తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను దాటుకొని చేతికివచ్చిన పంటను మార్కెట్కు తీసుకువస్తే మద్దతు ధర ఉండదు. అంతటి పాడుకాలం. వ్యవసాయం చేసి అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయానికి చేయూతనివ్వకపోగా వ్యవసాయం దండగన్న పాలకుల తీరు ప్రజలకు శాపంగా మారింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సేకరించిన లెక్కల ప్రకారం 1998-2014 వరకు 17,871 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ రికార్డులకు అందిన, పోస్టుమార్టమ్ లెక్కలు మాత్రమే. పట్టించుకునే దిక్కు, ప్రశ్నించే నాధుడు లేక లెక్కలోకి రాని రైతుల ఆత్మహ త్యలు ఈ లెక్కలకు మించి రెండింతలు ఎక్కువే ఉంటాయి. కానీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల గురించి, ఆత్మహత్యకు పురిగొల్పుతున్న పరిస్థితుల గురించి ఆలోచించిన నాయకుడే లేడు. వారిని ఆదుకున్న దాఖలాల్లేవు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6 లక్షల చొప్పున పరిహారం అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2014లో 338, 2015లో 504, 2016లో 218, 2017లో 29 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున సాయం అందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కాకుండా వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలకు భరోసాగా ఉండాలని 2018 ఆగస్టు 15 నుంచి ‘రైతుబీమా’ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ పథకం ప్రకారం 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం మరణించిన పది రోజుల్లో వారి కుటుంబానికి ఎల్ఐసీ ద్వారా అందజేస్తున్నది ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు మొత్తం 71,433 మంది రైతు కుటుంబాలకు రూ.3571.65 కోట్ల సాయం అందింది. దీనికిగాను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం కింద నాలుగు విడతల్లో రూ.3204.73 కోట్లు జీవిత బీమా సంస్థకు చెల్లించింది. ఇది మట్టిని నమ్ముకొని మానవాళికి ఆహారం అందిస్తున్న రైతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న భరోసా. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వమే లేదు ఒక్క తెలంగాణ తప్ప.
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి సారించారు. వలస పాలకుల నిర్లక్ష్యానికి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను 2016 వరకు అందుబాటులోకి తెచ్చి సాగు నీరు అందించారు. కేవలం మూడేండ్లలో ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపూర్తిచేయడం చారిత్రాత్మకం.
రైతాంగంలో ఆత్మైస్థెర్యం నింపేందుకు సాగునీరందించడమే కాకుండా ఎకరానికి ఏడాదికి రెండు విడతలలో రూ.8 వేలు అందించే ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండు విడుతలుగా అందిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతుల ఖాతాల్లో జమచేసిన మొత్తం రూ.50,680 వేల కోట్లు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒకే పథకం కింద లబ్ధిదారులకు ఇన్ని వేల కోట్లు ఇచ్చినట్లు చరిత్రలో లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, రైతాంగం పట్ల ఉన్న ప్రేమ మూలంగానే ఇలాంటి గొప్ప పథకం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. 63 లక్షల కుటుంబాలు అంటే, దాదాపు 2.5 కోట్ల జనాభాకు ప్రత్యక్షంగా రైతుబంధు పథకంతో లబ్ధి చేకూరుతున్నది.
‘రైతేరాజు’ అనేది గత పాలకులకు నినాదం మాత్రమే. కానీ అది కేసీఆర్ పాలనా విధానం. రైతులను ఆత్మహత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి రైతన్నను సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్ది. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రైతుబంధు, రైతుబీమా, సాగు నీరు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచడమే కాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరాను చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కరెంటు కోసం అరిగోస పడ్డ రైతాంగం నేడు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంటు ను పొందుతున్నారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 22 లక్షలున్న వ్యవసాయ మోటార్లు ఏడేండ్లలో 30 లక్షలకు చేరుకున్నాయి. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక వ్యవసాయ విస్తర ణాధికారిని నియమించడమే కాకుండా, రూ.22 లక్షల చొప్పున రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను నిర్మించారు. రైతులను సం ఘటితం చేయటం కోసం రైతుబంధు సమన్వయ సమితులను ఏర్పాటుచేశారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ వచ్చేనాటికి సాగు భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలుండగా నేడు 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు చేరింది. అంటే అదనంగా 84 లక్షల ఎకరాల నూతన సేద్యాన్ని తెలంగాణలో సాధించాం. 2014-15 లో పంటల దిగుబడి 154.16 లక్షల టన్నులు ఉంటే, 2020-21 నాటికి (120.55 శాతం వృద్ధి చెంది) 185.84 లక్షల టన్నులు పెరిగి 340 లక్షల టన్నులకు చేరుకున్నది.
మార్కెట్లో రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని, సంప్రదాయ సాగుతో రైతాంగం నష్టపోకూడదన్న ఉద్దేశంతో ‘మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్’ ఏర్పాటుచేశారు. ప్రతి సీజన్కు ముందు ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అధ్యయనం చేసి రైతులు ఏ పంటలు పండించాలో సూచనలు చేస్తున్నది.
ఈ దేశంలో రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాడు కరెంటు అడిగితే రైతుల్ని కాల్చి, కాటికి పంపారు. కానీ నేడు సెకను కూడా కరెంటు పోని పరిస్థితి. నాడు పడావుపడ్డ భూముల్లో నేడు పచ్చని పంటలు దర్శనం ఇస్తున్నాయి. ప్రకృతి ఒడిలో రమణీయతను పెంచుకున్న ప్రాంతం తెలంగాణ. అనతికాలంలోనే 3.67 శాతం అటవీ విస్తీర్ణాన్ని పెంచుకున్న తెలంగాణ 3 డిగ్రీల ఊష్ణోగ్రతలను కూడా తగ్గించుకోవడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలపై కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘నీతి ఆయోగ్’ సంస్థ ప్రశంసలు కురిపించింది. నీతి ఆయోగ్ సభ్యులు రమేష్చంద్, వ్యవసాయ రంగ నిపుణులు అశోక్ గులాటి, శ్వేతా సైని, దేవేందర్ శర్మ, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్లు రైతుబంధు పథకాన్ని వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా అభివర్ణించారు. 2018 నవంబర్లో రోమ్ నగరంలో ప్రపంచ ఆహార సంస్థ ప్రపంచంలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యాలపై నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పేర్కొన్న ప్రపంచంలోని 20 మేటి పథకాల్లో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఉండటం తెలంగాణకే గర్వకారణం. భారత ఆహార రంగ సంస్థ (ఎఫ్సీఐ) గతేడాది సేకరించిన వరిధాన్యంలో ఒక్క తెలంగాణ నుంచే 54 శాతం సేకరించామని ప్రకటించడం అభినంద నీయం. ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణను ఏడేండ్లలో అన్నపూర్ణగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నేడు తెలంగాణలో పరిఢవిల్లుతున్నది. నేడు దేశానికి .. రేపు ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు)
–సింగిరెడ్డి నిరంజన్రెడ్డి