అది మార్చి 30. ఉదయం 8 గంటలు. ఉమ్మడి ఏలుబడిలో ఎగువ మానేరు పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారిలో ఒకరైన గూడూరు చీటీ వెంకటనర్సింగారావు, నేను మేడిగడ్డ చూసేందుకు బయలుదేరాం. అల్వాల్ టు లక్ష్మి బ్యారేజ్. 270 కిలోమీటర్ల దూరం. 5 గంటల ప్రయాణం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడికి చేరుకున్నాం. ఎంతో ప్రయాసపడి అక్కడికి వెళ్తే గేటు మూసి ఉంది. గార్డును రిక్వెస్ట్ చేశాం. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్తూనే ఆంక్షల బోర్డు చూపించాడు. రక్షణ బలగాలది అదే మాట. ఎల్అండ్టీ వారూ అంతే. అందరి చుట్టూ చక్కర్లు కొట్టాం. అయినా ప్రయోజనం లేదు. అంతా నిశ్శబ్దం. నిర్మానుష్యం. స్తబ్ధత. భారీ యంత్రాల విశ్రాంతి. మూడు రాష్ర్టాల సీఎంల యాగశాల షెడ్డు కింద టూ వీలర్లు ఉన్నాయి. సంద్రంలోకి పోయే నీరు పోగా, మధ్యలో పాయల్లా జలాలు. తేలిన ఇసుక తెన్నులు. లక్షల ఎకరాలకు నీళ్లందించిన కాళేశ్వరం ప్రాజెక్టును అలా చూసి తల్లడిల్లిపోయాం.
ప్రాజెక్టును చూసేందుకు అనుమతించకపోవడంతో మేడిగడ్డ (అంబట్పల్లి) నుంచి గోదావరి-ప్రాణహిత సంగమానికి చేరుకున్నాం. మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరిసరాల్లో తిరిగాం. బోసిపోయిన ఆ ప్రాంతం మదిలో రిజిస్టరై.. తిరుగు ప్రయాణంలో మదిని తొలుస్తున్నది. కేసీఆరే సీఎంగా ఉంటే ఇప్పుడు ఏం చేసేవారనే ప్రశ్న నా మదిని తొలుస్తున్నది. ప్రశ్నతో పాటే సమాధానాలు తన్నుకొస్తున్నాయి. ఆయనే గనుక సీఎంగా ఉండి ఉంటే.. మేడిగడ్డ బ్యారేజ్కున్న 85 పిల్లర్లలో పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్లను రిపేరు చేయించేందుకు అక్కడే మకాం వేసేవారు. తెలంగాణ తేవడం ఆయనకు ఎంత అత్యవసరమో, కాళేశ్వరం ప్రాజెక్టును పరిపూర్ణం చేయడం, పరిరక్షించడం కూడా అంతే. కాబట్టి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఆయనకు అదే పని చేసేవారు. ఆ మూడు పిల్లర్లు చక్కదిద్ది, రైతుకు పంటల సద్ది కట్టే దాకా మేడిగడ్డే సీఎం క్యాంపు ఆఫీసు అయ్యేది. కాఫర్ డ్యాం కట్టించి, నీళ్లను ఎత్తిపోయించి, పొలాలు పారించేవారు. మేడిగడ్డను రిపేర్ చేయించే విషయమై.. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సేవలు అందిపుచ్చుకునేవారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరినైనా యుద్ధ ప్రాతిపదికన మోహరించేవారు. కరువుఛాయలే లేకుండా ఈపాటికి అంతా సజావుగా ఉండేది. వచ్చే వర్షాకాలానికల్లా మేడిగడ్డ బ్యారేజ్ సురక్షితంగా ఉండేది.
ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాత కేసీఆర్ సహకారం తీసుకుంటే రాజకీయాలకే రోల్మోడల్ అయ్యేది. కానీ, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే కానీ నియంత్రణ మాత్రం ఢిల్లీది. అందుకే రాజకీయ లాభనష్టాల బేరీజులో కాళేశ్వరం నలుగుతోందా? ఆ ప్రభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పడుతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వడం ఎవరి తరమూ కాదు. అలాగే కరువు వల్ల ఏర్పడిన కష్టనష్టాలూ పూడ్చలేనివే. తరతరాలు కరువు కాటకాలతో తల్లడిల్లిన ప్రాంతం మన తెలంగాణ. సుమారు ఎనిమిదేండ్లుగా లేనిది అకస్మాత్తుగా ఎవరు తెచ్చిన కరువు ఇది? కాలమా? మనుషుల మస్తిష్కమా? ఈ క్రమంలో ఎట్లెట్ల బతుకు తెరువు అనే రంది మళ్లీ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టుల అంశంపై భిన్న వాదనలు బోలెడు. సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లూ ఏకాభిప్రాయంతో లేరు. ఎవరి లైన్ వారిదే. అంకెలు, లెక్కలు, ఆకృతులూ అంతే. అంతిమంగా గోస మాత్రం సేద్యానికే, ప్రజలకే.
