ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఓటు వేయాలె. ఏ దేశంలో ఈ విధంగా జరుగుతున్నదో ఆ దేశాలు మంచిగ ముందుకుపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఒకటే ఒకటి ఓటు. మంచివాళ్లను గెలిపిస్తే మంచి ప్రభుత్వం ఏర్పడుతది. ఆ ఓటు మీ తలరాతను మారుస్తది. ఐదేండ్లకు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తది. అందుకే జాగ్రత్తగా ఓటు వేయాలె. ఓటు ప్రజల చేతిలో ‘వజ్రాయుధం’. నేను చెప్పిన మాటలు మీ మీ గ్రామాలకు పోయిన తర్వాత పెద్దలతో చర్చించి నిజానిజాలు తేల్చాలె. చర్చించండి, ఆలోచించి ఓటేయండి. ఇది ఎన్నికల బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న మాటలు.
ప్రజలు మంచీ చెడు, తప్పు ఒప్పు ఆలోచించకూడదని నేటి సాధారణ రాజకీయ నాయకులు కోరుకుంటారు. తామేం చేసినా సరే, జనం బుర్ర లేకుండా పడి ఉండాలని భావిస్తారు. అంతే తప్ప తమ మంచి పనులతో ప్రజలను మెప్పించడానికి ప్రయత్నించరు. కానీ, కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నమైన నాయకుడు. తాను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఏమి చేసి పెట్టారో కేసీఆర్ తమ బహిరంగ సభల్లో ప్రజలకు విడమరిచి చెప్తున్నారు. సభకు వచ్చిన ప్రజలు తమ గ్రామాలకు వెళ్లిన తర్వాత తోటివారితో చర్చించుకోవాలని సూచిస్తున్నారు. ‘మీరు ఆలోచించండి, మీరు చర్చించుకోండి’ అని చెప్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయనకు ప్రజల విజ్ఞప్తిపై గౌరవం ఉన్నది.
కేసీఆర్కు పదవులంటే ప్రజలను దోచుకునే మార్గం కాదు. ఎన్నోసార్లు పదవులను త్యాగం చేశారాయన. ఆయనకు రాజకీయం అంటే ప్రజా సేవకు సాధనం. తాను సాధారణమైన రీతిలో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించిన నాయకుడు కనుకనే, ప్రజలకు ఆలోచించండి, చర్చించుకోండని ధైర్యంగా చెప్తున్నారు. కేసీఆర్ నేటి పతన రాజకీయాలకు భిన్నమైన నేత. ప్రజలు డబ్బుకు, మద్యానికి బానిసలై ఓట్లు వేయాలని కోరుకునే బాపతు నాయకుడు కాదు. ప్రజలకు ఆలోచించడం అలవాటు చేస్తే, మంచి చెడూ నిర్ణయించుకునే విజ్ఞతను తట్టిలేపితే రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోతాయి. అదే కేసీఆర్ కోరుకుంటున్నది. బావనో, బామ్మర్దో ఇంకెవరో చెప్తే తలూపి ఓటేయవద్దని మీ జీవితానుభవాన్ని బట్టి ఏ పార్టీ చేసిందో బేరీజు వేసుకొని చూసి ఓటేయమని ప్రజలకు హితవు చెప్తున్నారాయన.
తాను చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగగలిగే దమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆర్. అందువల్లనే ఆయన ఇతర పార్టీలకు తమకు గల తేడాను గుర్తించమంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందో గత తొమ్మిదేండ్లుగా మీరు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ చేసిందేమిటి అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే, బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీయే. మేం విడిపోతామంటే 1969లో విద్యార్థులను కాల్చిచంపింది కాంగ్రెస్ పార్టీయే. తాను ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమిస్తే, తెలంగాణ ఇస్తామని పార్లమెంటులో ప్రకటించి కూడా మాట తప్పింది కాంగ్రెస్ నాయకులే. వందలాది మంది యువకులను బలిగొన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు చేసిన ద్రోహం గురించి చెప్తూనే, దేశానికి ఏం చేయలేదనే వాస్తవాన్ని కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి డబ్బు ఏండ్లు దాటిన తర్వాత దేశం ఈ దుస్థితిలో ఉన్నదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులే అని స్పష్టంగా చెప్తున్నారు. నాటినుంచే కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతికి పాటుపడితే, ఇవాళ దళితబంధు పెట్టవలసిన అవసరం ఉండేదా అని కూడా ఆయన చెప్తున్నారు. డబ్బు ఏండ్లలో ఇతర పార్టీలు సాధించనిది తాను తొమ్మిదేండ్లలో చేసి చూపించానని ప్రజలకు వివరిస్తున్నారు.
