తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు నెలవు. నిజాం పాలనాకాలంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అందులో ముఖ్యంగా స్త్రీలు ఎన్నో కష్టాలను చవిచూడాల్సి వచ్చింది. స్త్రీల ధన, మాన, ప్రాణాలు హరించబడ్డాయి. అంతేగాకుండా స్త్రీలు కుటుంబంలోనూ, సమాజంలోనూ అనేకరకాలైన అణచివేతలకు గురయ్యారు.
స్త్రీ ఇంటి నిర్వహణలోనూ, ఉద్యోగ నిర్వహణలోనూ శక్తికి మించిన బాధ్యతల్ని నెరవేరుస్తూనే ఉన్నది. అయినా ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కొంటున్నదన్నది సత్యం. ఈ సమస్యలను ఎదుర్కొని బయటపడడానికి ప్రయత్నిస్తారు స్త్రీలు. కానీ అనాగరిక సంప్రదాయపు ముసుగులో ముందుకు వెళ్ళనివ్వని సాధక బాధకాలన్నీ తెలంగాణ కథా సాహిత్యంలో చిత్రితమయ్యాయి.
తెలంగాణ మహిళ కథాసాహిత్యానికి భండారు అచ్చమాంబ ఆద్యురాలని ఒక అభిప్రాయం. ఆమె స్త్రీ జనోద్ధరణ భావాలుగల కథలను 1898 లోనే రాసినట్లుగా తెలుస్తున్నది. 1901, 1902లో ఆమె రాసిన ‘లలితాశారదలు’, ‘ధనత్రయోదశి’ కథలు అందుకు ఉదాహరణలు. అలాగే ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, పాకాల యశోదారెడ్డి, ఇల్లిందల సరస్వతీదేవి, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, ముదిగంటి సుజాతారెడ్డి, గీతాంజలి (భారతి), అనిశెట్టి రజిత, కరుణతాయారు, గోగుశ్యామల, జూ పాక సుభద్ర, జాజులగౌరి, షాజహానా మొదలైన తెలంగాణా రచయిత్రులు స్త్రీలు పడుతున్న అవస్థల్ని భిన్నకోణాల్లో చిత్రిస్తూ, ఆ సమస్యల సుడిగుండాల నుంచి బయటపడే తెగువను తెచ్చుకోవాలన్న సందేశాల్ని ఇస్తున్నారు. అన్నివర్గాల నుంచి స్త్రీలు తమ గొంతుకలను కలం పట్టి బహుజన స్త్రీల సమస్యలను గుర్తించేలా సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఆ నేపథ్యంలోంచి వచ్చిన కొన్ని కథల్ని గమనిస్తే స్త్రీ సాధక బాధకాలు తెలుస్తాయి.
స్త్రీల పైన జరిగే దాడులు కోకొల్లలు. చివరికీ చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక దళిత బాలికపై లైంగికదాడి చేసిన వైనాన్ని జాజులగౌరి ‘కంచె’ కథలో చిత్రించారు. ఈ కథలో బాలిక తనపై జరిగిన ఘోరానికి చనిపోవాలనుకుంటుంది. కానీ, ‘తల్లీ! నువ్వు సస్తే నా కడ్పు కాల్తది. ఆ బాడుకవులు బలిసి సేసిన పనికి నువ్వెందుకు సావాలె? పానం ఉన్నదంటే మీదపడ్డ బురదను కడ్గుకోని మంచి బతుకు బతుకొచ్చు. ఎదల కోపంతో నీ జిందగీని యిడ్సుకోకు. యింకనన్నా లోకం తెల్సుకొని మసులుకో’ అని తల్లి పోచమ్మ బిడ్డను ఓదార్చుతుంది.
ఆధునిక కాలంలో కూడా దళితుల పట్ల సమా జం చూపే వివక్షను జూపాక సుభద్ర ‘శుద్ధి చెయ్యా లె’ కథలో చిత్రించారు. ఈ కథలో రచయిత బాగా చదువుకొన్న అమ్మాయి. పీజీ పాసవుతుంది. లెక్చరర్ పోస్టు వస్తుంది. శివదేవ్పూర్ జూనియర్ కాలేజీలో పోస్టింగ్. ఆ ఊరిలో ఇల్లు అద్దెకు దొరకడం సమస్య. ఎలాగో అనేక షరతుల మీద ఒక ఇల్లు అద్దెకు దొరుకుతుంది. ఆ ఇంట్లో చేరిన ఐదోరోజు కాలేజీలో ఉండగా ప్యూన్ను ఇంటిగల వాళ్ళు పిలిచి, ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో రచయిత్రి ఆశ్చర్యపోతుంది.‘కడజాతోల్లంటగదా, మొకాలు జూసిచ్చినం, ముందు ఆ సామాను తీసుకెళ్ళమని చెప్పు. యిల్లు శుద్ధి చేయించాలి’. అని చప్రాసితో ఆ ఇంటివారన్న మాటలు విని ఆమె బాధపడ్తుంది. ఆ ఇంటి వారిని చూడటం అసహ్యమనిపించి, ఫ్యూన్తో సామాను తెప్పించుకుంటుంది. ‘శుద్ధి చేయాల్సింది యిల్లును కాదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి’ అని అంటుంది.
