నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకోవాలంటే చరిత్రలో గతించిన కొందరు పాలకుల లక్షణాలు అర్థం చేసుకోవాలి. 49 ఏండ్లు అతిక్రూరంగా, ఇతర మతస్థుల మీద, ప్రత్యర్థుల మీద అమిత ద్వేషం చూపిన ఔరంగజేబు, 20 ఏండ్లు ప్రజలను, ప్రత్యర్థులను భయపెట్టి పరిపాలించిన ఇటలీ నియంత ముస్సోలినీ, వేలమందిని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి క్రూరంగా చంపి ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లరే గుర్తొస్తారు. మనది పేరుకైనా ప్రజాస్వామ్యం కాబట్టి గ్యాస్ ఛాంబర్ కాకుండా, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచి, గ్యాస్ బదులు జీఎస్టీ పెట్టి సామాన్యులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు మన ప్రధాని మోదీ.
తాను ఎంతో బీదరికంలో బతికానని చెప్పుకొనే మోదీ దేశంలోని బీద, సామాన్య ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎందుకని ప్రవర్తిస్తున్నాడు? అసలే గుజరాతీ సహజ వ్యాపార లక్షణాలు, ఆ పైన చాయ్ అమ్మిన అనుభవం! చిన్నప్పటి నుంచీ అమ్మటమనే ప్రక్రియ మీద మక్కువ పెరిగింది. అందుకే ప్రధానమంత్రి అయ్యాక తన అధీనంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ఆనందం పొందుతున్నాడు.
మోదీ గారికి బీదరికాన్ని నిర్మూలించటం అంటే బీదవారు లేకుండా చేయడం అనే అభిప్రాయం బలంగా ఉన్నది. అందుకే దాదాపు 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో 40 నుంచి 80 శాతం దాకా పెరిగిన మధ్యతరగతి వారి జీవితాలలో గత ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఊహించలేనంత మార్పులు సంభవించాయి. భారతదేశ జనాభాలో దాదాపు 19 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నట్టు గణాంకాలున్నాయి. గత ఎనిమిదేండ్లలో దిగువస్థాయి మధ్య తరగతివారిలో 20 శాతం ఈ దారిద్య్ర రేఖకు కిందికి జారిపోయారు. అంటే రెండు పూటలా తిండి గడవని పరిస్థితిలో పడిపోయారు.
అందుకే 121 ప్రపంచ దేశాల ఆకలి కేకల పట్టికలో 2013లో 63వ స్థానంలో ఉన్న భారతదేశం, 2022లో 107వ స్థానానికి దిగజారి, పాకిస్థాన్, నేపాల్ వంటి దేశాల కంటే హీనస్థితిలో ఉన్నది. ‘అరవై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి ఏం ఉద్ధరించింది’ అని మోదీ తన ఎన్నికల ఉపన్యాసాలలో అడిగినప్పుడు, ప్రజలంతా ఉప్పొంగిపోయి 2014లో ఆయనకు పట్టం గట్టారు. ఆకలికేకల పట్టిక లోంచి మన దేశాన్ని తప్పిస్తాడనుకుంటే, మోదీ గారు తన పథకాల విన్యాసాలతో ఎనిమిదేండ్లలో భారతదేశాన్ని 44 స్థానాలు దిగజార్చి తన పరిపాలనా వైఫల్యాన్ని ప్రదర్శించాడు. ఇక మధ్యస్థ, ఎగువ స్థాయిలలో ఉన్నవారు కూడా ఈ జారుడు బండ నుంచి తప్పించుకోలేకపోయారు.
నిరుద్యోగం, వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యం, సంపన్న వ్యాపారవర్గాలకే అనుకూలించే పథకాలు, ప్రణాళికలు- అన్నీ కలిసి మధ్యస్థాయి వారు 15 శాతం, ఎగువ మధ్యతరగతి వారు 12 శాతం తమ కంటే కిందస్థాయిలోకి జారిపోయారు. వెరసి 80 శాతం ప్రజలకు జీవనం కష్టతరమైపోయింది. కాంగ్రెస్ చేయవలసినంత చేయలేదు. నిజమే! కానీ, కక్ష గట్టినట్టు మధ్య తరగతి వారి జీవనవిధానాన్ని మోదీ ప్రభుత్వం లాగా నడ్డి విరవలేదు.
