బానిసత్వ సంకెళ్ల మధ్యన
భారతావని రగిలిపోయింది
దిక్కులన్నీ పిక్కటిల్లేలా
తెల్ల శక్తులన్నీ చెదిరిపోయేలా
శాంతి బాణాల్ని సంధిస్తూ
ధిక్కరణ స్వరాల్ని వినిపిస్తూ
స్వాతంత్య్రపు సమరాన
సమున్నతంగా నిలబడింది
బానిస సంకెళ్లను తెంచుకుంది
వీర యోధుల పిడికిళ్ళ సాక్షిగా
పోరాట పటిమ నిబద్ధత సాక్షిగా
భరతమాత పరాయి పాలన నుంచి
స్వరాజ్యంలోకి స్వేచ్ఛగా
యథేచ్ఛగా అడుగులు పెట్టింది
స్వాతంత్రోద్యమాలే ఊపిరిగా
నిరాడంబరతే ఉనికిగా
తెల్లదొరతనానికి వీడ్కోలు పలికి
తనకు తానుగా సింహాసనమెక్కింది
ఎర్రకోటపై రెపరెపలాడిన
త్రివర్ణ పతాకపు వెలుగుల మధ్య
అర్ధరాత్రి భరతభూమి
జయం తిలకం దిద్దుకుంది
విజయ సంకేతపు కోడి కూతతో
భారత్ సర్వం నిద్రలేచింది
నిర్భయంగా ముందుకు నడిచింది
ప్రజాస్వామ్యపు పాలన నిలబెట్టుకుంది
భారత్ మాతాకీ జై అంటూ
మూడు రంగుల జెండాగా నింగిన ఎగిరింది
– నరెద్దుల రాజారెడ్డి, 96660 16636