‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆయన నోటి వెంట ఇటువంటి మాటలు రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్కు కర్ణాటక ఫలితాలు కొత్త ఆశలు పుట్టించాయి. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే రేవంత్ మాటలు కానీ, తెలంగాణ కాంగ్రెస్ ఆశలు కానీ గాలిలో మేడల్లాంటివనే అర్థమవుతుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి అనేక స్థానిక అంశాలు దోహదం చేశాయి. ఆ పరిస్థితులు తెలంగాణలో లేవు. కర్ణాటకలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన 40 శాతం కమీషన్ ఆరోపణలు ప్రజలను ఆలోచింప చేశాయి. మరోపక్క ధరల పెరుగుదల, బీజేపీ మతతత్వ రాజకీయాలకు విసుగు చెందిన ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు. హలాల్, హిజాబ్, ఆజాన్తోపాటు బజరంగ్దళ్ అంశాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూసింది కానీ ఇవన్నీ కలిసి రాకపోగా వ్యతిరేకంగా పని చేశాయి. దీనితో కాంగ్రెస్ విజయం సులభమైంది.
తొమ్మిదేండ్ల కిందటి వరకు తెలుగు నేలపై ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో మాత్రమే ప్రతిపక్ష హోదాలో నెట్టుకొస్తోంది. కొంతకాలంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగోలేదు. గెలుపోటముల పోటీ నుంచి తప్పుకుని మూడో పెద్ద పార్టీగా సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో ఇది చూశాం. బీఆర్ఎస్పై గెలిచి అధికారం చేపట్టడం కాంగ్రె స్కు పగటి కలలు కనడం వంటిదే. రేవంత్ చెప్పినట్టు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులు అన్నీ కలిసినా ఇది సాధ్యం కాదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల నుండి అనుమతి రావాలి. ఇక్కడి ప్రజల మనోభావాలు ఆ పెద్దలకు ఏమి అర్థం అవుతాయి? ఇది తెలంగాణలో కాంగ్రెస్కు అతి పెద్ద అడ్డంకి. తెలంగాణ కాంగ్రెస్లో లీడర్ల మధ్య కొరవడిన ఐక్యత అందరికీ తెలిసిందే. రేవంత్ను కొంతమంది సీనియర్లు ఒంటరి చేయడం, బహిరంగంగా విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఆ పార్టీకి ప్రతిబంధకమే. గతంలో ఓటుకు నోటు కేసులో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ ఏవిధంగాగా అభాసుపాలు చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించడానికి కూడా కాంగ్రెస్ ధైర్యం చేయదు. ఆలా ప్రకటిస్తే పార్టీలో సీనియర్ల మధ్య వచ్చే కుమ్ములాటలు అందరికీ తెలిసినవే. మొన్న రేవంత్ ప్రెస్మీట్లోనే సీనియర్ నేత హనుమంతరావు.. తనను రాజీవ్గాంధీ సీఎం చేద్దామనుకున్నారు అని చెప్పుకొచ్చారు.
రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ యాత్ర సమయంలోనే జరిగిన మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ ఎలా విఫలమైందో తెలిసిందే. ఇక ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణలో అద్భుతాలు చేస్తుందని అనుకోవడం గాలిలో మేడలు కట్టినట్టే. ఇటువంటి ఇంటి సమస్యలను పరిష్కరించుకుని కాంగ్రెస్ బయటకు వస్తుందనుకున్నా, అపర చాణక్యుడు కేసీఆర్తో రాజకీయంగా పోటీ పడడం కష్టమే.
మరోపక్క, కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పరుగులు తీస్తున్నది. రాష్ర్టానికి పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు, కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ, ఇప్పుడు దేశానికే రోల్మాడల్గా మారింది. తెలంగాణకు ఇంతటి గౌరవాన్ని ఆర్జించి పెట్టిన కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నది.
ఇలాంటి పరిస్థితులలో ఎక్కడో, ఏవేవో పార్టీలలో ఉన్న నాయకులను కూడగట్టుకుని, బలం పుంజుకుని, ప్రజల మనసు గెల్చుకొని, రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూ అధికారం చేపట్టాలి అని కాంగ్రెస్ అనుకోవడం తప్పుకాదు కానీ ఊహల పల్లకిలో ఊరేగడమే అవుతుంది.
తటవర్తి అనూష