‘విద్యంటే మూడో నేత్రం/ విద్యార్థే ధ్రువ నక్షత్రం’ అన్నాడొక సినీ కవి. ఉమ్మడి ఏపీలో మూడో నేత్రం మూసుకుపోయింది. ధ్రువ నక్షత్రాలు ఆశల ఆకాశం నుంచి రెక్కలు తెగిన పక్షుల్లా రాలిపోయాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం తన ప్రాధాన్యరంగాల్లో విద్యకు ప్రథమ స్థానం ఇచ్చింది. ఇవాళ ఒక విద్యా సూర్యోదయం జరిగింది. బీసీలకు సంబంధించిన ఇన్ని గురుకుల స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు అన్నది మామూలు విషయం కాదు. అది మహాత్మా జ్యోతిభా పూలే, సావిత్రిబాయి పూలే కన్న కలలకు ఆచరణ రూపం. అవి బడుగు జనుల బిడ్డలను విజ్ఞానయోధులుగా తీర్చిదిద్దే బహుజన సూర్యోదయాలు.
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉప్పొంగే ఆనంద ఉద్వేగాల మధ్య ఒక బహుజన బిడ్డగా కొత్త చరిత్రకు విద్యా ద్వారాలు తెరుస్తున్న కేసీఆర్ను గుండెనిండా నింపుకొని రాస్తున్నాను. ఎవరు చెప్పండి ఇంతగా బడుగుల కోసం కృషిచేసింది. ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే మరొక ముఖ్యమంత్రి ఉన్నారా? ఉంటే చూపండి. ఒక్కసారిగా 15 బీసీ డిగ్రీ కళాశాలలను మంజూరు చేస్తూ కేసీఆర్ చేసిన ప్రకటన బహుజనులకు పరవశం, పరమానందం.
రాష్ట్ర అవతరణ తర్వాత బీసీ వర్గాల పిల్లల చదువు కోసం మహాత్మా జ్యోతిభా పూలే గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచారు. నాటి ఉమ్మడి ఏపీలో 19 బీసీ గురుకులాలుంటే తెలంగాణ వచ్చాక ఆ సంఖ్య వందల్లోకి పెరగటం విప్లవం లాంటిదే. సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులందరికీ కార్పొరేట్స్థాయి విద్యనందించాలన్న సంకల్పంతో విస్తృతంగా గురుకులాలను నెలకొల్పారు. ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యి దాటింది. బీసీ గురుకులాలకు సంబంధించి రాష్ట్రం వచ్చాక 261 విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఇప్పుడు మరో 33 గురుకులాలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 261 గురుకులాల్లో 142 స్కూళ్లను గతేడాది జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది మరో 119 స్కూళ్లు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడవుతాయి. దీన్నిబట్టి మొత్తంగా బీసీ గురుకుల జూనియర్ కళాశాలల సంఖ్య 261కి పెరగనున్నవి. ప్రభుత్వం కొత్తగా 33 గురుకులాలతో పాటుగా కొత్తగా 15 బీసీ డిగ్రీ కళాశాలలకు అనుమతులనిస్తూ ఉత్తర్వులనిచ్చింది. కొత్తగా ప్రారంభించబోయే ఈ 15 డిగ్రీ కళాశాలలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. వీటిల్లో 8 బాలుర బీసీ డిగ్రీ కళాశాలలైతే 7 బాలికలకు కేటాయించారు. ఈ లెక్కన ఇప్పటివరకు బీసీ గురుకులాల్లో 1,65,000 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది ఈ గురుకులాల నిర్వహణ కోసం రూ.773.63 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మొత్తం బీసీ గురుకుల విద్యావ్యవస్థలో 11,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధంగా బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటుచేసిన చరిత్ర దేశంలోని మరే రాష్ట్రంలో కూడా జరగలేదు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోకి సంచార జాతులకు చెందిన పిల్లలు చదువుకునేందుకు రావటం చాలా పెద్ద మార్పుగా చెప్పాలి. రాష్ట్రం వచ్చాక సంచార జాతులకు చెందిన 17 కులాలను బీసీ కుల జాబితాలో చేర్చారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ బీసీ గురుకుల పాఠశాలలకు పోయినా సంచార జాతులకు చెందిన వారి బిడ్డలు కనిపిస్తారు. అట్టడుగు బీసీ వర్గాల బిడ్డలు చదువుకోవడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకూడదన్న ఉద్దేశంతో గురుకుల విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప సామాజిక మార్పు.
