అన్ని పార్టీల ప్రచారపు హోరు ముగుస్తున్నందున ఇక ఓటర్లు వచ్చే 48 గంటల పాటు ప్రశాంతంగా, జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయమిది. ఎవరు అధికారంలోకి వచ్చినట్టయితే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది? తమ జీవితాలు ఇంకా మెరుగుపడతాయి? అన్నవి వారి ముందున్న ప్రశ్నలు.
ఇందుకు సమాధానాలను కనుగొనేందుకు తమ ఎదుట గత అనుభవాలు అనేకం ఉన్నాయి. వాటి ఆధారంగా భవిష్యత్తు గురించి ఆలోచించి అంచనాలు వేసుకోగల వివేకం వారికున్నది. అందువల్ల, గత అనేక వారాల ప్రచార కాలంలో అందరి మాటలను విన్న ప్రజలు, రాగల రెండురోజుల పాటు అన్ని విషయాలను నింపాదిగా చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలి.
తెలంగాణకు 2014 ఒక ముఖ్యమైన మలుపు కాగా, అప్పటినుంచి పదేండ్ల తర్వాత ఈ 2023 ఒక ముఖ్యమైన మైలురాయి కానున్నది. 2014 ఎందువల్ల ముఖ్యమైన మలుపో చెప్పనక్కరలేదు. అది భారతదేశానికి 1947 వంటిది. అంతకుముందటి సుదీర్ఘ కాలమంతా ఇతరుల పాలనలో, పీడనలో మగ్గిపోయిన వెనుకబాటుతనం. 1947 నుంచి భారతదేశం, 2014 నుంచి తెలంగాణ తమ భవిష్యత్తు కోసం అన్వేషణలు మొదలుపెట్టాయి. తమ కోసం తాము కొత్తదారులు వేసుకోసాగాయి. తెలంగాణ విషయానికి వస్తే, కొత్తదారులు వేసుకోవడమంటే అంతకుముందటి వెనుకబాటుతనాన్ని వదిలించుకోవటం. దెబ్బతిని ఉన్న వ్యవసాయరంగాన్ని, రైతులను, కూలీలను, వృత్తిపనుల వారిని, గ్రామాలను, మొత్తంగా గ్రామీణ వ్యవస్థను బాగుపరచుకోవటం. భారతదేశం వంటి వర్ధమాన దేశంలో, తెలంగాణ వంటి వెనుకబడిన సమాజంలో ఆ స్థితి నుంచి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన ప్రజానీకానికి పునాది, లేదా వెన్నెముక వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడటమన్నది అన్నింటికన్న ముందుగా జరగవలసిన పని.
గ్రామాలకు బయట తెలంగాణలోని పట్టణాలు, నగరాలు కుదుటపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పట్టణాలలో నివసించే ప్రజలు, గ్రామాల నుంచి అటువెళ్లే ప్రజలు, యువతరం అక్కడ కుదురుకునేందుకు తగిన పరిస్థితులు ఏర్పడాలన్నా, గ్రామాలు నిలదొక్కుకొని ముందడుగు వేయటమే అందుకు పునాది అవుతుంది. మనం 2014 నాటికి వెళ్లిచూసినట్టయితే, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి ప్రాతిపదికగా పనిచేసింది ఇటువంటి ఆలోచనలే. తర్వాత పదేండ్ల పాటు మనం అమలులో చూసింది కూడా ఇదే. ఈ ఆలోచనలకు తగిన విధానాలు, చర్యలు కొత్త ప్రభుత్వంలో ఏ విధంగా తీసుకున్నారు? వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 2014 నాటితో పోల్చితే ఈ రోజున తెలంగాణ వ్యవసాయరంగం, రైతులూ, రైతుకూలీల ఆర్థిక స్థితిగతులు, గ్రామీణ ఆర్థికవ్యవస్థపై ఆధారపడి జీవించే వృత్తుల వారి జీవితాలు ఎట్లా మెరుగుపడ్డాయో మన కండ్ల ఎదుట కనిపిస్తున్న విషయం.
