వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలని భావించాడు. స్త్రీలే మేలైన గురువులని, వారి పట్ల ఎటువంటి భేదభావం సరైనది కాదని బోధించాడు. ప్రేమ వివాహాలను ప్రోత్సహించాడు, కులాల అడ్డుగోడలను పట్టించుకోలేదు. వేశ్యల పట్ల కూడా సానుభూతితో వ్యవహరించి వారిని భక్తిమార్గంలోకి తీసుకొచ్చాడు.
మధ్య యుగ భక్తి ఉద్యమంలో మన తెలుగువాడైన, వల్లభాచార్యుడు (1478-1532) ఉత్తర భారతదేశంలో వైష్ణవ భక్తిమార్గాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ప్రముఖుడు. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో తనదైన ‘పుష్టి వైష్ణవ సంప్రదాయా’న్ని, శుద్ధ అద్వైత తత్వశాస్ర్తాన్ని నెలకొల్పిన ధార్మిక తత్వవేత్త చైతన్య మహాప్రభు సమకాలికుడు.
ల్లభాచార్యుని తల్లి ఎల్లమ్మ, తండ్రి కంభంపాటి లక్ష్మణభట్టు. లక్ష్మణభట్టు వేద వేదాంగాలను అధ్యయనం చేసిన విద్వాంసుడు, భక్తుడు. కొన్నాళ్లు కాశీ క్షేత్రంలో నివాసం ఏర్పర్చుకున్నాడు. కాశీ మీద విదేశీయులు దండయాత్ర చేయబోతున్నారన్న వార్తతో, ప్రజలు తలో దిక్కు పరుగులు తీశారు. లక్ష్మణభట్టు, గర్భిణిగా ఉన్న ఎల్లమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయక తప్పలేదు. అలా పయనిస్తూ మధ్యప్రదేశ్లోని రాయపూర్ (ఇప్పటి ఛత్తీస్గఢ్ రాయపూర్ జిల్లా) దగ్గరి మహానది ఒడ్డున ఉన్న దట్టమైన అటవీప్రాంతం చంపారణ్యం చేరేసరికి, ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అక్కడే అడవిలో నెలలు నిండకముం దే ఆమె ప్రసవించింది. అక్కడ పుట్టిన బాలుని పేరే వల్లభుడు.
ఏడేండ్ల ప్రాయం నుంచి వల్లభుడు.. నారాయణ భట్టు దగ్గర వేదాధ్యయనం ప్రారంభించాడు. పన్నెండేండ్లకే భారతీయ తత్వశాస్ర్తాలన్నింటి మీద పట్టు సాధించాడు. అలాగే శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కలనే కాకుండా బౌద్ధం, జైనం తాత్విక విషయాలను సైతం అధ్యయనం చేశాడు. దేశమంతా పర్యటించాడు. మథుర, బృందావనం, ఉజ్జెయిని, హరిద్వార్, బద్రీనాథ్ లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాక అంతిమంగా కాశీలోనే స్థిరపడ్డాడు. కాశీ తిరిగివచ్చాక వల్లభుడు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు గోపీనాథ్, విఠలనాథ్ (గుసాయిజీ).
వల్లభుడు తాను నేర్చుకున్నదంతా కృష్ణ పరమాత్మ దగ్గర నుంచేనని చెప్పుకొన్నాడు. కృష్ణుని రూపంలోనే విష్ణువుని ఆరాధించాలని బోధించాడు. పూరీ జగన్నాథుని దర్శనం కోసం వెళ్లి, రాజు ఆస్థానంలోని పండితులను ఓడించాడు. విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో 27 రోజులు జరిగిన వాదోపవాదాల్లో విజయుడైనాక దేవరాయలు వల్లభుడుకి కనకాభిషేకం చేసి ‘జగద్గురు శ్రీమద్ వల్లభాచార్య’ బిరుదుతో సత్కరించాడు.
