సుదీర్ఘ ఉద్యమం, దానికి అవసరమైన రాజకీయ శక్తుల ఏకీకరణ, నాయకత్వం రూపొందించి అమలుచేసిన వ్యూహాత్మక
నిర్ణయాలు, ఎత్తుగడలన్నీ కలిసి అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ, స్వరాష్ట్రం కల నెరవేరి ఎనిమిదేండ్లు పూర్తయి తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిందీ కొత్త రాష్ట్రం. ఈ సందర్భంగా అనేక జ్ఞాపకాలు కండ్లముందు సినిమా రీళ్లలా కదలిపోతున్నాయి.
రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఆర్ఎస్ యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ ఏకం జేసింది. ఆ రోజుల్లో తెలంగాణ సమాజం మొత్తం ఏకాత్మగా నిలిచింది. పార్టీల రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా అందరి అజెండా ఒక్కటే. అదే తెలంగాణ రాష్ట్రం. ఉద్యమకాలంలోనే తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ఆంధ్రా వలసపాలకులు అనేక కుట్రలు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. తద్వారా శాంతియుతంగా జరుగుతున్న పోరాటాన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజల చైతన్యం ముందు వలసపాలకుల ఎత్తుగడలు, పాచికలు పారలేదు.
ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే అది సాధ్యమని నమ్మి ఆ దిశగా రాజ్యాంగబద్ధ, శాంతియుత, ప్రజాస్వామ్యయుక్తమైన ప్రయత్నాలు జరిగాయి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్న చిదంబరం ప్రకటన తర్వాత తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నాటి నుంచి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి, శక్తులకు ఇక్కడి ప్రజలు విచక్షణాయుతంగా పూర్తి సహాయ, సహకారాలందించారు.
భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలన్న చర్చ ఉద్యమకాలం నుంచే కొనసాగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ ట్యాగ్లైన్ అమలు ఈ ఎనిమిదేండ్లలో ఆచరణాత్మక దిశలో కొనసాగింది. ఉద్యమంలో పాల్గొన్న సబ్బండవర్ణాల కుటుంబాలన్నింటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ‘ఆసరా’ పేరుతో అందిస్తున్న పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులకు భరోసా కలిగించాయి. వ్యవసాయానుకూల విధానాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. సాగునీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో నిత్యకృత్యంగా ఉండేవి.
తెలంగాణ ప్రజాభీష్టం ప్రకారం… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగాన్ని ప్రాధాన్య రంగంగా ఎంచుకున్న ప్రభుత్వం మొదటినుంచీ పెద్దపీట వేస్తూనే ఉన్నది. కాళేశ్వరం లాంటి భారీ బహుళార్థక సాధక సాగునీటి ప్రాజెక్టును ఎవరూ ఊహించని సమయంలో పూర్తిచేసింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసే ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతున్నది. ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువులు పునరుద్ధరించబడ్డాయి. ఫలితంగా భూగర్భజలాలు ఎన్నడూలేని విధంగా పెరిగాయి. అలాగే తాగునీటి కోసం గోసపడ్డ పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. గతంలో ఫ్లోరైడ్తో బాధపడిన గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన రాజేందర్సింగ్ చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ‘రైతు బంధు’ ద్వారా రైతులకు పెట్టుబడి సహాయ పథకాన్నీ, ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే ‘రైతు బీమా’ ద్వారా కుటుంబపరిహారం అందించే పథకాన్నీ స్వామినాథన్ లాంటి ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్తలు అభినందించటం గమనార్హం.
‘తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుంద’న్న వాళ్లే తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా కరెంట్ కోతలు పోయి నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందరి అనుభవంలోకి వచ్చింది. ఈ ఎనిమిదేండ్లలో ‘పట్టణ ప్రగతి’, ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాల ద్వారా తీసుకుంటున్న చర్యలతో పట్టణాల్లో, గ్రామాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నది. హరితహారం ద్వారా రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెంపు కోసం చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో పచ్చదనం అనూహ్యంగా పెరిగింది. ‘కల్యాణలక్ష్మీ’, ‘షాదీముబారక్’ ద్వారా ఆడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందుతున్నది. వందలాది గురుకుల పాఠశాలల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నది. ‘కేసీఆర్ కిట్’ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య తగ్గడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటికితోడు ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించిన80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తెచ్చిన నూతన జోనల్ విధానం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎంతో మేలు చేయబోతున్నది.
ఈ ఎనిమిదేండ్లలో నాటి ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాయా అనే ప్రశ్న ఎదురుకావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం, ప్రాధామ్య అంశాలవారీగా తీసుకున్న పథకాలు కొన్ని తక్షణంగా, మరొకొన్ని దీర్ఘకాలంలో ఫలితాలనందిస్తాయి.
అయితే వైద్య, విద్యారంగాల్లో, ముఖ్యంగా పాఠశాల, ఉన్నత విద్యారంగాల్లో ఇంకా ముఖ్యమైన సంస్కరణలు, మౌలికమైన మార్పు లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామికంగా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం విద్వేష-వైషమ్య రాజకీయాలకతీతంగా ప్రశాంతంగా ఉంటేనే, సంక్షేమ ఫలాలతో పాటు సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి వల్ల వచ్చే దీర్ఘకాలిక ఫలితాలు ప్రజలకు చేరుతాయి. కానీ కొన్ని రాజకీయశక్తులు రాష్ట్రంలో విద్వేషపూరిత సామాజిక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుయుక్తులు పన్నుతున్నాయి. అలాంటిదే జరిగితే సంక్షేమం-అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయి సామాజిక, ఘర్షణాత్మక పరిస్థితి నెలకొంటుంది. అటువంటి సంక్షోభ పరిస్థితి సమతుల్య ఆర్థిక ప్రగతికి, సామాజిక సామరస్యానికి అత్యంత ప్రమాదకరం. చైతన్యవంతమైన ఈ గడ్డపై అలాంటి రాజకీయాలకు చోటులేదని ఇక్కడి ప్రజలు అనేక సందర్భాల్లో నిరూపించారు. చైతన్యపరులైన తెలంగాణ ప్రజలు నిజమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ విలువలకు నిబద్ధమైన, భాగస్వామ్యయుత ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోవాలి. సమ్మిళిత, సుస్థిరాభివృద్ధిని ఎంతటి త్యాగాలకోర్చయినా నిలుపుకోవాలి, పరిరక్షించుకోవాలి.
– ఆచార్య కుసుంబ సీతారామరావు
(వ్యాసకర్త: ఉపకులపతి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఇంచార్జి ఉపకులపతి, ఓయూ)