తెలంగాణలో చాన్నాళ్లకు కరువు వచ్చింది. ఇప్పటికే 10-14 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఇపుడే ఇట్ల ఉంటే, వచ్చే సీజన్లో పుసుక్కున కాలం కాకుంటే ఎట్లా? ఎవరు తెచ్చిన కరువో, కారకులు ఎవరో కాని వివాదం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రీకృతమైంది.
తరాల కరువు కాలగర్భంలో కలిసే ఉపాయమైంది కాళేశ్వరం. ఇప్పుడదే అపాయంగా కాంగ్రెస్ సర్కారుకు తోచింది. నిరుడు ఈ టైంకు ఎటు చూసినా నీరు. కనుచూపునకు మించి పచ్చని పొలాలు. అలాంటిది ఎద్దడి దుఃఖపెడుతూ ఒత్తిడి పెంచుతోంది. చాన్నాళ్లకు మళ్లా బోరు ఉనికిలోకి వచ్చింది.
ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తడం చరిత్రలో కొత్త కాదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కడెం డ్యాం కొట్టుకుపోయింది. దేవాదుల పైపులు, గూడెం లిఫ్టు పగిలాయ్. దేవాదుల ఫేజ్ త్రీ టన్నెల్ డ్యామేజ్ అయింది. మూసీ గేట్లు కొట్టుకుపోయినయి. సింగూరు డ్యాం గేట్లూ కొట్టుకుపోయినయి. పాలెం వాగు ప్రాజెక్టు మట్టికట్ట రెండుసార్లు తెగింది. చెప్పుకొంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల ప్రకారమే కాళేశ్వరం వ్యయం రూ.93 వేల కోట్లు. 93 వేల ఎకరాల ఆయకట్టు. కానీ, 17 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగలేదా? ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2, ఎల్ఎండీ, నిజాంసాగర్, అప్పర్ మానేరు వంటి అనేక ప్రాజెక్టుల కింద చెరువులు నిండాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1960 దశకంలో మొదలైంది. 65 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు 17 ఏండ్లు పట్టింది. ఏ ప్రాజెక్టుకైనా నిలదొక్కుకోవడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. కానీ కాళేశ్వరం మాత్రం రికార్డుస్థాయిలో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చింది. మన తెలంగాణకు గోదావరే పెద్ద దిక్కు. ఆ జలాల్లో 966 టీఎంసీల నీటి వాటా సమర్థవంతంగా వాడుకునే ప్రణాళిక గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ- డిజైన్ చేసి, 240 టీఎంసీల నీటి వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులకు కేసీఆర్ సర్కార్ బీజం వేసింది.
అయితే కేసీఆర్ సర్కార్ అందించిన ఫలాలను కాంగ్రెస్ పాలకులు అందుకోవడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం మారాక అన్నారం బ్యారేజీ నుంచి గోదావరి నీటిని టీఎంసీల కొద్దీ వదిలేశారనే చర్చ ఉంది. ఆ విధంగా సముద్రం పాలు చేయకుండా, కాఫర్ డ్యాం కవచంగా చెరువులకు నీళ్లను మళ్లించి ఉంటే ఇంత అనర్థం జరిగేదా? మేడిగడ్డ వద్ద ఒక్కోసారి 20 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుంది. జూన్లోగా రిపేర్ చేయకుంటే పూర్తి బ్యారేజీకి ప్రమాదం. అంతిమంగా సస్యశ్యామల తెలంగాణ రాష్ట్రమే ఏ పార్టీ ప్రభుత్వానికైనా ధ్యేయం కావాలి. తెలంగాణకు మంచి జరుగుతుందనే అంతటి కాళేశ్వరం ప్రాజెక్టును తలపెట్టారు కేసీఆర్. ఫలితాలు చూపెట్టారు. ఈ అంశంలో చెడ్డ పేరు తెచ్చుకోవాలని కేసీఆర్కు ఉంటుందా? ఎవరైనా క్షణకాలం నిదానంగా ఆలోచించాలి.
– దుర్గాప్రసాద్ ఇల్లెందుల
94408 50384