీటన్నిటి కలయిక అయిన తెలంగాణ మాడల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. తెలంగాణ రైతుబంధు పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రధాన్మంత్రి కిసాన్ యోజన పేరుతో, మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ జల్ పేరుతో, రేషన్ పోర్టబిలిటీ పథకాన్ని వన్ రేషన్-వన్ నేషన్ పేరుతో అమలు చేస్తున్నది. తెలంగాణ పథకాలను పలు రాష్ర్టాలు కూడా వేరే పేర్లతో అమలు చేస్తున్నాయి. దేశంలో ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని దేశంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. ఎలాంటి సంక్షోభ సమయాల్లోనైనా, సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు చేయగలగటం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందనడం అతిశయోక్తి కాదు.
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణకు నేడు దేశ ప్రజలంతా నీరాజనాలు పలుకుతున్నారు. మన పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలు తమ వద్ద కూడా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణం పరిరక్షణ, పచ్చదనం పెంపులో తెలంగాణ సాటిలేని మేటిగా నిలిచింది. కంటి వెలుగు పథకాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇట్లా తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. అన్నిరంగాల శాశ్వత అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దింది. సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన ఎన్నో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించడం మనకు గర్వకారణం. మన రాష్ట్రంలో అమలైన అభివృద్ధి పథకాలను యావత్ దేశం అనుభవించే రోజులు వస్తాయి.
తక్కెళ్లపల్లి రవీందర్రావు
(వ్యాసకర్త: బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు)