మనిషి అభివృద్ధి, వికాసానికి చేతినిండా పని, ఒంటినిండా ఆరోగ్యం ఉండాలంటారు. రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఇక ఆరోగ్యం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇక వైద్యులు రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించేవిధంగా ప్రభుత్వ వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా నిబంధనలు విధించింది. ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తం కావటం గమనార్హం.
రాష్ట్రంలో ప్రజావైద్యాన్ని ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. వనరులు, వసతుల కల్పనతో పాటు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషిచేస్తున్నది. ఈ నేపథ్యంలోంచే ఇక నుంచి కొత్తగా ప్రభుత్వ వైద్యులుగా నియామకమైన వారు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా నిబంధనలు విధించింది. దీంతో వైద్యులు రోగులకు మరింతగా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ఫలితంగా వైద్య చికిత్సల కోసం గంపెడాశతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చినవారికి సరైన, సంతృప్తికరమైన వైద్యసేవలు అందనున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం.. సామాన్యుడు సంపాదిస్తున్న కష్టార్జితంలో సగాన్నికన్నా ఎక్కువగా వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఇంకా చెప్పుకోవాలంటే.. చాలామంది వైద్యం కోసం అప్పుల పాలవుతున్న దుస్థితి ఉన్నదని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. కాబట్టి ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవటం ప్రజానుకూల ప్రభుత్వ కనీస బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. హైదరాబాద్ నలుదిశలా సకల హంగులతో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నెలకొల్పుతున్నది. తెలంగాణలో ప్రధాన నగరమైన వరంగల్లో కూడా మరో అతిపెద్ద ప్రభుత్వ దవాఖానను నెలకొల్పుతూ పేదలకు వైద్యం అందించటం కోసం ఎంత నిబద్ధతతో ఉన్నదో చాటుకున్నది.
ఈ క్రమంలోనే బస్తీ, పల్లె దవాఖానలను కూడా నెలకొల్పి వైద్యసేవలందిస్తున్నది. వీటిలోనే పలురకాల వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తూ, రోగ నిర్ధారణలో సాయపడుతున్నది. ఇలాంటి చర్యలతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో వనరుల కల్పనకు పెద్దపీట వేసి భారీ నిధులను కూడా కేటాయించింది. అన్నిరకాల ఔషధాలను కూడా అందుబాటులో ఉండేట్లు చర్యలు తీసుకున్నది. దవాఖానల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే దుర్గంధపూరిత వాతావరణం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చింది. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి అమలుచేస్తున్నది.
ఈ కోణంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదనే నిబంధనను చూడాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఒకరి స్వేచ్ఛను నియంత్రిస్తారా అన్న కోణంలో కాకుండా సామాజిక బాధ్యతను గుర్తెరిగినవారిగా ఆలోచించాలి. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనలో ఉన్న మానవీయత అర్థమవుతుంది. అయితే ఇదే సమయంలో పూర్తికాలం నిబద్ధతతో వైద్యసేవలందిస్తున్న పరిస్థితుల్లో గతంలో ఉన్నట్లు కాకుండా జీతభత్యాలు పెంచి వైద్యులను ప్రోత్సహించాలి. అప్పుడే సీఎం కేసీఆర్ ఆశిస్తున్న స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందుతాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. గతంలో ఉన్నట్టి ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు..’ అన్న భావన పోయి.. ‘నేను పోత బిడ్డో.. సర్కారు దవాఖానకు, మంచి వైద్యం అందుతుందట.. మంచిగై నేను ఇంటికి తిరిగొస్త..’ అని పాడుకునే సుదినం ఎంతో దూరంలో లేదు.
– డాక్టర్ బి.ఎన్.రావు
(వ్యాసకర్త: ప్రెసిడెంట్ ఎలక్ట్, తెలంగాణ స్టేట్ ఐఎంఏ)