‘ఇతర పార్టీలు ఎలా ఉన్నాయో, ఎటువంటివో చూడాలె… ఆ పార్టీ నడవడిక ఎటువంటిది, రైతుల గురించి ఏం చేస్తరు, పేద ప్రజల గురించి ఏం చేస్తరు. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో తీసుకుపోవడానికి ఏమేం వ్యూహాలు చేస్తరనేది ఆలోచన చేయాలె. ఏ పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలె.. కాంగ్రెస్ ఇన్నేండ్లు ఏం చేసిందో ఆలోచించాలె. మళ్లా దళారీలు, పైరవీకార్ల పెత్తనం రావద్దు. బీఆర్ఎస్ ఏం చేసిందనేది మీ కండ్ల ముందున్నది’ అని కేసీఆర్ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రజల చైతన్యం ఆధారంగానే తాను ఓట్లు తెచ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గత్తర రాజకీయాలకు, కేసీఆర్ ప్రజలతో సాగిస్తున్న సంభాషణకు ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి పతన రాజకీయాలకు భిన్నమైన నాయకుడు. రాజకీయాలను పునర్నిర్వచించిన రాజనీతిజ్ఞుడు. ప్రజలు తమకు తాము పాలించుకోవడం అలవాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. చెప్పుడు మాటలు వినకుండా ప్రజలు తమ జీవితానుభవాన్నుంచి నిర్ణయాలకు రావాలి. అది ప్రజలకు అలవాటు చేయాలి. దీనివల్ల భవిష్యత్తు తరాల కోసం ఉత్తమ రాజకీయాల బాట వేసినట్టవుతుందనేది కేసీఆర్ ఆలోచన. ఎన్నికల సంగతెట్లా ఉన్నా, కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన దేశ చరిత్రలోనే అసాధారణమైనదని కొందరు ఇతర పార్టీల నాయకులు కూడా లోపాయికారిగా అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల ముందుకు వెళ్లి మాట్లాడటం తమకు కష్టంగా ఉన్నదని వారంటున్నారు.
రాజకీయ అవినీతిని అంతంజేసి ఉత్తమ రాజకీయాలను ప్రవేశపెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు గ్రామస్థాయిలో కూడా దళారీ రాజకీయ వర్గం ఉండేది. వీరు ఆయా పార్టీల కార్యకర్తలుగా, చోటా నాయకులుగా చెలామణి అయ్యేవారు. బోగస్ రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయించడం మొదలైన పైరవీలతో మంది మీద పడి బతికేవారు. కేసీఆర్ ఈ పైరవీకారులకు, దళారీలకు స్థానం లేకుండా చేశారు. పనిచేసుకొని బతుకాలె తప్ప ప్రజలను దోచుకొని కాదని స్పష్టం చేశారు. పింఛన్లు, రైతుబంధు మొదలైన పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ఈ దళారీ వర్గానికి కడుపు మంటగా ఉన్నది. వీరంతా కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. కానీ ప్రజలు వీరి మాటలు నమ్మి మోసపోయే అమాయకులు కారు. పూర్వం సర్పంచ్ అయితే నిధులు తెచ్చుకోవడం, నీకిన్ని, నాకిన్ని అన్నట్టుగా నాకివేయడం అలవాటుగా మారింది. కానీ, కేసీఆర్ వచ్చిన తర్వాత చెట్లు పెంచడం, పరిశుభ్రత పాటించడం మొదలుకొని అనేక బరువు బాధ్యతలను నెరవేర్చవలసి వస్తున్నది. ఇది కొత్త అలవాటు కనుక కొందరు సర్పంచ్లకు కష్టంగానే ఉన్నది. కానీ కాలక్రమేణా ఇటువంటి బరువు బాధ్యతలు చేపట్టి ప్రజాసేవ చేసేవారే సర్పంచ్ పదవులకు ముందుకువస్తారు. గ్రామస్థాయిలో పైరవీకారులు పోయిన తర్వాత ఏర్పడే శూన్యంలో కొత్త రాజకీయ సంస్కృతి అలవరుచుకున్న కొత్త తరం నాయకత్వం అవతరించి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదుగుతుంది. అప్పటివరకు కేసీఆర్ ప్రయోగం ఫలించే వరకు ప్రజలు వేచిఉండాలి. కేసీఆర్ను ప్రజలు నిలబెట్టుకోవాలి.
పాలకులు ప్రజలకు జవాబుదారులుగా ఉండటం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. పాలకులు తాము చేసింది, ఏం చేయబోతున్నదీ ప్రజలకు చెప్పుకోవాలి. ఎన్నికల ఉద్దేశం అదే. కానీ, ఇతర పార్టీల నాయకులు ఈ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని విస్మరించి పరస్పర దూషణలకు దిగడమే ఎన్నికల ప్రచారం అనుకుంటున్నారు. కేసీఆర్ మాత్రం తాను రెండు పర్యాయాలలో చేసిందేమిటో ప్రజలకు విడమరిచి చెప్తున్నారు. తన పరిపాలన తీరుతెన్నులపై తోటి ప్రజలు చర్చించుకోవాలని మరీ మరీ చెప్తున్నారు. ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ ఈ విషయాన్ని మరింత దృఢంగా చెప్పడానికి కారణం- ప్రజలకు పాలకుల పనితీరుపై ఆలోచించడం, చర్చించుకోవడం అలవాటు చేయాలనే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించాలి. ఆలోచించాలి, తోటివారితో చర్చించుకోవాలి. విజ్ఞతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి.
(వ్యాసకర్త: డైరెక్టర్, టీ కేసీఆర్ సెంటర్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817