ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడానికి అనుమతించే ప్రతిపాదనను 2023 సెప్టెంబర్ 16న ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమే తప్ప మరొకటి కాదు.
ప్రైవేట్ వ్యక్తులు పాఠశాలను నిర్వహించడం ద్వారా సిద్ధంగా ఉన్న భూమి, భవనాలను వాడుకొని లాభాన్ని పొందుతారు. నిజానికి నగరాలలో ముఖ్యంగా మెట్రోనగరాల్లో చాలా విలువైన ప్రభుత్వ పాఠశాలలు ప్రజల డబ్బుతో నిర్మించబడ్డాయి. ఇవి ఇప్పుడు ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్తాయి.
మహారాష్ట్రలో దాదాపు 62,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖరీదైన ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లిం చే స్థోమతలేని వారు ఈ బడులకు వెళ్తున్నారు. దత్తత నిర్ణయం వల్ల పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. ప్రయివేటు వ్యక్తులు స్కూళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొంత మేరకు ఫీజులు నిర్ణయిస్తారు. రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు ఆ ఫీజులు భరించలేరు కనుక చాలామంది పిల్లలు విద్యకు దూరం అవుతారు.
ఏ కార్పొరేట్ సంస్థ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే సు దూర ప్రాంతాల్లోని పాఠశాలలను దత్తత తీసుకోవడం లేదు. పాఠశాల ఆస్తులు కలిగి ఉండి, విలువైన భూమి, లాభాలను ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉన్న పెద్ద నగరాల్లోని స్కూళ్లపైనా వారు దృష్టి పెడుతున్నారు. కార్పొరేట్ సంస్థ లు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను పాఠశాలల నిర్వహణకు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కార్యక్రమం కింద ‘ఏ’, ‘బీ’ తరహా మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లోని పాఠశాలలను దత్తత తీసుకునే సంస్థలు ఐదేండ్లలో రూ.2 కోట్లు లేదా పదేండ్లలో రూ.3 కోట్లు ఖర్చు చేయడానికి కట్టుబడి ఉండాలి. ‘సీ’ రకం మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలకు అంచ నా వేసిన విరాళం రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లు, మిగిలిన పాఠశాలలకు వరుసగా ఐదు నుంచి పదేండ్లకు రూ. 50 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు ఖర్చుచేయాలి. కార్పొరేట్ సంస్థలు ఖర్చు చేసిన మొత్తాన్ని ఫీజుల ద్వారా రికవరీ చేసే అవకాశం ఉన్నది. దీని ఫలితంగా చాలా కుటుంబాలు తమ పిల్లలను చదివించుకోలేక పోతున్నా యి. ఈ నిర్ణయం ద్వారా, ప్రభుత్వ విద్య కు నిధులు సమకూర్చే ప్రాథమిక బాధ్యతలలో ఒకదాన్ని ప్రభుత్వం వదులుకుంటున్నదనే విషయం స్పష్టమవుతున్నది.