అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా ఉంది లా కమిషన్ తీరు. దేశంలో హక్కులపై, సామాజిక కార్యకర్తలపై, విపక్షాలపై కేంద్రప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతుంటే, దానిని అడ్డుకోవాల్సింది పోయి నిరంకుశాధికారాల్ని మరింత పెంచే విధంగా లా కమిషన్ వ్యవహరించటం విడ్డూరం. రాజద్రోహం చట్టం కింద ఉన్న కనీస జైలు శిక్షను మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పెంచాలని లా కమిషన్ సిఫారసు చేయటం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను తీవ్రంగా ఆందోళన పరుస్తున్నది. అసలు, ఆ చట్టాన్నే రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న సమయంలో, దానిని మరింత బలోపేతం చేయాలని లా కమిషన్ చెప్పటం గమనార్హం. ఇది మోదీ హయాంలో వివిధ సంస్థల పనితీరుకు మరో నిదర్శనం.
రాజద్రోహం బ్రిటీష్ కాలం నాటి చట్టం. అప్పట్లో జాతీయోద్యమాన్ని అణచివేయటానికి, స్వాతంత్య్ర సమర యోధులకు సంకెళ్లు బిగించటానికి ఈ చట్టాన్ని ఉపయోగించేవారు. దానిని స్వాతంత్య్రానంతరం ఉపయోగించటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా, కేంద్రంలోని ప్రభుత్వాల కారణంగా కొనసాగింది. 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ప్రభుత్వాన్ని విమర్శించటం దేశద్రోహం కాదని, రాజద్రోహం చట్టాన్ని అరుదుగా మాత్రమే వాడాలని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వాలు, వాటి చేతుల్లోని దర్యాప్తు సంస్థలు పెడచెవిన పెట్టాయి. మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రశ్నించినా కూడా రాజద్రోహం కేసులు పెట్టి వేధించటం, జైలు పాలు చేయటం పరిపాటైంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం, 2016-19 మధ్యకాలంలో రాజద్రోహం కేసుల సంఖ్య 160 శాతం పెరిగింది. కానీ, వాటిలో నేరం రుజువైన కేసులు కేవలం 3.3 శాతమే. దీనిని బట్టి, రాజద్రోహం చట్టం ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నదో తెలుస్తున్నది.
దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు రాజద్రోహ చట్టం ఆటంకంగా తయారైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు గత ఏడాది ఈ చట్టాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టింది. సదరు చట్టంలో మార్పులు తీసుకొస్తామని ధర్మాసనానికి కేంద్రం హామీ ఇచ్చింది. ఈలోపు రాజద్రోహం కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఓవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే లా కమిషన్ నివేదికను వెలువరించింది. దేశ భద్రత, సమగ్రత కోసం ఈ చట్టం అవసరమని, కనీస జైలు శిక్ష కాలాన్ని పెంచాలని కమిషన్ తన నివేదికలో పేర్కొనటం గమనార్హం. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. స్వయంగా బ్రిటన్లోనే రాజద్రోహం చట్టాన్ని 2009లో రద్దు చేశారు. కానీ, వలస పాలన వారసత్వాన్ని మాత్రం నేటికీ మన పాలకులు కొనసాగిస్తున్నారు. దేశ భద్రత కోసం కావలసినన్ని చట్టాలు ఉన్నాయి. ఉపా, టాడా వంటి నల్లచట్టాలూ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాలనుకోవటం కేంద్రం నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నది. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.