‘సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించారు. ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామిక విలువలు పాదుకొన్న తీరును, తదనుగుణంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాలను ఎంతగా అధ్యయనం చేశారో, మన దేశ సంక్లిష్ట సామాజిక స్వరూపాన్ని కూడా ఆయన అంతే లోతుగా అర్థం చేసుకున్నారు. ఆయన అందించిన సేవలతో భారత రాజ్యాంగం విశిష్టమైనదిగా, విలక్షణమైనదిగా నిలిచిపోయింది. స్వాతంత్య్రోద్యమ కాలం అందించిన మహనీయులలో అగ్రశ్రేణి ఆణిముత్యం బాబాసాహెబ్ బీ.ఆర్.అంబేద్కర్. ఆయన పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించే తీర్మానాన్ని రాష్ట్ర శాసన సభ ఆమోదించడం ప్రశంసనీయం.
అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన రాజ్యాంగవేత్త ఐవర్ జెన్నింగ్ను భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధినేతగా నియమించాలని నెహ్రూ మొదట భావించారు. కానీ ప్రపంచ రాజ్యాంగాలను ఔపాసన పట్టిన సకల శాస్త్ర కోవిదుడు అంబేద్కర్ మనదేశంలోనే ఉండగా ఇతరులు ఎందుకని పేర్కొంటూ గాంధీజీ.. అంబేద్కర్ పేరు సూచించారు. 1919 మొదలుకొని భారత రాజ్యాంగ చర్చలలో అంబేద్కర్ భాగస్వామి. నాటి రాజకీయ పరిణామక్రమానికి ప్రత్యక్ష సాక్షి. రాజ్యాంగానికి ప్రజాస్వామిక, సంక్షేమ పరిమళాలు అద్దడంలో ఆయన పాత్ర విస్మరించలేనిది. రాజ్యాంగం మంచిదా చెడ్డదా అనేది దానిని అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుందని ఆనాడే వెల్లడించారు. రాజ్యాంగ సభ చర్చలలో ఒక్కో అంశంపై తర్కవితర్కాలు సాగినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యానాలు, ఇచ్చిన స్పష్టీకరణలు నేటికీ రాజ్యాంగంపై గల దురవగాహనను చెల్లాచెదురు చేస్తాయి.
ఏదైనా పెద్ద రాష్ట్రం నుంచి భాషాపరంగా లేదా సాంస్కృతిక పరంగా చిన్న ప్రాంతం విడిపోవాలనుకున్నప్పుడు సంబంధిత రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదనే నిబంధనను (ఆర్టికల్ 3ను) రాజ్యాంగంలో అంబేద్కర్ పొం దుపరచడం ఆయన ప్రజాస్వామిక దృక్కోణానికి నిదర్శనం. ఈ నిబంధనే లేకపోతే తెలంగాణ వంటి ప్రాంతాలకు రాజ్యాంగపరంగా వెసులుబాటు లేకపోయేది. అహింసామార్గాన్ని మూసివేసినట్టయ్యేది. అంబేద్కర్కు నివాళులు అర్పించడమంటే ఆయన పేర విగ్రహాలు పెట్టడానికే పరిమితం కావడం కాదు. పేదల సంక్షేమ విధానాలు అమలు చేస్తూ, దళిత బంధు వంటి ప్రగతిశీల పథకాలను అమలు చేయడమే ఆయనకు సముచిత నివాళి. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ తీర్మానం చేయదగిన నైతికత తెలంగాణ శాసనసభకు ఇటువంటి పేదల అనుకూల విధానాల మూలంగానే లభించింది.