అయితే ఈ 80 శాతం జారుడు చూసి మనం నిరాశపడనక్కరలేదు. మోదీగారి మొదటి బ్రహ్మాస్త్రం డీమానిటైజేషన్ నవంబర్ 8న 2016లో ప్రయోగింపబడితే, రెండు నెలల ముందే రిలయన్స్ మనీకార్డ్స్ వచ్చేశాయి ప్రజలనుద్ధరించటానికి, అప్పటినుంచీ ప్రధానమంత్రి అమ్ముల పొదిలో ఉన్న ఒక్కొక్క అస్త్రం మన సంపన్న వర్గాల వ్యాపారాలని, వారి ధనాదాయాన్ని లక్షల కోట్లలో పెంచి జాతీయ కుబేరులని అంతర్జాతీయ కుబేరులుగా మారుస్తోంది. 80 శాతం దేశంలో కష్టపడితేనేం, మన జీడీపీ పెరిగిపోతూనే ఉంది. వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుల సంపద కలుపుకొని మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నామని కేంద్ర ఆర్థికమంత్రి ఆనందం వ్యక్తం చేశారు కూడా. అయితే మోదీ పాలనలో జీడీపీ మాత్రమే పరిగణించాలి, తలసరి ఆదాయం చూడొద్దు, ఎందుకంటే ఇంకొక రెండుసార్లు వారి పాలన సాగితే ఈ బీదవారు, మధ్యతరగతి వారు మాయమైపోవడం ఖాయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే కదా! ‘హైర్ ఎండ్ ఫైర్’ విధానంతో ఉద్యోగులను తీసేసి, ప్రభుత్వ విద్యాసంస్థలు మూసేసి, సామాన్యులకు అవసరమైన ప్రభుత్వ దవాఖానలు కట్టకుండా ప్రైవేటు విద్యాసంస్థలు, దవాఖానలను ప్రోత్సహించి జీవితాన్ని వ్యాపారంగా చేసేశారు. ఇప్పుడు వ్యాపారధోరణి కలిగిన మన గుజరాతీ ప్రధాని పాలనలో ఈ దేశమే ఒక వ్యాపార ఆధారిత ప్రాంతంగా మారిపోతుంది. డోక్లాలను కొన్నంత తేలికగా మనుషులను, ముఖ్యంగా రాజకీయ నాయకులను కొనే వసతి ఏర్పాటైపోయింది. కొద్దిగా ఎక్కువ ఖర్చవుతుంది. అంతే! ఇంకా దేశ సంపద అంతా దేశంలోని కుబేరులను ప్రపంచ కుబేరులుగా చేయటానికి మళ్లించబడుతోంది.
ఇక సామాన్యులకు మిగిలినవి వేల అడుగుల ఎత్తు విగ్రహాలు, గుళ్లు గోపురాలు! డీమానిటైజేషన్ నుంచి డిజిటల్ రూపాయి దాకా అన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు సమస్యలు కలిగించేవే. వంద రూపాయల నోటు దాకా ఉంచేసి, ఆపైన లావాదేవీలు డిజిటలైజ్ చేస్తే సరిపోదా? ఇక ఇప్పుడు వస్తున్న డిజిటల్ ఎకౌంట్లలో ధనమంతా ఒక అర్ధరాత్రి వేళ అంబానీ, అదానీ అకౌంట్లలోకి వెళ్లి పోతే ఏం చేస్తాం? ఆలోచించండి.
వచ్చే ఎన్నికలలో బీజేపీ ఏమి చెప్పి ప్రజల ఓట్లు గెలవాలి? 2014లో కాంగ్రెస్ వైఫల్యాలు, కుటుంబపాలన, 2019లో జై శ్రీరామ్, 370 ఆర్టికల్, తలాక్ బిల్లు! మరి 2023లో మోదీ మంత్రం ‘విశ్వ గురు.’ గుజరాత్ రాష్ట్రం అయిపోయింది, భారతదేశం అయిపోయింది; ఇక అలెగ్జాండర్ విశ్వపాలకుడవాలని అనుకున్నట్టు, మన ప్రధాని విశ్వగురువు అవాలన్న మాట. దానికోసమే, అన్నిదేశాలూ విస్తృతంగా పర్యటించి, వారితో మైత్రి నటించి, తాను దేశంలో పాటించని ధర్మాలు, విలువల గురించి ప్రవచించి, దేశ ప్రజలకు లేకుండా కరోనా మందులు ప్రపంచదేశాలకు లక్షల డోసులు పంపించి తన అనుయాయులతో విశ్వ గురు అని ప్రచారం చేయించుకుంటున్నాడు ప్రధాని. ఇవన్నీ నటనలు అని చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు.
అవసరమైతే ప్రపంచానికే భారతదేశం అన్నం పెడుతుందని ప్రకటించిన మహా మనీషి, సస్యశ్యామలంగా మారి లక్షల ఎకరాల్లో బియ్యం పండించిన తెలంగాణను వడ్లు కొనకుండా అంత ఏడిపించడమెందుకు? ఆ బియ్యాన్ని కేంద్రమైనా తీసుకొని కరోనా దెబ్బతో ఆకలికి అలమటిస్తున్న ఆఫ్రికా దేశాలకైనా పంపవచ్చు! లేక ఆ ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. తెలంగాణ, పంజాబ్ వంటి సుసంపన్న రాష్ర్టాలు ఆ పనిచేయగలవు కదా! ఇది దేశ ప్రతిష్ఠ పెంచదా? ఆలోచించండి, మోదీ మాటలకు, చేతలకూ మధ్య ఎన్ని వేల, లక్షల మైళ్ల దూరముందో!
