నాడు నీళ్లు లెవ్వు, నిధుల్లెవ్వు, నియామకాలు అసలుకే లేవు..‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. ఏం చేసుకుంటారో చేస్కోండ’ని అసెంబ్లీ వేదికగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాంతంపై చిన్నచూపు చూసినప్పుడు ఎటూ పాలుపోకుండా, బిక్కుబిక్కుమని చూసిన చరిత తెలంగాణ ప్రాంత నాయకులు, ప్రజలది.
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్రజోపయో గ బడ్జెట్ను ప్రవేశపెట్టుకొని గంభీరంగా నిలిచింది తెలంగాణ. ఇది కదా విజయం అం టే? ఇది కదా సాధించుకున్న తెలంగాణకు సార్థకత అంటే? ఈ బడ్జెట్ పద్దులను చూసి న ప్రజలు ‘ఇందుకే నా తెలంగాణ’ అని గర్వంగా ప్రకటించుకుంటున్నారు.
నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ సుమారు మూడు లక్షల కోట్లు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధికి, మరోవైపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. తెలంగాణ రాకముందు ‘అన్నమో రామచంద్రా’ అంటూ కరువు కాటకాలతో అల్లాడిన రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతాంగం జీవితాల్ని మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కూడా సరైన ప్రాధాన్యం కల్పించింది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇతరత్రా రైతు సంక్షేమ పథకాల కోసం వారికి కొండంత ధీమా కల్పించింది. మొత్తంగా బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోమారు నిరూపించుకున్నారు. ‘సంపదను పెంచడం, పేదలకు పంచడమే’ మా పని అని తరచూ చెప్పే కేసీఆర్ పెరిగిన సంపదను నిన్నటి బడ్జెట్ రూపంలో ప్రజలకు పంచి మాట తప్పని, మడమ తిప్పని యోధుడనని చాటుకున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి మాడల్గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మొన్న ఖమ్మంలో, నిన్న నాందేడ్లో జరిగిన బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజానీకాన్ని తాజా ఉదాహరణగా తీసుకోవచ్చు. అవమానాల మధ్య, అవహేళనల మధ్య తెలంగాణను సాధించిన కేసీఆర్ అదే పంథాలో దేశంలోనూ విజయం సాధిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ విజయ్: 94919 98702