కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని
ఖూనీ చేస్తున్నది. ఈ పరిస్థితి రోజురోజుకు పెరిగిపోతుండటం బాధాకరం. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం కూడా. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో కొట్టమిట్టాడుతున్నదనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఇంకేం కావాలి?
గత ఎనిమిదేండ్ల బీజేపీ నిరంకుశ, నియంతృత్వ పాలనలో ఇలాంటివి అనేకం చూశాం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకం. దీనికి కొలమానమే ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వర్తించే ‘ఎన్నికల కమిషన్’ (ఈసీ) ఆర్టికల్-324 ప్రకారం.. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే సంస్థ. ఈ సంస్థ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి ఎప్పటికప్పుడు ప్రజల తీర్పును వెలువరించాలి. ప్రజాస్వామిక విలువలను కాపాడవలసిన గురుతర బాధ్యత ‘భారత ఎన్నికల కమిషన్’కు ఉంటుంది. అయితే ఇటీవల దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను పరికించి చూసినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘భారత ఎన్నికల కమిషన్’ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తున్నదని అనిపిస్తున్నది. ఎన్నికల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతున్నది.
కేంద్ర ప్రభుత్వ తీరుతో సామాన్య ఓటరులో ప్రజాస్వామ్యం మీద ఉండే నమ్మకం సన్నగిల్లిపోతున్నది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ అధీనంలో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ‘ఈవీఎం ఓటింగ్ వద్దు-బ్యాలెట్ పేపర్ ముద్దు’ అని ప్రజల నుంచి, ప్రాంతీయ పార్టీల నుంచి డిమాండ్ వస్తుండటానికి కారణం… కేంద్రం వ్యవహరిస్తున్న తీరే. యూపీ, గోవాల మధ్య ఎన్నికల నిర్వహణకు 60 రోజుల వ్యవధి ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఒకేసారి రెండు రాష్ర్టాలకు ఎన్నికలను నిర్వహించింది. 40 రోజుల వ్యవధి ఉన్న హిమాచల్ప్రదేశ్ గుజరాత్కు ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నదని స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం పొంతన లేని సమాధానం చెప్తూ ‘ఎన్నికల కమిషన్’ అభాసుపాలవుతున్నది. రాజస్థాన్ ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని గంటలు ఆపి ప్రధాని ర్యాలీకి సహకరించి మోదీని ప్రసన్నం చేసుకున్నది ఈసీ. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలంగా ఉన్నందున గుజరాత్లో బీజేపీకి ఓటమికి భయం పట్టుకున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పై వరాల వర్షం కురిపించేందుకు అక్కడ ఎన్నికల నిర్వహణ ఆలస్యం చేస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 8 మందిని, మణిపూర్లో ఆరుగురు (జేడీయూ) ఎమ్మెల్యేలుంటే ఐదుగురిని బీజేపీ కొనుగోలు చేసింది. మునుగోడు విషయానికొస్తే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకున్నామని బీజేపీ ప్రగల్భాలు పలకడం విడ్డూరం.
ఇక మునుగోడు విషయానికొస్తే ఎన్నికల కమిషన్ ప్రకటించకముందే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ చెప్పారంటే ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని అర్థమైపోతున్నది. మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈసీకి టీఆర్ఎస్ ఎన్నిరకాలుగా విన్నవించినా పెడచెవిన పెట్టింది. కోర్టులో కేసు వేసి, టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపినా పట్టించుకోలేదు. బీజేపీకి ఈసీ ఒక నమ్మకమైన కార్యకర్తలా పనిచేస్తున్నదని అర్థమవుతున్నది. కోట్ల డబ్బుల కట్టలతో బీజేపీ బినామీలు పట్టుబడినా ఈసీ చూసీచూడనట్టు వ్యవహరించడం విడ్డూరం. తానేం చదివాడో ప్రధాని మోదీకే తెలియదు. అలాంటి ఆయనను పట్టుకొని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైంటిస్ట్ అని చెప్తుంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది. అధికారం కోసం బీజేపీ నాయకులు ఆడే టక్కు టమారా విద్యలు దేశాన్ని ప్రగతిలో ముందుకు తీసుకుపోయే అంశాలపై దృష్టి పెడితే బాగుంటుంది. అలా చేసి ఉంటే మొన్న వెలువడిన ఆకలి సూచీలో 101 నుంచి 107 స్థానానికి దిగజారి పోయేది కాదు. పాక్, బంగ్లా, నేపాల్ వంటి చిన్న దేశాలకంటే భారత్ దిగజారి ఉండేది కాదు! కేంద్రం తీసుకునే అనాలోచిత, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలతో రూపాయి విలువ పడిపోతే, ‘రూపాయి విలువ పడిపోలేదు డాలర్ విలువ పెరిగింది’ అన్న ఆర్థికమంత్రి మాటలు విని భారతీయులు నవ్వుకుంటున్నారు. బీజేపీ నాయకుల మేధావి తనానికి దేశం ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితికి దిగజారిపోతుందో అని భయభ్రాంతులకూ గురవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కవి ‘అలిశెట్టి ప్రభాకర్’ కలం నుంచి జాలువారిన…
‘నీకు నీవే గుడ్డిగా నమ్మి
మురిసిపోకు, భ్రమ చెందకు..
నీ దేశం ఎన్నో ప్రగతి మెట్లెక్కిందని
ఒక్కమారు ఈ దేశం దేహమంతా
నీ కళ్ళ కాళ్ళతో గాలించి చూడు
అప్పుడైనా తెలుసుకుంటావేమో..
అవి ప్రగతి మెట్లు కావు
కుళ్లిపోతే కట్టించుకున్న బ్యాండేజీ కట్లు’
మాటలు యాదికొస్తున్నాయి.
మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీ కారణం కాదా? ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిసోడియా వెంట ఈడీ వంటి సంస్థలు వేటకుక్కల్లా పడుతున్నాయనేది నిజం కాదా? తెలంగాణకు ఇవ్వాల్సిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా గుజరాత్కు ఎలక్ట్రికల్ లోకో మీటర్ ఫ్యాక్టరీని, హైదరాబాద్కు రావాల్సిన ఆయుష్ కేంద్రాన్ని గుజరాత్ జామ్నగర్కు మార్చుకొని తెలంగాణపై వివక్ష చూపడం అబద్ధమా?
ముఖేష్ సామల: 97039 73946