నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు రాజాలు’ నాడు తెలంగాణ రైతులు, వలస కూలీల కడుపుకోత మాటలివీ.. గతం ఇలా ఉంటే.. నేడు తెలంగాణలో రైతు కంటినిండా నిద్రపోతున్నడు. నాడు రాత్రి వచ్చే కరెంటు కోసం పొలంలోనే పడుకునేవాడు రైతన్న. ఆ సమయంలో పాముకాటు వేసి మరణించిన రైతులెందరో. నేడు తెలంగాణలో 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్తో రైతుల కండ్లల్లో దివ్య దర్శనం ప్రకాశిస్తున్నది. దశాబ్ద కాలంలోనే మన తెలంగాణ దేశానికి ఆదర్శమైంది.
అన్నదాత మరణిస్తే వచ్చే ఐదు లక్షల రైతు బీమాతో ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నది. ఇది చరిత్రలోనే అద్భుతమైన పథకం. సాగు బడికి పెట్టుబడి లేక నెర్రెలు బారిన నేలలకు ‘రైతుబంధు’ అందిస్తూ బంధువైంది రాష్ట్ర ప్రభుత్వం. నాడు బాల్య వివాహాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేది. ఆ జంటకు పౌష్టికాహార లోపంతో, అంగవైకల్యంతో పిల్లలు జన్మించేవారు. కానీ, నేడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాయి. పట్నంలో ఇద్దరు బిడ్డలుంటే బుక్కెడు బువ్వ కోసం ఎదురుచూసే వృద్ధాప్యంలో కర్ర సాయంతోనే కాలం గడుపుతూ, కష్టం చేసుకునే సత్తువలేని ముసలవ్వలకు ఆసరా పింఛన్తో ప్రభుత్వం భరోసా ఇస్తున్నది.
నాడు గోదారమ్మ రాక తెలంగాణ గొడ్రాలుగా మారింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆ నదిని వెనుకకు మళ్లించి ఎర్రటి ఎండల్లో కూడా అలుగులు పారిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే ‘మిషన్ కాకతీయ’ గొప్ప పథకం. భగీరథ ప్రయత్నంతో ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ. ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైతే అప్పుడే పుట్టిన బిడ్డకు ఇచ్చే కేసీఆర్ కిట్. ఇలా చెప్పుకొంటూ పోతే హైదరాబాద్లో ఐటీ కంపెనీల ఉద్యోగాల జాతరలు, అందమైన పార్కులు. సురక్షితమైన ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలు, చూడచక్కని సచివాలయం. అంబేద్కర్ స్మారక విగ్రహం, అమరవీరుల స్తూపం.. ఇలా ఎన్నో ఘనతలను తెలంగాణ సొంతం చేసుకున్నది.
భూగర్భ జలాల పెంపుదలలో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకున్నది తెలంగాణ. ఊరూరా అతి సుందరమైన వీధిలైట్లు చమక్కుమని మెరుస్తున్నాయి. కులవృత్తులను చేరదీయటం అనేది సంస్కృతి మూలాలను కాపాడే పథకాలు. ఎవరూ కూడా వీటిని ఉచితాలని మాట్లాడవద్దు. ఇవి సామాజికంగా కలిగించే ప్రభావం గురించి ఆలోచన చేసి సృష్టించిన పథకాలు. తెలంగాణలో ఉన్నటువంటి జీవన సామాజిక స్థితిగతులను మార్చే గొప్ప ప్రక్రియలు.
నేడు తెలంగాణ వృద్ధి రేటును చూస్తే మనమే ఆశ్చర్యపోవాలి. తల‘సిరిలో’ తెలంగాణనే టాప్. ఏ కలలతో అయితే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, ఆ లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్ని గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ర్టాభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటునే ప్రామాణికంగా తీసుకుంటారు. అంతటి విశేష ప్రాధాన్యం ఉన్న తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతమైన గోవాను మినహాయిస్తే తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తొమ్మిదేండ్ల లో సాధించిన వృద్ధి 156 శాతం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 50 శాతం కంటే ఎక్కువ. దేశానికే రోల్ మాడలని భజన చేసుకునే గుజరాత్ 11వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో నిలిచాయి. ఈ లెక్కలు నేను చెప్పినవి కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయమే వెల్లడించింది.
చివరగా.. ‘కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వసించి, పొద్దుపొద్దున అందాల పూలు పూయు తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని దాశరథి అన్నట్టుగా నా తెలంగాణ నేడు విరాజిల్లుతున్నది.
వికలాంగులను ప్రభుత్వం తన ఒడిలోకి తీసుకొని రూ.3 వేల పింఛన్తో సామాజిక తోడునిస్తున్నది. బీడీ కార్మికులకు భరోసా ఇస్తూనే, ఒంటరి మహిళలకు పెద్దన్న వలె తోడుగా నిలుస్తున్నది. ఇలా ఎన్నో గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో శ్మశానాలకు దిక్కులేని పరిస్థితి. పల్లెల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని దహనం చేయడానికి నాలుగు గజాల స్థలం కోసం వెంపర్లాడే పరిస్థితి. కానీ, నేడు ఊరికి ఉత్తరాన తెలంగాణ వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. 60 ఏండ్లు ఈ దేశాన్ని ఏలిన ఏలికలకు ఈ సోయి ఎందుకు లేదో మరి!