జ్యోతిభా పూలే, సావిత్రి బాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ల వంటి దార్శనికుల ఆలోచనలకు దర్పణంగా విద్యా గురుకులాలను తెలంగాణ నేలలో నెలకొల్పిన కేసీఆర్కు తలవంచి నమస్కరిస్తున్నా. అమ్మతోడు మాకిన్ని విద్యాలయాలనిచ్చి, మా బిడ్డలకు చదువు చెప్పించేందుకు కృషిచేస్తున్న కేసీఆర్.. బీసీ జాతులు మీ సేవలను మరువవు.
రాష్ట్రం వచ్చేవరకు బీసీ బిడ్డలు విద్యాసంస్థల్లో ఇంటర్, డిగ్రీ, సీట్లు పొందటం చాలా కష్టంగా ఉండేది. బీసీల్లో ఏబీసీడీఈ గ్రూపులకు చెందిన పిల్లలు మెరిట్లో సీట్లు పొందినా, రిజర్వేషన్లలో సీట్లు పొందినా ఇంకా చాలామంది పిల్లలు సీట్లు దొరకక చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రిజర్వేషన్లలో సీట్ల కోసం ఎదురుచూసే దశను దాటి బీసీ బిడ్డల చదువుల కోసమే ఒక్కసారిగా 15 బీసీ డిగ్రీ కళాశాలలు పెట్టడమన్నది బీసీ కుటుంబాల బిడ్డలకు సంబంధించి విద్యాపరంగా కొండంత అండగా చెప్పవచ్చు. ఒక్కసారిగా ఇన్ని విద్యాసంస్థలు బీసీలకు వస్తే ఇంతకంటే పెద్ద పండుగ ఏముంటది చెప్పండి. నేనొక బీసీ బిడ్డగా గర్విస్తున్నాను. బీసీ బిడ్డలకు పెరుగుతున్న సౌలభ్యాలను చూసి ఉప్పొంగి పోతున్నాను. కొత్తగా 15 బీసీ డిగ్రీ కళాశాలలకు అనుమతి అన్నది దిన పత్రికల్లో ఏ పేజీల్లో వార్త వచ్చినా నాకది బ్యానర్ ఐటమ్గానే కనిపిస్తుంది. కూటి కోసం, కూలి కోసం పట్టణానికి వచ్చిన బహుజనుల బిడ్డలకు, తరతరాలుగా చదువుకు దూరమైన సంచార జాతుల బిడ్డలకు అన్నంబెట్టి, హాస్టల్ వసతి ఇచ్చి, డిగ్రీ దాకా చదివించే గురుకుల విద్యావ్యవస్థ నా తెలంగాణ రాష్ట్రంలోనే అంకురార్పణ జరుగుతుంటే దిక్కులు పిక్కటిల్లేలా ఈ వార్తను చాటిచెప్పాలని ఉన్నది. జ్యోతిభా పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ల వంటి దార్శనికుల ఆలోచనలకు దర్పణంగా విద్యా గురుకులాలను తెలంగాణ నేలలో నెలకొల్పిన కేసీఆర్కు తలవంచి నమస్కరిస్తున్నా. ఇప్పటిదాకా పలురకాల రాజకీయ జెండాలు పట్టి బూటకపు నినాదాలతో మా చెవులను ఊదరగొట్టిన వాళ్లే కదా అంతా! అమ్మతోడు మాకిన్ని విద్యాలయాలనిచ్చి, మా బిడ్డలకు చదువు చెప్పించేందుకు కృషిచేస్తున్న కేసీఆర్.. బీసీ జాతులు మీ సేవలను మరువవు. నీకు మేము రుణపడి ఉంటాం.
(వ్యాసకర్త: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్)
జూలూరు గౌరీశంకర్: 94401 69896