అది.. 2018 ఫిబ్రవరి 27. బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రగతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ను సందర్శించిన చారిత్రక సన్నివేశం. ఆ సందర్భంగా జిల్లాలో ‘పాడి’ అభివృద్ధి కోసం రూ.18 కోట్లు విడుదల చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. అంతే.. మరుసటి రోజే సచివాలయం నుంచి ఉత్తర్వులు విడుదలై.. ‘పాడి విప్లవం’ మొదలైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే.., రాజధానికి సుదూరంగా, అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటందని భావన. దానికి గత పాలకుల వివక్ష, నిర్ల క్ష్యం కారణం. కానీ రాష్ర్టావతరణ తర్వాత పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా విశాల ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాలుగా ఏర్పడి ఇప్పుడిప్పుడే ప్రగతి రుచి చూస్తున్నది. రైతుబిడ్డ లోక భూమారెడ్డి అధ్యక్షుడిగా విజయ డెయిరీ పట్ల పూర్తి అవగాహన ఉన్న అధర్సిన్హాలాంటి అధికారి ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా, ప్రభుత్వ అండదండలతో వివిధ ఉత్పత్తులతో నేడు విజయ డెయిరీ వెలిగిపోతున్నది.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో.. ఆదిలాబాద్ లో రోజూ 20వేల లీటర్ల పాల నిర్వహణా సామ ర్థ్యం, నిర్మల్లో రోజుకు10వేల లీటర్లు, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రోజుకు 20వేల లీటర్ల పాల నిర్వహణా సామర్థ్యంతో డెయిరీలు ప్రారంభమైనాయి. అంతేగాక, నిర్మల్ జిల్లా అధికారుల చొరవతో జిల్లాలోని భైంసా, కడెం, నిర్మల్ పాలశీతలీకరణ కేంద్రాలు విజయడెయిరీ నిర్వహణలోకి వచ్చాయి. కొత్తగా, ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో రోజుకు వెయ్యి లీటర్ల పాల నిర్వహణా సామర్థ్యంతో మినీ పాలశీతలీకరణ కేంద్రం కూడా ఏర్పాటైంది. ‘రూర్బన్ మిషన్’ నిధులతో కుమ్రం భీం అసిఫాబాద్లో రోజుకు వెయ్యి లీటర్ల సామ ర్థ్యం గల డెయిరీ ప్రారంభమైంది.
విజయ డెయిరీ అందిస్తున్న పలు ప్రోత్సాహకాల వలన నానాటికీ రైతుల్లో పాడి పరిశ్రమ పట్ల ఆసక్తి పెరుగుతున్నది. గతంలో అయితే ఉమ్మ డి జిల్లాలో కేవలం 300 నుం చి 400 లీటర్ల పాలు సేకరించేది. ఇప్పుడది వేల లీటర్లకు పెరిగింది. బ్యాంకులు సైతం పాడికి రుణాలు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నాయి. డెయిరీల స్థాపనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు, పాఠశాలలకు నాణ్యమైన తాజా పాలు లభ్యమవుతున్నాయి. దూరభారం తగ్గి పాలు తాజాగా ఉండటంతో వినియోగదారుల ఆదరణ కూడా పెరిగింది. డెయిరీల స్థాపన వలన నిరుద్యోగులు డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలతో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 శిశు సంక్షేమప్రాజెక్టులైన అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విజయపాల సరఫరాకై సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆదిలాబాద్ డెయిరీ ఆవరణలో దుకాణ సముదాయం నిర్మాణం వల్ల కూడా అదనపు ఆదాయం చేకూరుతున్నది. త్వరలో ఆదిలాబాద్, నిర్మల్లో పెట్రోల్ బంక్ల స్థాపనకై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఒక్క హామీ, నిధుల విడుదల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ‘పాడి’ రూపు రేఖలనే మార్చేసింది. ఒకప్పుడు పక్క జిల్లాలనుంచి తెచ్చిన పాలు చెడిపోవటం, నష్టాలు రావటం జరిగేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలపై ప్రత్యేక దృష్టి కారణంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. పాడిరైతుల ఆదరణ, ఉద్యోగుల అంకిత భావం వల్ల సంస్థకు రాష్ట్రస్థాయిలో ఉన్న రూ.30 కోట్ల నష్టాన్ని పూడ్చుకొని, నేడు రూ.750 కోట్ల వార్షిక లావాదేవీలకు చేరిందంటే ఇది బంగారు తెలంగాణ దిశగా గమనానికి చక్కని తార్కాణం.
సాంప్రదాయ పాల ఉత్పత్తులే కాకుండా విభిన్నంగా విజయ డెయి రీ తెచ్చిన విజయనీళ్లు, లడ్డూలు విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. రాబోయే రోజుల్లో అత్యాధునికంగా హైదరాబాద్ శివార్లలో ఏర్పడుతున్న మెగా డెయిరీ వల్ల తెలంగాణ పాడి రైతులకు మహర్దశ రాబోతున్నది.
(వ్యాసకర్త: ఉపసంచాలకులు, విజయ డెయిరీ, తెలంగాణ)
– మధుసూదనరావు 91211 60553