ఇక్కడ మరొక ముఖ్యమైన మాట చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉద్యోగాలు, ఉపాధుల గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ లక్షలాది యువతలో అధికులు గ్రామీణ ప్రాంతాల వారు. వారు చదువుకొని ఉద్యోగ, ఉపాధుల కోసం పట్టణాలకు వెళ్లటం 2014కు ముందు కూడా ఉండేది గాని ఇప్పుడు అనేక రెట్లు పెరిగింది అంతకుముందు హైస్కూలు, కాలేజీల స్థాయిలో డ్రాపౌట్లు భారీగా ఉండేవి. వ్యవసాయ ఆర్థికవ్యవస్థపై ఆధారపడిన వారు తమ పిల్లలను చదివించలేకపోవటం అందుకు కారణం. ఆ డ్రాపౌట్ల నుంచే అనేకమంది యువకులు నక్సలైట్ ఉద్యమంలో చేరే వారు. తర్వాత తెలంగాణ ఉద్యమానికి వారే ఒక ముఖ్యాధారమయ్యారు. కానీ, 2014 తర్వాత పరిస్థితి గణనీయంగా మారింది. చదువు పూర్తిచేసేవారు పెరిగారు. సొంత రాష్ట్రం ఏర్పాటు వారిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పట్ల ఆశలను పెంచింది.
ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటినీ కలిపి చూస్తే అటువంటి అవకాశాలు రాష్ట్రంలో, దేశ విదేశాల్లో వారికి 2014 కన్న ముందుతో పోల్చితే పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి కూడా. అయినప్పటికీ, పెరుగుతున్న గ్రాడ్యుయేట్ల వెల్లువకు అది సరిపడేవిధంగా లేదన్నది నిజం. అందుకు కారణాలు, పరిష్కారాలు ఏమిటన్నది అట్లుంచి చర్చను ప్రస్తుత విషయానికి పరిమితం చేస్తే, గ్రామసీమలు 2014 నుంచి ఎంతో మెరుగుపడినందువల్లనే ఈ స్థితి చోటుచేసుకుంటున్నదనేది గుర్తించవలసిన విషయం. అంతేకాదు, గ్రామాల నుంచి హైదరాబాద్ వంటి చోట్లకు తరలివెళ్లి పనిపాటలు, చిన్నపాటి వృత్తులు చేసుకొని జీవిస్తున్న లక్షలాదిమంది దిగువ మధ్య తరగతివారి ఆర్థికశక్తి కూడా 2014 తర్వాత తమ పిల్లలను వీలైనంత పైస్థాయికి చదివించగల విధంగా ఎదుగుతున్నది. రాష్ట్రం అభివృద్ధి సాధించినందువల్ల ఏర్పడే సవాలు. దానిని ఎట్లా పరిష్కారించాలన్నది ప్రశ్న.
ఇదంతా జరుగుతున్నది 2014ను రాష్ర్టాభివృద్ధికి ఒక కీలకమైన మలుపుగా మార్చుకున్న ముందుచూపు వల్లనే. తిరిగి మరొక ముఖ్య విషయం చెప్పుకోవాలంటే, తెలంగాణ ఏర్పడినా కొత్త నాయకత్వాలు విఫలమై, యువకుల్లో తీవ్ర అశాంతి తలెత్తగలదని, బలహీనపడుతున్న నక్సలైట్ ఉద్యమానికి కొత్త రిక్రూట్మెంట్లు రాగలవని నక్సలైట్ నాయకత్వం అంచనాలు వేసింది. కానీ, అదేమీ జరగలేదు. కొత్త రాష్ట్రం, బలపడుతున్న ఆర్థికవ్యవస్థలు, యువతకు కొత్త చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అప్పటికే నక్సలైట్ ఉద్యమం పట్ల తగ్గిన ఆకర్షణలు కొత్త పరిస్థితులను సృష్టించాయి. దానితో నక్సల్ ఉద్యమం ఇంకా బలహీనపడింది. ఇదే స్థితి మునుముందు సైతం కొనసాగగలదనేందుకు సందేహం అక్కరలేదు.