అంటరానివారన్న వివక్షకు గురైన దళిత అమ్మాయిగాథ ఇల్లిందల సరస్వతీదేవి ‘మెహర్తాని’. ఈ కథలో శాంతి దళిత అమ్మాయి. మరుగుదొడ్లు కడిగే మెహర్తార్ల కుటుంబానికి చెందిన అమ్మాయి. కాలనీలోని మరుగుదొడ్లను కడిగే తల్లికి సహాయంగా శాంతి కూడా వెళ్తుంటుంది. శాంతి, ఆమె అన్న లక్ష్మణ్ ఒకే కాలేజీలో చదువుతుంటారు. శాంతి అన్న ఎంబీబీయస్. ఆదర్శ భావాలుగల వ్యక్తి. శాంతి మెహర్తార్ల కుటుంబానికి చెందిన దళిత అమ్మాయి అని క్లాస్లో తోటి విద్యార్థులు శాంతితో మాట్లాడరు. విష యం తెలిసిన శాంతి అన్న కాలేజి ప్రిన్సిపాల్ని కలిసి శాంతిని క్లాస్లో అవమానించిన విషయం చెప్తాడు. ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తానని ప్రిన్సిపాల్ అం టా డు. లక్ష్మణ్ కులవృత్తిని కించపరచ కూడదని, వివరంగా చెప్పడంతో కథా సుఖాంతమవుతుంది.
కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులిద్దరూ మూలస్తంభాలే కానీ బాధ్యతలను పట్టించుకోకుండా తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యని వదిలేసి ఊర్లమ్మటి తిరిగే ప్రబుద్ధులు ఎందరో. కానీ పిల్లలకు తల్లిగా మమకారాన్ని వదులుకోలేని స్త్రీ ఎంత కష్టపడైనా తన బిడ్డల్ని సాదుకుంటుంది. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. బాధ్యతలు లేని తండ్రికన్నా కన్న పిల్లల్ని కష్టపడి పెంచుకునే తల్లి అవసరం అన్న సందేశాన్ని గోగు శ్యామల “ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం” కథలో చిత్రించారు.
ముస్లిం కుటుంబాల్లో సంతానం ఎక్కువ. అందునా ఆడపిల్లలెక్కువ. చదువు చెప్పించే సంప్రదాయం ఎలాగూలేదు. దానికి తోడు ఘోషా పద్ధతి వల్ల కనీసం ఊరి బయట బహిర్భూమికెళ్ళడానికి కూడా వారికి అనుమతుండదు. ఊళ్ళోని మిగిలిన కులాల స్త్రీలు లావెటరీలు లేకపోయినప్పటికీ చెంబు పట్టుకుని ఊరి బయటికి వెళ్ళడానికి వీలుంటుంది కానీ ముస్లిం స్త్రీలకు అది కూడా అందనిమానిపండే. పేదరికం కారణంగా కనీస సౌకర్యాలు లేకపోవడం, పరదాపద్ధతి వల్ల స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పడే అవస్థలను షాజహానా “సండాస్” కథలో చిత్రించారు.
పై కథల్ని పరిశీలించినట్లయితే ముక్కుపచ్చలారని బిడ్డపై అఘాయిత్యం జరిగినా ధైర్యం తెచ్చుకున్న దళిత మహిళ పోచవ్వ పాత్ర స్ఫూర్తిదాయకం. అలాగే శుద్ధి చెయ్యాలె కథలో ‘శుద్ధి’ చెయ్యాల్సింది ఇల్లును కాదు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి’ అన్న రచయిత్రి సందేశం స్ఫూర్తిదాయకం. ఈవిధంగా తెలంగాణ కథాసాహిత్యంలో బహుజన రచయిత్రులు వివిధ వర్గాల స్త్రీల సాధకబాధకాల్ని చిత్రీకరించి, ఆ దిశగా సమస్యల పరిష్కారాన్ని, చిత్రించారు. సమాజంలో వారి వంతు బాధ్యతగా సాహిత్యం ద్వారా స్త్రీ సమస్యల్ని పరిష్కరించే సాహితీకృషి అభినందనీయం. బహుజన రచయిత్రుల కలాల నుండి ఇంకా సాహిత్యం వెలువడాల్సిన అవసరం ఉన్నది.
తాగుబోతు భర్త పారిపోతే అష్టకష్టాలుపడ్తూ, ఐదుగురు పిల్లల్ని కష్టపడి సాదుకోవడానికి ఇస్త్రీ పెట్టె చేత బట్టి బతుకుబండిని లాగడానికి పూనుకొన్నది మల్లమ్మ. ఆమె గాథను ముదిగంటి సుజాతారెడ్డి ‘పలాయనం’కథగా చిత్రించింది. తాగుబోతు భర్తలాగా కన్నబిడ్డల్ని వదులుకోలేక మల్లమ్మ తన రెక్కల కష్టంతో పిల్లలను పెంచుకుంటుంది. భర్త జాతరలో కన్పించాడని ఎవరో చెప్పినా మల్లమ్మ బాధ్యతలేని ఆ తాగుబోతు భర్తని గురించి పట్టించుకోదు. పిల్లల బరువు బాధ్యతలు తీరేవరకూ తాను బతికుంటే చాలనుకుంటుంది.
డాక్టర్ ఓరుగంటి సరస్వతి: 97044 82892