కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుందన్నారు. నిజానికి ఈ బడ్జెట్ పేదింటి వాళ్ల నుంచి పెద్దింటి వాళ్లదాకా అందరినీ నిరుత్సాహపరిచింది. విత్త మంత్రి అందమైన కొత్త పదాలను వాడటానికి ఇష్టపడ్డారు. కానీ పేదవాళ్లను ఆదుకోవడానికి, ఉద్యోగాల సృష్టికి ఎలాంటి కొత్త సంక్షేమ, ఆర్థిక పథకాలను ప్రవేశపెడతారో చెప్పలేకపోయారు.
కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. రానున్న సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్రధాని గతిశక్తి యోజన’, ‘సమిష్టి అభివృద్ధి’, ‘అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు’, ‘పరిశ్రమలకు ఆర్థిక ఊతం’ అనే నాలుగు సూత్రాల ఆధారంగా బడ్జెట్ తయారుచేశామని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే బడ్జెట్ ప్రసంగంలో 2022లో దేశ జీడీపీ 9.2గా నమోదవుతుందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి తమ ఉద్దేశమని సెలవిచ్చారు. వాస్తవానికి దేశ జీడీపీ 2020లో (-) 7.25 శాతం నమోదు కావటం వల్ల, వాస్తవానికి 3 శాతానికి కొంచెం అటూ ఇటుగా మాత్రమే ఉన్నది.
అలాగే.. రానున్న ఐదేండ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. కాగా అవి ఏ రంగంలో సృష్టిస్తారో చెప్పలేదు. పారిశ్రామికరంగంలోనా లేదా సేవలరంగంలోనా, వ్యవసాయాధారిత రంగంలోనా అని చెప్పకపోవడం మసిపూసి మాయ చేయటమే అనిపిస్తున్నది. ఇప్పటికే దేశంలో 6.2 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నది. వారందరికీ ఉద్యోగాలు రావాలంటే.. యాభై ఏండ్లు పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ యాభై ఏండ్ల తర్వాత ఇప్పుడున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కేంద్రం కల్పిస్తే ఏటా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగాలివ్వాలి! వీరందరినీ వందేండ్లు బతికించాలి. ఇలాంటి మాటల గారడీతో దేశాన్ని
ఎంతకాలం మోసం చేస్తారు? నిరుద్యోగ నిర్మూలనకు నిర్దిష్ట కార్యాచరణను చెప్తే బాగుండేది. కానీ నేటి పాలకులకు అంతటి బాధ్యత ఉన్నట్లు ఏ కోశానా కనిపించటం లేదు.
అదేవిధంగా కరోనా పుట్టిందంటున్న చైనాలో 2021-22లో నిరుద్యోగిత రేటు 3.7 శాతం కాగా, భారతదేశంలో చైనా కంటే రెండింతలుగా 7.9 శాతంగా నమోదైంది. అలాగే చైనాలో ఈ పదేండ్లలోనే పదికోట్ల ఉద్యోగాలు కల్పించారు. ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలోనే 80 శాతం సృష్టించటం గమనార్హం. ఇలాంటి సోయి మన కేంద్రానికి ఎందుకు లేదు? సమీకృత అభివృద్ధి అని చెప్తూ 25 వేల కి.మీ. కొత్త జాతీయ రహదారులను 2023 వరకు నిర్మిస్తామని బడ్జెట్లో చెప్పారు. వారు చెప్పిన ప్రకారం.. సగటున రోజుకు 100 కిలోమీటర్లు జాతీయరోడ్డు నిర్మాణం చేస్తారట! కానీ దేశంలో ఎప్పుడూ జాతీయరోడ్డు నిర్మాణం రోజుకు 13.2 కి.మీ. దాటలేదు. పైగా ఈ
ఏడాది అది దాదాపు 11 కిలోమీటర్లకే పరిమితం అయింది.
ఇక కరోనా కాలంలో ప్రజలంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే కేంద్రం పట్టించుకున్న పాపానపోలేదు. ఉపాధి, ఉద్యోగ కల్పనకు పూనుకోలేదు. ఇదే సమయంలో అనేక దేశాలు ఉద్యోగ కల్పనకు కృషిచేశాయి. చైనాలో పదేండ్లలో 10 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తే, మన దేశంలో లక్షల సంఖ్యలో చిన్న, మధ్య తరహా కంపెనీలు మూతపడి ఉన్న ఉద్యోగాలే పోయాయి. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం తర ఫున నుంచి ప్రత్యేకంగా చేపట్టిన ఉపశమన చర్యలనేవే లేకపోవటం పెద్ద విషాదం.
గ్రామీణాభివృద్ధి అని చెప్పిన మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, చాలా కాలంగా కోరుతున్న కనీస మద్దతు ధర విషయం మాత్రం పట్టించుకోలేదు. గ్రామీణ ప్రజలకు దన్నుగా ఉండే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించి పనిదినాలు, వేతనం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నది. దానిగురించి ఇప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు. అలాగే ఇలాంటి పథకాన్నే పట్టణాల్లో కూడా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా పట్టించుకోవటం లేదు. ఉపాధి హామీలో రోజు వేతనం రూ.205 దాటడం లేదు. పనిదినాలు సంవత్సరంలో 42 రోజుల కంటే పెరగకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
కరోనా కాలంలో మొత్తంగా కుదేలైంది.
ఈసారి కేంద్ర బడ్జెట్లో గతం కంటే రక్షణ రంగానికి కేటాయింపు 11 శాతం పెరిగింది. కానీ 62 శాతం మాత్రమే ఆ రంగం ఉత్పత్తులు స్వదేశంలో తయారయ్యేవిధంగా నిర్ణయించడం విదేశీ రక్షణ ఉత్పత్తులకు బాసట గా నిలవడమే. గత కొన్నేండ్లుగా అన్నిరంగాల ఉత్పత్తి, ఎగుమతుల్లో మన వాటా తగ్గుతు న్నా మోదీ ప్రభుత్వం చేసిన చర్యలు శూన్యం.
బడ్జెట్లో ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా) పరిశ్రమలను బలోపేతం చేయడానికిగాను రూ.2 లక్షల కోట్లను కేటాయించి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నిజానికి దేశంలో 6.2 కోట్ల సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలున్నాయి. అవి కరోనా దెబ్బకు కుదేలై లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. వాటి పునరుద్ధరణ కోసం కేంద్ర కేటాయింపులు ఏ మూలకూ సరిపోవు. ఇవికాకుండా విత్త మంత్రి కొత్తగా డిజిటల్ బ్యాంక్ అని, డిజిటల్ కరెన్సీ అనీ, నదుల అనుసంధానం అనీ, పోస్టాఫీసుల బ్యాంకింగ్ అని అందమైన వినసొంపైన మాటలు చెప్పుకొచ్చారు. పేదలకు కేటాయింపుల్లేని బడ్జెట్ రూపొందించి, అభివృద్ధిని అటకెక్కించటం మోదీ ప్రభుత్వ ప్రజా
వ్యతిరేక విధానానికి మచ్చుతునక.
-బైరి నిరంజన్, 93901 15644
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు,
వాణిజ్య-వ్యాపార విభాగం, కేయూ)