భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కానీ ఆధునిక కాలంలోనూ కులాలు, మతాలు అని కొట్టుకు చావడానికి కొందరు నాయకులు కారణం అవుతుండటం మన దురదృష్టం. కులాల పేరుతో ఒకరినొకరు కించపరచుకోవడం మంచిది కాదు. తెలంగాణలో ముఖ్యమంత్రే కులవివక్ష ప్రదర్శించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నది.
ఇటీవల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి తూట్లు పొడిచేదిగా ఉన్నవి. ‘ఏ జాతి నీది’ అంటూ జుగుప్సాకరంగా విమర్శలు చేసిన తీరు చూస్తుంటే రాజ్యాంగం పట్ల ఆయనకు ఎంత అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కుమ్మెర లాంటి దుర్ఘటనలు జరగడానికి రేవంత్రెడ్డి లాంటి పాలకులు కూడా కారణంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలోని మల్లన్న జాతర సందర్భంగా ఆలయంలో జరిగిన అమానవీయ ఘటన సమాజంలో ఓ మాయని మచ్చ. రజక కులానికి చెందిన ఆడబిడ్డ తన పసిపాపతో దైవ దర్శనానికి వెళ్తే అక్కడ కొందరు ఆమెను కులం పేరుతో దూషించి, దాడి చేశారు. ఆ దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇక్కడ రేవంత్రెడ్డి తీరును కూడా మనం గమనించాలి. రేవంత్ది ముందు నుంచి కురుచబుద్ధే. రేవంత్లో కనిపించే అహంకారం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఎదగడానికి కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని ముందుకు పోయే వ్యక్తిత్వం రేవంత్రెడ్డిది. కానీ ఇది సరికాదు. ఎందుకంటే ప్రజల్ని వర్గాలుగా విడగొడితే సమాజ మనుగడకే ప్రమాదకరంగా మారవచ్చు. బీజేపీ పరిస్థితి మరీ దారుణం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు వాడుతున్న భాష జుగుప్సాకారంగా ఉన్నది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా పరుష పదజాలంతో వ్యాఖ్యలకు దిగుతున్నారు.
ప్రజలు అభద్రత మధ్య బతికేలా బీజేపీ నేతల వ్యవహార శైలి ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు బాగున్నప్పుడే దేశ సమగ్రత బాగుంటుంది. కులమతాలకు అతీతంగా సమష్టి భావన పెంచాలనే ఆలోచనా దృక్పథంతోనే ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మానవీయ పంథాను ప్రాథమ్యంగా చూశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు రాష్ట్రంలో కుల కుంపట్లు, మత ఘర్షణలు కనబడలేదు. పల్లెలు, పట్టణాల్లో ప్రజలంతా కలిసి జీవనం సాగించారు. శ్రమైక జీవన సౌందర్యంతో పల్లెలు పసిడి పంటలతో ప్రశాంతంగా ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైంది. పరిపాలన చేతగాని రేవంత్రెడ్డి ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్పై కుల అహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎప్పటికైనా ప్రమాదమే. ఇలాంటి నాయకులు సమాజానికి ప్రమాదమే. ఇప్పటికైనా రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. సమాజంలో కులమతాలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి. సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రజలంతా ఒక్కటే అనే భావనను చాటిచెప్పాలి. పాలకులే జాతి వివక్షను పాటిస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు! ఇది క్షమార్హం కాదు. విభజించి పాలించే సంస్కృతిని పాటించే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.