తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి 4 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. ఇది యావత్తు తెలంగాణ ప్రజానీకం గర్వించదగిన విషయం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ శాతం పెంచి తెలంగాణ రాష్ట్రమంటే లౌకికత్వానికి నిదర్శనంగా నిలిచింది.
ఓబీసీ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడమంటే సమాజంలో సబ్బండ వర్గాల ప్రజలు సమానమని చెప్పటమే. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ భూమిపై సబ్బండ కులాలకూ, మతాలకూ రాజ్యాధికారంలో సమానమైన అవకాశాలు కల్పించినప్పుడే భారతీయ లౌకికత్వానికి నిజమైన అర్థం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి వారికి రిజర్వేషన్లు కల్పించాలి. లేనిపక్షంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచుకునే హక్కును రాష్ర్టాలకు అప్పజెప్పాలి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి ఓబీసీ ముస్లింలకు హక్కుగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం ఈ దేశ లౌకిక చరిత్రను కించపర్చడమే.
ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరున్ని సమానంగా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత. గతంలో తెలంగాణ నుంచి వలసలు ఉండేవి. ఈ వలసల్లో అక్షరాస్యులైన వారు ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికాకు, యూరప్ దేశాల్లోని బ్రిటన్కు వెళ్లేవారు. నిరక్షరాస్యులైన మన యువకులు ముస్లిం దేశాలల్లోని దుబాయ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇరాక్ లకు వలస వెళ్లేవారు. ఆధునిక కాలానికి సంబంధించిన పారిశ్రామిక పనులు తెలియని చాలామంది ముస్లిం దేశాలకు వలస వెళ్లేవారు. ఆ దేశాల్లో ముస్లింలు ఇండియా నుంచి వలసలు వెళ్లేవారికి రకరకాల పనులు కల్పించి అక్కున చేర్చుకున్నారు. అలాంటపుడు మనం ఇక్కడున్న ముస్లిం సోదరులను అక్కున చేర్చుకోలేమా! 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు తీర్పులు తెలంగాణ సామాజిక జీవనవిధానానికి సరైనవి కావు. ఎందుకంటే తెలంగాణలో నూటికి తొంభై శాతం ప్రజలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ లు, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీలు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాలో అగ్రకులాలకు తప్ప మరే ఇతర సామాజిక వర్గానికి అందులో ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ దేశంలో ఆర్థిక వెనుకబాటుతనమంటే కేవలం అగ్రకులాల వారికి మాత్రమే వర్తిస్తుందా. ఆర్థిక వెనుకబాటు కారణం చెబుతూ తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లలో ఆర్థిక వెనుకబాటుతనం కల్గిన ప్రతి సామాజిక వర్గానికి అందులో ప్రాతినిధ్యం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన డిమాండును కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.! ఈ దేశ పరిపాలన కోసం రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి వేసిన రచన కమిటీలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన మేధావుల శ్రమ కూడా ఉన్నదనే విషయాన్ని ఈదేశ పాలకులు గుర్తించాలి. ఈరోజు శత్రు దేశాలకు సవాలుగా తలెత్తి నిలబడ్డామంటే ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అణుబాంబుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన మేధావి అబ్దుల్ కలాం కూడా ఇదే సామాజిక వర్గమని భారతీయులుగా మనం మరువరాదు.