ఈ నెల 22న అమెరికాలోని హెండెర్సన్లో ప్రపంచ పర్యావరణ, జల వనరుల కాంగ్రెస్-2023
సమావేశం జరిగింది. ఇందులో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ అధ్యక్షురాలు మారియా లేమన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రశంసా పత్రం అందజేశారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అందుకున్నారు.
ప్రపంచంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణకు ఒక వరం. కేసీఆర్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్ర భవితవ్యాన్ని మార్చారు. గోదావరి నీటిని కాలువల ద్వారా తరలించడానికి ఉన్న పెద్ద అడ్డంకి భూమి ఎత్తుగా ఉండటం. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటర్ల ద్వారా తోడి కాలువల్లో పోయాల్సిందే. తెలంగాణ భూమి సస్యశ్యామలం కావాలంటే ఎత్తిపోతల ప్రాజె క్టు కాకుండా, మోటర్లతో ఎత్తిపోయకుండా అసాధ్యం. అలాకాక వేరే ఏదైనా మార్గం సూచించమని ఈ పథకాన్ని విమర్శించేవారిని చెప్పమనండి. స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు దాటినా తెలంగాణలో రైతులు పొలాలకు నీరు లేక, బోర్లు పడక నష్టపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భూములు అమ్ముకొని వలసలు పోయారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నది నుంచి 90 రోజుల పాటు రోజు రెండు టీఎంసీల చొప్పున 180 టీఎంసీ ల నీటిని మళ్లించడం కోసం కాళేశ్వరం పథకాన్ని రూపొందించింది. దీని కోసం వందల కి.మీ. దూరం కాలువలు, సొరంగ మార్గాలు నిర్మించారు. ఇవి భార తదేశంలోనే అతి పెద్ద లిప్టులు. నీటిని పంపుల ద్వారా తోడటానికి ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్ను ఏర్పాటుచేశారు. దీనికోసం భూగర్భంలోనే పంప్ హౌజ్లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణాలు చేపట్టారు.
18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు 134.5 టీఎంసీలు, స్థిరీకరణకు (గత ప్రాజెక్టులకు నీరు అవసరమైతే ఇచ్చేటందుకు) 34.5 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామాల తాగు నీటికి 10 టీంఎసీలు, పారిశ్రామిక అవసరాలకు,16 టీఎంసీలు నీటి వినియోగం జరుగుతున్నది.
కాళేశ్వరం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 13 జిల్లాల్లో సుమారు 500 కి.మీ (310 మైళ్లు) విస్తరించిన ఈ ప్రాజెక్టును 7 లింక్లు, 28 ప్యాకేజీలుగా విభజించారు. అలాగే 1800 కి.మీ. కంటే ఎక్కువ కాలువ నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రాజెక్టు మొత్తం 240 టీఎంసీలు (మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20, భూగర్భజలాల నుంచి 25) ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో 169 టీఎంసీలు నీటిపారుదల కోసం, 30 టీఎంసీలు హైదరాబాద్ మున్సిపల్ నీటికి కేటాయించబడింది. 16 టీఎంసీలు ఇతర పారిశ్రామిక అవసరాల కో సం, 10 టీఎంసీలు సమీపంలోని గ్రామాల తాగునీటి కోసం, మిగిలినవి బాష్పీభవన నష్టంగా అంచనా వేశారు.
సుమారు కోటి ఎకరాల భూమికి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతున్నది. స్థూల నీటి పారుదల భూమి 119 శాతానికి పెరిగింది. వరి ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. 2015-16లో 68.17 లక్షల టన్నుల నుంచి 2022-23లో 250.63 లక్షల టన్నులకు ధాన్యం దిగుబడి పెరిగింది. 2014-15 లో 1.31 కోట్ల ఎకరాలున్న స్థూల విస్తీర్ణం 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. వరిసాగు విస్తీర్ణం 2015-16లో 34.98 లక్షల ఎకరాలు ఉండగా, 2022- 23లో 121.43 లక్షల ఎకరాలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
కాళేశ్వరం భూగర్భ పంపింగ్ స్టేషన్ భూమి ఉపరితలం నుంచి 470 అడుగుల దిగువన ఉన్నది. ఈ స్టేషన్లో 2,376 మెట్రిక్ టన్నుల నీటిని పంపింగ్ చేయగల ఏడు ‘బాహుబలి’ మోటర్లున్నాయి. భారతదేశంలోని టాప్ 5 ప్రాజెక్టుల్లో మొదటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది ప్రాణహిత, గోదావరి నది సంగమ ప్రదేశంలోని కాళేశ్వరం వద్ద ప్రారంభం అవుతుంది.
2014కు ముందు తెలంగాణలో దుర్భర పరిస్థితులుండేవి, ఎండిపోయిన చెరువులు, ఖాళీ బావులు ఇలా తీవ్రమైన నీటి కొరతతో ఈ ప్రాంతం అల్లాడింది. నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడంతో వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండాపోయింది. నేడు హరిత విప్లవంతో దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.
సీవీవీ ప్రసాద్: 8019608475
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)