వల్లభాచార్యుడు తీర్థయాత్రల్లో.. కుట్టిన బట్టలు వేసుకోకుండా, పాదరక్షలు లేకుండా ఊరి పొలిమేరల్లో ఉండేవాడు. చెట్టు నీడన వండుకొని తినేవాడు. ఈ యాత్రల్లోనే భాగవత పురాణ కాలక్షేపం 84 ప్రాంతాల్లో చేశాడు. అవి ‘చౌరాసీ బైఠక్’లని పిలవబడి పుణ్యక్షేత్రాలయ్యాయి. ఏటా నాలుగు నెలలు బ్రజభూమిలో తప్పక గడిపేవాడు. అన్ని కులాల నుంచి 84 మంది వైష్ణవ అనుయాయులుగా అతని మార్గాన్ని ఆచరించేందుకు తయారయ్యారు.
వల్లభాచార్యుడు ‘ముక్తి’ అంటే ‘శ్రీకృష్ణుని సేవారాధనే’ అని ప్రచారం చేశాడు. ‘అష్ట ఛాప్’ (ఎనిమిది ముద్రలు) పేరు మీద కవుల బృందాన్ని తయారుచేశాడు. వారందరూ విభిన్న కులస్థులే కాకుండా, భిన్న ప్రాంతాలకు చెందినవారు కావటం గమనార్హం. వారి కవిత్వం గానయోగ్యంగా ఉండి అందరినీ ఆకట్టుకునేవి. ఆ కవుల్లో పేరు ప్రతిష్ఠలు పొందినవారే సూరదాస్. ఆ బృందంలోని మిగిలిన ఏడుగురు కవులు -పరమానందదాస్, నందదాస్, కృష్ణదాస్, గోవిందస్వామి, కుంభనదాస్, చీతస్వామి, చతుర్భుజదాస్. మోకాళ్లకు రక్తాలు కారుతున్నా దేవుని ప్రదక్షిణలు చేసే పరమానందదాస్ అంతకుముందు మరాఠీ విష్ణు భక్తుడు. వీరంతా కృష్ణ లీలలను గానం చేస్తూ అప్పటి శక్తిమంతులైన మొఘల్ రాజుల ఉనికిని పట్టించుకునేవారు కాదు.
మథుర, ఆగ్రా మధ్యనున్న యమునా నది ఒడ్డునున్న ‘గౌఘాట్’లో స్థిరపడిన సూరదాస్ (1488-1591)ని వల్లభాచార్యుడు సూరదాసులోని ప్రావీణ్యాన్ని గుర్తిం చి, శిష్యుడిగా స్వీకరించడమే కాకుండా గోవర్ధనగిరి మీది శ్రీనాథుని మందిరంలో ముఖ్య పూజారి బాధ్యతను సైతం అప్పగించాడు. అప్పటినుంచి సూరదాసు గోకులంలోనే ఉండిపోయాడు. ‘అష్ట చాప్’గా పేరొందిన ఎనిమిదిమంది భాగవత కవుల్లో.. వల్లభుని శిష్యుల్లో సూరదాసే మొదటివాడిగా పరిగణించబడ్డాడు. వల్లభుని సూచన మేరకు శ్రీనాథుని బాల్య అవతారాన్ని ఆరాధించమన్న కోరికను మన్నించి, అతని భక్తి కవిత్వమంతా శ్రీకృష్ణుని బాల్య నేపథ్యంతో రచించాడు. ఎవరూ అంత ఉత్కృష్ట దశకు తీసుకుపొలేనంత ఎత్తుకు దాన్ని తీసుకుపోయాడు.
