ప్రభుత్వాలు ధాన్య సేకరణ జరపడం వెనుక ఆహారభద్రత అనే పవి త్ర లక్ష్యం ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వచేసి ప్రజ ల అవసరాలకు, మార్కెట్ స్థిరీకరణకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ర్టాలు సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకొని తిరిగి రాష్ర్టాలకే ఇస్తుంది. ఈ అనుసంధానం మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడ్డప్పటి నుంచి అదుపు తప్పుతున్నదనేది నిపుణుల మాట. ధాన్యం కొనుగోలు సమయంలో కేంద్రం రకరకాల కిరికిరిలు పెట్టి తెలంగాణను వేధించడం తెలిసిందే. ఇంతే కొంటాం, అంత కొనలేం, బాయిల్డ్ రైస్ అసలే కొనలేం. ఇలా ఇష్టం వచ్చిన కొర్రీలతో కేంద్రం మన రాష్ట్రం ఓపికను పరీక్షిస్తున్నది. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం కేంద్రానికి ఒక అలవాటుగా మారింది.
కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్ ‘మీ దగ్గర అంత ధాన్యం ఎలా పండింది. ఏదైనా జాదూమంతర్ చేశారా?’ అని వెటకారాలు గుర్తొస్తున్నాయి. బాయిల్డ్ రైస్ కొనమంటే ససేమిరా అంటూ.. తెలంగాణ ప్రజలను నూకల బువ్వ తినమన్నారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో పరేషాన్ చేసిన కేంద్రం తాజాగా బియ్యం విషయంలో మరో రకం కయ్యం తీస్తున్నది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం కింద రాష్ర్టాలకు బియ్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఇక్కడ కర్ణాటక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మొన్నటి ఎన్నికల్లో ‘అన్నభాగ్య’ పథకం కింద ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయాలనుకుంటున్నది. ముందుగా క్వింటాలుకు రూ.3,660 చొప్పున సరఫరా చేసేందుకు ఎఫ్సీఐ ఒప్పుకున్నది. ఇంతలో ఏమైందో ఏమో కానీ, ఈ నెల 12న బియ్యం సరఫరా చేయబోమని కర్ణాటక ప్రభుత్వానికి ఎఫ్సీఐ లేఖ రాసింది. కేంద్రం ఒక్కసారిగా మాటమార్చడానికి గల కారణాలు ఎవరికి వారే ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ర్టాలు బహిరంగ మార్కెట్లోనే బియ్యం కొనుగోలు చేసుకోవచ్చని గోయల్ మరోసారి ఉచిత సలహా పారేశారు. ఈ నేపథ్యంలో ఇక బియ్యం నిల్వలు దండిగా ఉన్న తెలంగాణపైనే కర్ణాటక ఆశలు పెట్టుకున్నది.
కర్ణాటక ప్రభుత్వం అధిక ధర చెల్లిస్తామన్నప్పటికీ కేంద్రం ససేమిరా అంటున్నది. మరోవైపు ఎఫ్సీఐ ద్వారా ఇథనాల్ కంపెనీలకు రూ.2 వేలకు క్వింటాల్ చొప్పున పదిహేను లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. పేదల ఆకలి తీర్చడానికి వెనుకాడుతున్న కేంద్రం పరిశ్రమలకు మాత్రం తక్కువ ధరకే ఇస్తున్నది. తద్వారా పేదల వైపు కాకుండా పెద్దల వైపే మొగ్గుతానని కేంద్రం మరోసారి చాటుకున్నది. కేంద్రం వద్ద బియ్యానికి కొరత ఉందనీ, కొరత నివారణకు ఎగుమతులపై ఆంక్షలు విధించామనేది గోయల్ వాదన. ఆయన అన్నట్టుగా కొరతే నిజమైతే ఇథనాల్ పరిశ్రమకు మాత్రం ఎలా ఇస్తారనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కొనడంలో కొర్రీలు, అమ్మడంలో అవకతవకల వెనుకా కారణం ఉన్నది. ఉచితాలు, సబ్సిడీలు ఎత్తివేసే ఉద్దేశంతో కేంద్రం క్రమంగా ధాన్యం సేకరణను తగ్గిస్తున్నది. అంతిమంగా ఇది దేశ ప్రజల ఆహార భద్రతకు పెనుసవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు.