ప్రస్తుత వ్యాపార రాజకీయ ఎడారిలో ఇసుక కొండల వంటి రాజకీయ నేతలను కాకుండా, ఒయాసిస్ లాంటి మానవీయ నేతలను గుర్తించి కాపాడుకోవడమే ప్రజలకు శ్రీరామరక్ష. అరుదుగానైనా మానవీయ నేతలు ఉన్నారు. నాడు కాంగ్రెస్ కార్పొరేట్ పాలనను ధిక్కరిస్తూ పేదల శ్రేయోభిలాషిగా టీడీపీని స్థాపించారు ఎన్టీఆర్. కాంగ్రెస్ కార్పొరేట్ దోపిడీ నుంచి తెలంగాణ విముక్తి కోసం టీఆర్ఎస్ను స్థాపించారు కేసీఆర్. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణను సాధించడమే కాదు, విద్యుత్తు, వ్యవసాయం, పారిశ్రామిక సంక్షోభాలకు తాళలేక పొట్ట చేత పట్టుకుని పేదలు వలసెత్తిన ఆకలి తెలంగాణను కేవలం తొమ్మిదిన్నరేండ్లలో కరోనా కష్టాలను దాటుకొని మరీ భారత ధాన్యాగారంగా తీర్చిదిద్దారాయన. దటీజ్ కేసీఆర్.
నాడు విదేశీయులు బహూకరించిన ట్రాక్టర్ను వినియోగించుకోవడం చేతగాక పొలాల్లో వదిలేసిన అనాగరిక రైతు రష్యాను దశాబ్ద కాలంలోనే అంతరిక్షంలోకి రాకెట్ను పంపగలిగిన అగ్రరాజ్యంగా తీర్చిదిద్దారు. ఆయనే స్టాలిన్. మనకన్నా ఎక్కువ జనాభాతో, కరువు కాటకాలతో తల్లడిల్లుతున్నప్పుడు చైనా గద్దెనెక్కారు డెంగ్ సియావో పింగ్. స్టాలిన్ మార్గంలో ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి దిశగా వ్యవసాయాభివృద్ధి చేయాలని నడుం బిగించిన ఆయన.. ఐదేండ్ల పాటు బడ్జెట్లో 90 శాతం నిధులను వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఆనకట్టలు, రిజర్వాయర్లు, హైబ్రిడ్ వంగడాలు, రైతులకు ప్రోత్సాహకాలతో ఆకలితో అలమటిస్తున్న చైనాను అన్నపూర్ణగా రూపొందించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచారు. దాంతో దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు రెక్కలు గట్టుకొని మరీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాలో వాలిపోయారు. అలా వ్యవసాయాభివృద్ధి ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించి, అమెరికాకు దీటైన ప్రపంచాగ్ర దేశంగా చైనాను తీర్చిదిద్దారు డెంగ్ సియావో పింగ్.
అధ్యయనశీలి అయిన కేసీఆర్ రష్యా, చైనాల మార్గంలో పయనిస్తూ ‘మిషన్ కాకతీయ’ పేరిట చెరువులను పునరుద్ధరించారు. కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టారు. వందల మీటర్ల లోతులో ఉన్న నదీ జలాలను కొండంత ఎత్తున్న తెలంగాణకు మళ్లించవచ్చని ఆరు దశాబ్దాల పాటు పాలించినవారిలో ఏ ఒక్కరైనా ఊహించారా? ‘నాలుగు పుస్తకాలు చదివి తానే తెలివిగలవాడినని కేసీఆర్ అనుకుంటున్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి వెక్కిరిస్తున్నారు. పుస్తకాలను కాదు, సీఎం సారూ! తెలంగాణ అణువణువును అధ్యయనం చేసిన ఏకైక నేత కేసీఆర్. అందుకే ఆయన తెలంగాణ పిత. స్టాలిన్, డెంగ్, కేసీఆర్ వంటి దార్శనిక ప్రజానేతల్లో కామన్గా ఉండే విశిష్ట లక్షణం ఏమిటంటే.. ‘తన బిడ్డ దేహం పట్ల పూర్తి అవగాహన గల తల్లిలాగే రష్యాలోని ప్రతి గ్రామం పట్ల స్టాలిన్కు, చైనాలోని ప్రాంతాలన్నింటిపై డెంగ్కు, తెలంగాణలోని ప్రతి పల్లె పట్ల కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది. అంతే కాదు, సగటు పాలక నేతల్లా.. ఆశల కోసం కాదు, ఆశయ సాధన కోసం రాజకీయాన్ని చేపట్టిన నేతలు వాళ్లు. అందువల్లనే అతి స్వల్పకాలంలో రష్యాను స్టాలిన్, చైనాను డెంగ్ ప్రపంచ దేశాలుగా, తెలంగాణను కేసీఆర్ భారతాగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
కేసీఆర్ను బద్నాం చేయాలన్న దురుద్దేశంతో నోటి దగ్గరకు వచ్చిన పంటచేలను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టారు. అదే మీ స్థానంలో కేసీఆర్ ఉండి ఉంటే తక్షణమే కుంగిన పిల్లర్ల పటిష్టతకు ఆదేశించేవారు. పక్కాగా కాపర్డ్యాం నిర్మించేవారు. నీళ్లను ఎత్తిపోయించి, చెరువులు నింపి, పంటచేలకు నీళ్లు పారించేవారు. కానీ, మీరు మాత్రం రైతుల కళ్లలో నీరు పారించారు. మార్పు అంటే ఇదేనా సీఎం సారూ! మానవీయ నేతకు, రాజకీయ నేతకు తేడా ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది తెలంగాణ ప్రజలకు.
నాడు ‘ప్రపంచానికే ప్రమాదకారి నాజీ హిట్లర్’ అని గుర్తించిన తొలి నేత స్టాలిన్. ఐరోపా దేశాలన్నీ కూటమిగా ఏర్పడి హిట్లర్ కుయుక్తులను తిప్పికొడదామని ఆయనే మొదట ప్రతిపాదించారు. అయితే సోషలిస్టు రష్యా పతనాన్ని కాంక్షిస్తున్న బ్రిటన్ తదితర దేశాలు దాన్ని తిరస్కరించాయి. ముందుచూపుతో హిట్లర్తో సంధికి స్టాలిన్ అంగీకరించారు. సంధికాలాన్ని రష్యా పటిష్టతకు, ఆయుధాల ఉత్పత్తికి సద్వినియోగం చేసుకున్నారు. స్టాలిన్ ఊహించినట్టే సంధిని అతిక్రమించిన హిట్లర్ సేనలు రష్యాపై విరుచుకుపడ్డాయి. తానే ముందుండి ఎర్ర సైన్యంతో ప్రతిఘటించిన స్టాలిన్ నాజీలను తరిమికొట్టారు. రష్యాతో పాటు ఐరోపా దేశాలకు విముక్తి కలిగించారు. దటీజ్ స్టాలిన్.
నేడు ‘మత విద్వేషపు బీజేపీ భారత్ దేశానికే ప్రమాదకారి’ అని గుర్తించిన తొలి ప్రాంతీయ నేత కేసీఆర్. ముందుచూపుతో బీజేపీతో లౌకికంగా వ్యవహరిస్తూ ‘తెలంగాణ’ అనే శిశువును మొదట పటిష్ఠ పరుచుకున్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి బీజేపీని ప్రతిఘటిద్దామని ప్రతిపాదించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేసిన నాయకుడిని తెలంగాణకు రప్పించి బలపరిచిన ఏకైక ప్రాంతీయ పార్టీ నేత కేసీఆరే. అమరులైన రైతు ఉద్యమకారుల కుటుంబాలకు చేయూతనిచ్చిన ఏకైక ప్రాంతీయ నేత కేసీఆరే. పార్లమెంట్లో రాహుల్గాంధీని అవమానించిన బీజేపీని ఎండగట్టింది కేసీఆరే. ‘మోదీ గారు! మీరు ప్రైవేటీకరించిన వాటిని తిరిగి మేం జాతీయం చేస్తాం. వ్యవసాయాభివృద్ధికి, రైతులకు, కూలీలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. తద్వారా భారతదేశాన్ని ప్రగతి ప్రథంలో పయనింపజేస్తాం’ అంటూ బహిరంగంగా బీజేపీకి సవాలు విసిరిన ఏకైక ప్రాంతీయ నేత కేసీఆర్. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ చేసిన కుట్రను బయటపెట్టిందీ కేసీఆరే.
అటువంటి దార్శనిక ప్రజానేత కేసీఆర్ను, బీఆర్ఎస్ను బీజేపీకి ‘బీ టీమ్’ అంటూ రాహుల్గాంధీతో సహా విజ్ఞులైన కొందరు వామపక్ష నేతలు, మేధావులు కూడా విమర్శించడం తెలంగాణకే కాదు, భారతదేశానికే దురదృష్టకరం. ‘ప్రతిపక్షాలు, మీడియా, సోషల్ మీడియా చేసిన అబద్ధాల ప్రచారాన్ని నమ్మి నిండు మంచినీటి కుండను బోర్లించుకున్నాం’ అని ఇప్పుడు బావురుమంటున్నారు తెలంగాణ ప్రజలు.
ప్రియమైన తెలంగాణ ప్రజలారా! కొందరు ఎప్పుడూ చంద్రుడిలోని మచ్చల్నే చూపుతుంటారు. వాళ్లను పట్టించుకోకండి. సూర్యుని వేడిని తాను భరిస్తూ, ప్రాణులకు చంద్రుడు ప్రసాదిస్తున్న చల్లని వెలుగులను ఆస్వాదిస్తూ సేద తీరండి. దయచేసి వాస్తవాన్ని విస్మరించకండి. వర్తమాన రాజకీయ వ్యాపార వ్యవస్థలో కేసీఆర్ వంటి అరుదైన దార్శనిక, మానవీయ నేతలను బలపరుచుకోవడమే కులమతాలకు అతీతంగా తెలంగాణలోని అన్నదాతలు, పేదలకు శ్రీరామరక్ష.
– పాతూరి వేంకటేశ్వరరావు 98490 81889