సైద్ధాంతికంగా వల్లభాచార్యుడు ప్రచారం చేసింది శుద్ధాద్వైతం. అయినప్పటికీ ఈ సంప్రదాయానికి ‘పుష్టిమార్గం’ అని పేరు వచ్చింది. బ్రహ్మ సూత్రాల్లో కొన్ని అధ్యాయాలకు ‘అణుభాష్యం’ పేరుతో వల్లభాచార్యులు వ్యాఖ్యానం రాశాడు. శ్రీమద్భాగవతంలో కొన్ని స్కంధాలకు ‘సుబోధినీ’ అనే వ్యాఖ్యానాన్ని, ‘తత్వదీపం’ అనే గ్రంథాన్ని, అనేక స్తోత్రాలనూ ఆయన రచించాడు. అతను రాసిన గ్రంథాల్లో ముఖ్యమైనవి, లభ్యమవుతున్నవి. అవి- యమునాష్టక, బాలబోధ, సిద్ధాంత-ముక్తావళి, నవరత్న, అంతఃకరణ ప్రబోధ, వివేక-ధైర్య శ్రేయనిరూపణ, వ్యాస సూత్ర భాష్య, జైమినీ సూత్ర భాష్య, భాగవత టీకా సుబోధిని, పుష్టి ప్రవాహ మర్యాద, సిద్ధాంత రహస్య మొదలైనవి. హిందీ, సంస్కృతంలోనే కాకుండా, బ్రజ భాషలో కూడా ఆయన రచనలు చేశాడు. అద్భుతమైన ‘మథురాష్టకం’ రాశాడు. బాలకృష్ణుని చేష్టలను అద్భుతంగా చిత్రించిన ఆ ‘మథురాష్టకం’ కవిత ఇది..
‘అధరం మధురం వదనం మధురం/ నయనం మధురం హసితం మధురం/ హృదయం మధురం గమనం మధురం/ మథురాధిపతేరఖిలం మధురం’ ॥1॥
‘వచనం మధురం చరితం మధురం/ వసనం మధురం వలితం మధురం/ చలితం మధురం భ్రమితం మధురం/ మథురాధిపతేరఖిలం మధురం’ ॥ 2॥
అంటూ.. శ్రీకృష్ణుని సకల అంగాలు, చర్యలను వర్ణిస్తూ ఎనిమిది అష్టకాలను రాశాడు.
54 ఏండ్ల ప్రాయంలో తన జీవిత లక్ష్యం నెరవేరిందని, ఈ జీవితం నుంచి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని, అందరూ చూస్తుండగా గంగానదిలో మునిగి అంతర్ధానమైపోయాడని కథనం. వల్లభాచార్యుని రెండవ కొడుకు విఠలుడు తండ్రిని అన్నివిధాలా అనుకరించాడు. అక్బర్ చక్రవర్తి అతన్ని ‘విని గోస్వామి’ బిరుదుతో సత్కరించాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆ కాలంలో హిందూ ముస్లిం ఐక్యతకు కృషిచేశారు. వల్లభుని తర్వాత విఠలుడు అతని ఉత్తరాధికారి అయి, వల్లభ సిద్ధాంతాలను ప్రచారం చేసి, తండ్రి మార్గాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు.
వల్లభాచార్యుడు భక్తి ద్వారా కులాల తారతమ్యాలను అధిగమించవచ్చని భావించాడు. భక్తి అంటే అతనికి కృష్ణ భక్తే. అతని అనుయాయులంతా కృష్ణ ఉపాసకులుగా దాని వ్యాప్తికోసం అనేక గ్రంథాలు, పాటలు రాశారు. దాన్ని వారు వల్లభాచార్యుని పుష్టి మార్గంలో సేవగా నిర్వహించారు.
సగుణ, నిర్గుణ స్థితులు రెండూ బ్రహ్మకు సహజాలేననీ, విరుద్ధ ధర్మాలకు పరబ్రహ్మ ఆశ్రయం కావడం వింత కాదని వల్లభాచార్యుల సిద్ధాంతం. వల్లభ సంప్రదాయంలో శ్రీకృష్ణుడే పరబ్రహ్మ. వల్లభుడి సమాధి, ఆయన కుమారుడు విఠలుడి సమాధి గోవర్ధనగిరి సమీపంలో ఉన్నాయి.
– ముకుంద రామారావు
99083 47273