బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరికించాలని చూస్తున్నది. అయితే ఆమె ఈ విషయంలో నిర్భయంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని గౌరవించి సీబీఐ అధికారులు కోరిన వివరణను ఈ నెల 11న అందిస్తానని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులపై కేంద్రం ఇలాగే కుట్రలు పన్నితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని కేంద్రం తెలుసుకోవాలి.
దేశంలో బీజేపీ వైఫల్యాలను, కుతంత్రాలను ఎత్తి చూపడానికి తెలంగాణ సింహం గర్జిస్తున్నది. టపాసుల మోతలు మోగుతున్నాయి. 140 కోట్ల ప్రజల జీవితాల్లో ఉన్న చీకటిని పారదోలి కొత్త వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. దేశ రాజకీయ యవనికపై గులాబీ జెండా రెపరెపలాడే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ నేపథ్యంలో మోదీ నియంతృత్వాన్ని, బీజేపీ అరాచకాలను ఎదురించేందుకు నడుం బిగించినందుకే కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూలదోయాలని ప్రధాని స్వయంగా కుట్రలు చేస్తున్నరు. ఇతర రాష్ర్టాల్లో చేసినట్టుగానే తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన నికృష్టమైన పనులు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. చైతన్యవంతమైన గడ్డపై అంగట్లో సరుకుల వలె ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రయత్నాలు ఇంకా మదిలో మెదులుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన బీజేపీ దూతలు పోలీసులకు దొరికిపోయినా కమలం పార్టీ తీరు మారలేదు. తెలంగాణ ప్రజలను ఇది విస్మయానికి గురి చేసింది. బీజేపీ ఏకంగా కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపైనే ప్రతి చర్యలు ప్రారంభించింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి, భయపెట్టడానికి బీజేపీ రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుంటున్నది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వానికి మద్దతు కోల్పోయి ప్రధాని పదవికి రాజీనామా చేసిన అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యం వహించిన బీజేపీకి, సొంత ఎమ్మెల్యే ఒక్కరు లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న, కూలదోస్తున్న నేటి బీజేపీకి ఎంతో తేడా ఉందని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్గా చేసుకుని ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి. 10 వేల పేజీల ఛార్జిషీట్లో సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ చేస్తున్న దర్యాప్తు రిపోర్టులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న సిసోడియా పేరు లేదు. ఈ కుంభకోణానికి సంబంధించి నిందితుల్లో కవిత పేరు లేకున్నా వివరణ కోసం సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 కింద ఆమెకు నోటీస్ ఇచ్చారు. మోదీ చీకటి పాలనను వ్యతిరేకిస్తున్న కేసీఆర్పై కక్ష సాధించడానికి కేంద్రం కవితను వేధిస్తున్నట్లు కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే తమకు పుట్టగతులు ఉండవని భావించి భారీ అణచివేతను ప్రారంభించింది. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. బీజేపీ చేష్టలు చూస్తుంటే నాడు ఇందిరా గాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుంది. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో నేడు బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బక్క పలచని వీరుడు కేసీఆర్ భారత రాష్ట్ర సమితితో దేశ గతిని మార్చేందుకు బందూకై కదిలారు. కేంద్ర ప్రభుత్వం నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసి, పీడిత ప్రజలకు అండగా ఉంటూ, రైతు రాజ్యం నిర్మించేందుకు ఆయన సిద్ధం కావడం సంతోషకరం.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజకీయ ద్వేషం, ప్రతీకారంతో కేంద్ర ప్రభుత్వం ఇంత దారుణ ంగా రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రాంతీయ పార్టీలను వేధించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి.
మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ, నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడం ఇందుకు నిదర్శనం. ఎందుకు బీజేపీయేతర పార్టీలను వేధిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవారిని తాలిబన్లు అని పిలిస్తే ఏం మాట్లాడతాం? అబద్ధం, అవకాశవావాదం, అరాచకం కలగలిపి వడ్డిస్తే ప్రత్యర్థులు బెంగటిల్లక ఏం చేస్తారు? అయినా బీజేపీ జాతీయ నేత బి.ఎల్.సంతోష్ మాదిరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టు మెట్లు ఎక్కలేదు కదా? నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి, కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధినేత్రిగా విశేషమైన సేవలు అందిస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేకపోయినా చట్టాన్ని గౌరవించి సీబీఐ కోరిన వివరణను ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అందిస్తానని నిర్భయంగా తెలిపారు. కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కావడం వల్లనే కేంద్రం సీబీఐ వివరణ పేరుతో వేధిస్తున్నది. ఈ విషయం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అయినా ఎద నిండా గాయాలున్న తెలంగాణ గుండెకు ఇది మొదటి గాయం కాదు కదా? ఒక్కటి మాత్రం నిజం. దుడ్డు అందుకునే వరకే సమస్య. మేం బందగీ వారసులం, చిట్యాల ఐలమ్మ వారసులం. మూడు తరాలుగా చెలరేగిన సమరంలో పాల్గొన్న వాళ్లం. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని కేంద్రం చేస్తున్న కనిపించని కుట్రలను కని పెట్టలేని అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ బిడ్డలు తిరగబడితే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేయాల్సి వస్తుంది. మోదీ తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉంటే ఈ అఘాయిత్యాలు, ఈసడింపులు ఆగవు. ఇంకా వికృత రూపాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రంలోని దుర్మార్గపు అరాచక పాలన అంతం కావాలంటే దేశంలో ఎక్కడో ఒక చోట ఉద్యమం మొదలవ్వాల్సిందే. దేశం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ లాంటి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఇందుకోసం దేశ ప్రజలంతా బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజకీయ ద్వేషం, ప్రతీకారంతో కేంద్ర ప్రభుత్వం ఇంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రాంతీయ పార్టీలను వేధించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి.
సంగని మల్లేశ్వర్: 98662 55355