The Kerala story | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా తప్పుడు మార్గంలో నడుస్తున్నాయి. దేశంలో బీజేపీ మత రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై దాడి చేయటం కోసం, మతాన్ని అడ్డుపెట్టుకొని, ప్రజల్లో లేని భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నది.
కేరళలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను మార్చడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు శక్తివంచనలేకుండా ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలోని ఒక అంశమే ‘ది కేరళ స్టోరీ’ అనే ఒక సినిమాను తీసి, దాన్ని విడుదల చేయడం. నిజానికి ఈ సినిమాలో అన్ని అభూత కల్పనలు, కట్టు కథనాలే ఉన్నాయి. కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతుందని ,‘లవ్ జిహాద్’ పేరుతో అమాయకపు హిందూ అమ్మాయిలను ప్రేమలోకి దింపి, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మతమార్పిడి చేస్తున్నారని నిరాధార అభియోగాన్ని మోపింది. ఈ కట్టు కథ ఆధారంగానే ది కేరళ స్టోరీ తెరకెక్కింది. కేరళ రాష్ట్రంలో 32,000 మంది బాలికలు కనిపించకుండా పోయారనీ, వారిని లవ్ జిహాద్ ద్వారా ఇస్లాంలోకి మార్చి సిరియాకు తరలించారని ఆ సినిమా కథాంశం.
దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం, అన్నీ సంఘ్పరివారే చూసుకున్నదనేది, బహిరంగ రహస్యం.ఈ సినిమాను సంఘ్పరివార్ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి తయారైన విద్వేష పూరిత తప్పుడు ఉత్పత్తిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా విమర్శించారు. ‘కేరళలో అధికార పార్టీగా ఎదగటానికి, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనే వ్యూహాత్మకమైన తప్పుడు మార్గాలను బీజేపీ ఎంచుకున్నది, అయినా, అలాంటి కుయుక్తులు కేరళ రాష్ట్రంలో సాధ్యం కాద’ని ఆయన అన్నారు.
‘మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ ఆ సంస్థ విధానాలనే అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. కానీ, కేరళరాష్ట్రం దేశంలోనే, ఏనాడో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం.అక్కడ ప్రజలు వామపక్ష లౌకిక భావాలు కలిగిన విద్యావంతులు. అక్కడ సంకుచిత, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు,కుతంత్రాలు, కుయుక్తులు పనిచేయవు. కేరళలో వామపక్షం అధికారంలో ఉన్నంతకాలం బీజేపీకి అక్కడ మతరాజకీయాలు సాగించే అవకాశం లేదు.అందుకే మతాన్ని రెచ్చగొట్టడానికి ఒక ఆయుధంగా ఈ సినిమాను వాడుకుంటుంది.ఇది సంఘ్పరివార్ వికృత కార్యక్రమం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.
బీజేపీ,ఆర్ఎస్ఎస్ ‘మత విద్వేషాల’ దుష్ప్రచారం గురించి కేరళ ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఏలాంటి సాక్షాధారాలు లేకుండా ఒక వర్గంపై తప్పుడు ఆరోపణలు సంధిస్తూ మరొక వర్గాన్ని రెచ్చగొట్టేలా కేరళ స్టోరీ సినిమా తీశారు.అసత్య పునాదులపై నిర్మించిన ఈ సినిమా ద్వారా బీజేపీ ఏమి ఆశిస్తుందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
మన హోంశాఖ సహాయ మంత్రి ప్రస్తుతం కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్రెడ్డి ‘లవ్ జిహాదీ’లు లేనే లేరనే విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రకటించారు. స్వయంగా సుప్రీంకోర్టు లవ్ జిహాద్ అంశాన్ని పరిశీలించి అలాంటిదేమీ లేదని కూడా తేల్చి చెప్పింది. అయినప్పటికీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ కలిసి విద్వేషాలు రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని విజయన్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో చెప్పినట్టు వేలాదిమంది బాలికలను నిజంగానే లవ్ జిహాద్తో మోసం చేసి సిరియా తదితర దేశాలకు పంపించేశారా? ఒకవేళ ఇదే నిజమైతే, నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉందా? ఉంటే, ఏలాంటి చర్యలు తీసుకున్నది ? ఒకవేళ సమాచారం లేకపోతే, ఈ వైఫల్యానికి కారకులెవరు? ఇలాంటి సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.
ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వద్దని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు. ముస్లిం లీగ్ అనుబంధంగా ఉన్న యువజన విభా గం ముస్లిం యూత్ లీడర్ ఇప్పటికే, ఈ సినిమాకు మద్దతు ఇచ్చేవారికి సవాలు విసిరాడు. ‘ఈ సినిమాలో చూపిస్తున్నట్లు 32 వేలమంది బాలికలను ఇస్లాంలో కి మార్చి ,మరో దేశానికి తరలించారని రుజువు చేస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించాడు. కానీ, ఆధారాలు లేని ఆరోపణలు చే యటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ,ఇలాం టి దుష్ప్రచారాలు వల్ల బీజేపీకి ఒరిగేది ఏమీ లేదని కూడా స్పష్టం చేశాడు.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్: 98493 28496