మొత్తం మీద గుర్తించవలసింది ఏమంటే, 2014 నుంచి గ్రామీణ తెలంగాణ యావత్తు సాగునీటికి, విద్యుత్తుకు కొరత లేక ఆర్థికంగా, సామాజికంగా క్రమంగా ఎంతో పరివర్తన చెందుతున్నది. చివరికి పచ్చదనం పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, రవాణా సదుపాయాలు, ఆహార లభ్యత, పోషక విలువల పెరుగుదల, అన్ని తరగతుల వారి సగటు ఆదాయాల మెరుగుదల వంటి అనేక అంశాల్లో ఇతర రాష్ర్టాలు అన్నింటికి మించి జాతీయస్థాయి అవార్డులు గెలుచుకోగల మేరకు తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఎదిగింది. ఆ విధంగా వెన్నెముక బలపడుతున్నది.
వచ్చే 48 గంటలలో ప్రజలంతా ప్రశాంతంగా, జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ జరుగుతున్నాయి గనుకనే తెలంగాణ రాష్ట్రం సాకారమై అయిదేండ్లు గడిచేసరికే పేదలు, పేద రైతుల వలసలు ఆగి, గ్రామీణ కూలీలకు పనులు దొరుకకపోవటమనే దుస్థితి పూర్తిగా తొలగిపోయి, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా పనులకు ఇక్కడివారు చాలక అనేక ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, ఇతర పనుల వారు మన రాష్ర్టానికి వలస వస్తున్న మార్పు కండ్లెదుట కనిపిస్తున్నది. పేదరికం, కునారిల్లే వ్యవసాయం, నక్సలైట్ ఉద్యమం, రకరకాల అశాంతులతో మగ్గిపోతుండిన గడ్డలో ఇటువంటి మార్పులను ఎన్నడైనా ఊహించామా? తెలంగాణ రూపురేఖలు సమూలంగా పరివర్తన చెందుతున్న ఈ అభివృద్ధి క్రమం రాగల కాలంలో ఏ విధంగా, ఎవరి ఆధ్వర్యాన అయితే కొనసాగగలదన్నదే 30న పోలింగ్ సమయంలోగా ప్రజలు ప్రశాంతంగా, జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం.
మరొక కీలకమైన రంగం పట్టణాలు, పరిశ్రమలు, వ్యాపారాలు మౌలిక సదుపాయాలు, రవాణా, కమ్యూనికేషన్లు, విద్యా-వైద్యాలు, పౌర సదుపాయాలు, మత కలహాలు లేని ప్రశాంతత వంటివి. ఈ అంశాల్లో 2014 నాటి తెలంగాణకు నేటి తెలంగాణకు పోలికే లేదని స్థానికులు, ఇతర రాష్ర్టాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారంతా ముక్తకంఠంతో అంటున్నందున ఇంక చెప్పేదేమీ లేదు. ఒక ప్రాంతం వ్యవసాయికంగా ఎంత వర్ధిల్లుతున్నా పట్టణ ప్రాంతాలు, నగరాలు కూడా అందుకు దీటుగా అభివృద్ధి చెందకపోతే అది సమగ్రమైన అభివృద్ధి కాబోదు. ఆ రాజ్యం ముందుకు పోజాలదన్నది మనకు ప్రపంచ చరిత్ర చెప్తున్న వాస్తవం.
హైదరాబాద్ నగరం 2014కు ముందు కూడా తగినంత అభివృద్ధి చెందిన మాట నిజమే అయినా, ఆ తర్వాత నుంచి కళ్లు మిరుమిట్లు గొలిపేట్లు వెలుగుతున్నదని ప్రజలు గుర్తిస్తున్నదే గనుక, ఈ రెండు రోజుల్లో వారు చేయవలసింది, ఇది ఎట్లా సాధ్యమైంది? ఎట్లా కొనసాగాలి? ఆ పనిచేసిన వారెవరు? మునుముందు చేయగల వారెవరు? అనే ప్రశ్నల గురించి శాంతంగా, జాగ్రత్తగా ఆలోచించటం. ఈ రోజున వివిధ జిల్లా కేంద్రాలు వేగంగా సకల సదుపాయాలతో అభివృద్ధి దిశలో సాగుతుండటమే గాక, రాష్ట్ర రాజధాని అయితే ధగాధగాయమానంగా వెలుగుతున్నదని ప్రజలకు తెలుసు. మాది తెలంగాణ అని, మాది హైదరాబాద్ అని వారిప్పటికే అంతటా సగర్వంగా చెప్పుకొంటున్నారు.
అటు గ్రామీణ తెలంగాణకు, ఇటు పట్టణ తెలంగాణకు కూడా వర్తించే అంశం ప్రజా సంక్షేమం. వివిధ బలహీనవర్గాలకు సంక్షేమ చర్యలు అవసరమన్న గుర్తింపు, వాటి అమలు ప్రపంచంలో, మన దేశంలో వందల ఏండ్లుగా ఉన్నాయని తెలిసిందే. అందుకు అనుగుణంగా తెలంగాణలో పూర్తి నిబద్ధతతో అమలవుతున్న సంక్షేమ చర్యలు అనతికాలంలో కేంద్రాన్ని, అన్ని రాష్ర్టాలను మించిపోవటమన్నది ఈ సందర్భంలో ప్రత్యేకంగా గుర్తించవలసిన విశేషం. 1947 నుంచి ఇంతవరకు మొత్తం దేశంలోనే ఇంతటి సంక్షేమపు ఆలోచనలు ఎప్పుడూ, ఎక్కడా లేవు. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా బడుగు వర్గాలు, మహిళలు, మైనారిటీలు ఇందువల్ల లబ్ధి పొందుతున్నారు. మొత్తం మీద రాష్ట్రం బాగుపడటంలో ఇది కూడా ఒక భాగమన్నది ప్రజలందరూ రాగల 48 గంటలలో ఆలోచించవలసిన అంశాల్లో ఒకటి.
చివరగా, మనకు అర్థం కాకుండా ఉన్న విషయం ఒక్కటి ప్రస్తావించాలి. అది, తరచుగా ప్రభుత్వాన్ని విమర్శించే కొందరు మేధావులు, యాక్టివిస్టుల గురించి. ప్రభుత్వ విధానాలు, వాటి అమల్లోని లోటుపాట్లను ఎత్తిచూపటం, తమ సూచనలు చేయటం వీరు చేయవలసిన పనే. ఏ వ్యవస్థలోనైనా అది వారి పాత్ర కూడా. కానీ, సమస్య ఎక్కడ వస్తున్నదంటే వారు తెలంగాణ ప్రభుత్వపు డజన్ల కొద్దీ విధానాలు, వాటి అమలు తీరు, అందువల్ల కలిగే ఫలితాల మంచి చెడులు, అందుకు భిన్నంగా చేయవలసిందేమిటి అనే వివరణలతో ఒక సమగ్రమైన నిర్మాణాత్మక పత్రాన్ని ఈ పదేండ్లు పూర్తవుతున్న దశలోనూ సిద్ధం చేసి ప్రజల ముందుంచలేదు. అది వారి తీవ్ర వైఫల్యం కాగా అంతకన్న విచారకరమైన పని ఒకటి చేస్తున్నారు.
ఏ కాంగ్రెస్ అయితే 75 ఏండ్లుగా దేశానికి ఇన్నిన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో, నక్సలిజం సహా అనేక ఉద్యమాలకు కారణమై వేలకు వేలమందిని కాల్చిచంపి లక్షల మందిని జైళ్ల పాలు చేసిందో, తమ వైఫల్యాలతో శూన్యాన్ని సృష్టించి బీజేపీ ఆగమనానికి బాటలు వేసిందో, తెలంగాణ కష్టాలన్నింటికి 1956 నుంచి కారణమై మోసాలు చేసి ఉద్యమాలను అణగదొక్కిందో, తెలంగాణ కోసం ఇప్పటికీ ఒక దార్శనికత లేదో, కేవలం అధికారం కోసం విన్యాసాలన్నీ చేస్తున్నదో, అటువంటి పార్టీ పల్లకిని బహిరంగంగా మోస్తూ ఊరేగుతుండటం ఆశ్చర్యకరమే. అందుకు వారు వివరణ ఇవ్వాలి.
– టంకశాల అశోక్