మాంద్యం ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం లో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యురోపియన్ యూనియన్, చైనాల్లో ఈ మేరకు సంకేతాలు గోచరిస్తున్నాయి. ప్రపం చ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా ఈ మూడింటిదే. యూరప్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ జీడీపీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 0.3 శాతం మేర మందగించింది. గతేడాది చివరి త్రైమాసికం లో కూడా 0.5 శాతం మేర క్షీణత నమోదయ్యింది. వరుసగా రెండుసార్లు ఇదే పరిస్థితి ఎదురుకావటంతో, జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించినట్లేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండెత్తిన నేపథ్యంలో ఏర్పడిన చమురు సంక్షోభం కారణంగా జర్మనీలో ఈ పరిస్థితి తలెత్తింది. సగటు గృహ వినియోగం 1.2 శాతం మేర, ప్రభుత్వ వ్యయం 4.9 శాతం మేర పడిపోయింది. 2020 ప్రారంభంలో కరోనా వ్యాప్తి సమయంలోనూ జర్మనీ ఆర్థిక మాం ద్యాన్ని ఎదుర్కొన్నది. మహమ్మారి ప్రభావం నుంచి బయటపడుతున్న దశలో మరోసారి సంక్షోభం ఆ దేశాన్ని ఆవరించింది.
అగ్రరాజ్యం అమెరికా పరిస్థితీ జర్మనీకి తీసిపోకుండా ఉంది. భారీస్థాయిలో అప్పులు తీసుకుంటేగానీ అది గట్టెక్కేలా లేదు. ప్రభుత్వ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచే ప్రతిపాదనపై కొన్ని నెలలుగా పీటముడి పడింది. మరో తొమ్మిది రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే అమెరికా దివాలా తీయటమే. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపుపై ఆ దేశ చట్టసభల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సానుకూల ఫలితమే వస్తుందని ఐఎంఎఫ్ ఎండీ క్రిష్టలిన జార్జీవా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ రుణపరిమితి పెంపుపై అమెరికాలో చర్చలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే జరుగుతుంటాయి. అయితే, చివరికి పరిష్కారం కూడా లభిస్తుంది’ అని చెబుతూనే, అమెరికా దివాలా తీస్తే ప్రపంచ ఆర్థికరంగంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మరోవైపు, కరోనాతో అతలాకుతలమైన చైనా పరిస్థితీ ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఆ దేశం 10 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తున్నది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల పరిస్థితి కూడా బాగాలేదు.
ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఉండగా, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ కనీసం రెండు లక్షల మంది టెకీలు ఉద్వాసనకు గురయ్యారు. దాదాపు 700 కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను, కంపెనీ కార్యకలాపాలను తగ్గించాలని నిర్ణయించాయి. అంతర్జాతీయంగా అలుముకున్న ఈ పరిస్థితికి కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తక్షణ కారణాలుగా కనిపిస్తున్నప్పటికీ, నిగూఢంగా పరిశీలిస్తే, ఇతరేతర అంశాలూ ఉన్నాయి. 1920 ల లో ఇటువంటి మాంద్యమే ప్రపంచాన్ని కమ్ముకున్నప్పటికీ, కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు, అసమానతలపై పోరాటాలు దానిని పరిష్కరించాయి. నేడు మొదటిది ఉన్నప్పటికీ మిగిలిన రెండూ తగిన స్థాయిలో లేవు. పెట్టుబడులను పెంచటం, అసమానతలను తగ్గించటమే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం. అసలే ఇబ్బందుల్లో ఉన్న భారత ఆర్థికవ్యవస్థ ఈ ఉత్పాతాన్ని ఎలా తట్టు కుంటుందో వేచి చూడాల్సిందే!