మొదటిది సంపన్నవర్గాలకు దేశ సంపద దోచిపెట్టడమైతే, మోదీ రెండవ భయంకర సిద్ధాంతం సామాన్య ప్రజలలో మతపరంగా విద్వేషం పెంచడం. అన్ని మతాలు సామరస్యంతో మెలగాలన్నది సనాతన ధర్మం అయితే, హిందుత్వ అనే రాజకీయ సిద్ధాంతంతో దేశంలో మళ్లీ మత చిచ్చు రాజేశారు బీజేపీ నాయకులు. మతాభిమానం అంటే మనం నమ్మే మతాన్ని అభిమానించి ఆదరించడం, అనుసరించడం! దురభిమానం అంటే ఇతర మతాలన్నింటినీ ద్వేషించడం, వారికి చెడు చేయడం.
కులమైనా, భాషయినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. వన్ నేషన్ అంటే ఒక్క దేశంగా ఐక్యతలో నిలవడమా? అందరూ ఒకే మతం పాటించడమా? యూనిటీ అంటే యూనిఫామిటీ కాదు. పాఠశాల విద్యార్థుల లాగే ఒకేరకం, ఒకే రంగు బట్టలేసుకొని, ఒకే రకం ఆహారం తినటం కాదు. ఎవరి జీవనవిధానాన్ని వారు అనుసరిస్తూ శాంతి సౌఖ్యాలతో బతుకుతూ, మనమంతా ఒకే దేశస్థులం అన్న మానసిక భావన కలిగి ఉండటం, ఒకరికొకరు సామాజికంగా సహాయం చేసుకోవడం. మరి మత, భాషాపరంగా ద్వేషాలు పెరిగితే ఇది సాధ్యమా? ప్రజలంతా ఆలోచించాలి.
ఇంత వైవిధ్యభరితమైన భారతదేశంలో అన్నీ కేంద్రీకృతం చేయటం, ఆచరణసాధ్యం కాదు, అనుసరణీయమూ కాదు. అది తెలివి తక్కువతనానికి పరాకాష్ఠ! ఇక్కడ మనం ఒక ఉదాహరణగా అమెరికాను తీసుకోవచ్చు. యూరప్లోని వివిధ దేశాల వారు అమెరికాలో వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వారు వలస వచ్చినా, బ్రిటిష్ వారి పాలనలో ఆంగ్ల భాషను మాతృభాషగా అంగీకరించి, రాజకీయంగా, సామాజికంగా ఏకీకరణ అయినా, ఏ రాష్ట్రం వారు వారి పురాతన సంస్కృతిని పాటిస్తారు. అందుకే వారి రాజ్యాంగం రాష్ర్టానికీ, రాష్ర్టానికీ విడివిడిగా తయారు చేసుకున్నారు. అమెరికా లాగానే మనదేశంలో ప్రతి రాష్ట్రం తన మాతృభాషను, సనాతన సంస్కృతిని గౌరవించి అనుసరిస్తుంది. మరి ఇక్కడ కూడా రాజకీయ, సామాజిక నియమాలు ఒక్కటే ఉండచ్చు కానీ ప్రాంతీయ సంస్కృతిని, భాషను మర్చిపోమ్మంటే సాధ్యమా? ఎప్పటికీ కాదు, అటువంటి ప్రయత్నాలు ప్రజలను విడదీస్తాయే కానీ, ఐక్యత పెంచవు.
ఇక ఇప్పుడు తెలంగాణపై మోదీ గారి దండయాత్ర గురించి చెప్పాలి. ఇదివరకటి ఎన్నికల ప్రమాణాలు ఏమయ్యాయి? ప్రాజెక్టులు, రైతుకు భరోసా ఇచ్చే పథకాలు ఏమైనా చెప్పారా? ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వం పడిపోయి తమ ప్రభుత్వం రావాలనే తప్ప, నికరంగా ఈ పథకాలు చేస్తామని చెప్పారా? నిన్నగాక మొన్న పట్టుబడిన వారి ఏజెంట్ల మీద చర్చలు, విచారణ జరుగుతుండగానే, అవినీతి లేని తమ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పడం ఎంత హాస్యాస్పదం!
నిజంగా బీజేపీ పాలిత రాష్ర్టాలలో మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలున్నాయా, కేసీఆర్ నాయకత్వంలో మనం సాధించిన ప్రగతితో పోల్చగలిగిన రాష్ట్రం ఒక్కటైనా దేశంలో ఉందా? నిశితంగా ఆలోచించండి.
ఇవీ మన గౌరవనీయ మోదీ నేతృత్వంలోని బీజేపీ పరిపాలనా ఫలితాలు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు తమకు జాతీయపార్టీలు మేలు చేశాయా, ప్రాంతీయ పార్టీలు మేలు చేశాయా విశ్లేషించుకోవాలి.
వచ్చే ఎన్నికలలో జాగ్రత్తగా ఓటు వినియోగించుకోకపోతే సామాన్య ప్రజలు ఇంకా కష్టాలలో కూరుకుపోతారు. తస్మాత్ జాగ్రత్త!
కనకదుర్గ దంటు: 89772 43484