స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలను భగవద్గీత ఎన్నడూ ప్రోత్సహించదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో వేర్వేరు చోట్ల రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఏటా కొన్ని వేలమందిని బలి తీసుకుంటున్న ఈ యుద్ధాలకు పరిష్కారాలు లభిస్తాయన్న ఆశ నేటికీ లేకపోవటం బాధాకరం. వీటిలో చాలా యుద్ధాలు దేశ భూ భాగాలపై సార్వభౌమత్వం కోసమో, వనరులపై పెత్తనం కోసమో జరుగుతుండటం విచారకరం.
భగవద్గీత జీవన దిక్సూచి. జీవితంలోని ఆహారం, నిద్ర, కర్మ, హింస, అహింస మొదలైన ఎన్నో విషయాల గురించి వివరిస్తుంది. అహింస, శాంతి, సౌభ్రాతృత్వాలను ప్రోత్సహించే భగవద్గీత అవసరమైనప్పుడు హింసకూ ఒక స్థానం ఉన్నదని చెప్పింది. ఒక వైద్యుని చేతిలోని చురకత్తి రోగి శరీరాన్ని కోస్తుంది. దాన్ని హింసగా భావించాలా? అహింసగా అర్థం చేసుకోవాలా? ఇక్కడ వైద్యుడు రోగి శరీరాన్ని కోయటం అతని ప్రాణాలను రక్షిస్తుంది గనుక అది ముమ్మాటికీ హింస కానేరదు. అదే కత్తి ఒక తీవ్రవాది చేతిలో ఉండి, సాటి మనిషి ప్రాణాలకు ఎక్కుపెడితే అది నిస్సందేహంగా హింసే! ప్రాణరక్షణకు అనివార్య పరిస్థితుల్లో హింస ఆమోదయోగ్యమే! సాధారణ ప్రజలను ఇక్కట్లకు గురిచేసే అల్లరి మూకలను చెదరగొట్టడానికి రక్షకదళం లాఠీలను ఝళిపించడం అందుకు ఒక ఉదాహరణ. అయితే, దండోపాయం చివరి ప్రయత్నమని గుర్తించాలి.
నిజానికి జీవన సమస్యలంటే ఈ భూమి, వనరులు, సార్వభౌమత్వ పోరాటాలు కావు. నిజమైన జీవన సమస్యలు జన్మ, మృత్యు, జరా, వ్యాధులు. ఇతర ఇక్కట్లు, సవాళ్లు జీవితంలో మరెన్నో ఉండొచ్చు. ఈ ఇబ్బందులను పరిష్కరించే విధి విధానాలు, జీవన ప్రధాన సమస్యలను కూడా పరిష్కరించేవై ఉండాలని భగవద్గీత సూచిస్తుంది. భగవద్గీత దృష్టికోణం ఎంతో వైవిధ్యమైనది, విశిష్టమైనది. మనమంతా ఈ భౌతిక దేహాలం కాదని, ఆత్మ స్వరూపులమని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఆత్మ స్వరూపులుగా మనం ఈ భౌతిక జగత్తుకు చెందినవారం కాదు. భగవత్ సాన్నిధ్యాన్ని విస్మరించి స్వతంత్రంగా ఆనందించాలనే కాంక్షతో ఆధ్యాత్మిక లోకాన్ని వీడి, భౌతిక ప్రపంచంలో అసంఖ్యాక సమస్యలతో సతమతమవుతున్నాం. ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలనే ఆశిస్తాడు. వృద్ధాప్యాన్ని, వ్యాధులను కోరుకోడు. ఇవన్నీ ఎంతో సహజమైన కోరికలే అయినా, ఈ ప్రపంచంలో ఇవేవీ సాధ్యపడవు. ఇవన్నీ కేవలం భగవంతుడి ధామంలోనే సాధ్యమవుతాయి.
భగవద్గీత ప్రతి ఒక్కరినీ మోక్షసాధన వైపు ప్రోత్సహిస్తుంది. పైన వివరించిన నాలుగు ప్రధాన సమస్యల నుంచి విముక్తులై తిరిగి కృష్ణ సన్నిధానాన్ని, వైకుంఠాన్ని చేరమని చెప్తుంది. శరణాగతులు తనను తప్పక చేరగలరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించాడు. ప్రజల శ్రేయస్సును ఎరిగి ఒక విశుద్ధ ధర్మాత్ముడిని రాజుగా ప్రసాదించిన కృష్ణలీల కురుక్షేత్ర యుద్ధం. భగవంతుడిని విస్మరించే దుర్యోధనుడి వంటి రాజుల వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? అందుకే, నాడు శ్రీకృష్ణుడు.. ధర్మ సంస్థాపన కోసం యుద్ధం అనివార్యం అని బోధించాడు. దుష్ట సంహారమే లక్ష్యంగా అర్జునుడితో విల్లును పట్టించిమరీ యుధిష్ఠిరుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. అయితే, ఇప్పుడు జరుగుతున్న మానవ కల్పిత యుద్ధాలు సమాజ శ్రేయస్సు కోసం జరుగుతున్నవి కావు. ఇలాంటి దుశ్చర్యలకు ప్రకృతి నుంచి ప్రతిచర్య తప్పదు. భగవద్గీత సందేశం ఆత్మ స్వరూపులైన ప్రజలందరినీ కృష్ణ పరమాత్మ వైపు నడిపించడమే! హరే కృష్ణ!
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984