షియా వర్గానికి చెందిన ఓ తెగ ముస్లిం మహిళలకు ఊరట లభించింది. ఏన్నో ఏండ్లుగా చేస్తున్న వారి పోరాటం ఫలించింది. షియా వర్గంలోని అక్బరీ తెగ మహిళలను కూడా ఇబాదత్ఖానలోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జషన్లు, మత పరమైన కార్యకలాపాల్లో వారికి కూడా స్థానం కల్పించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తాజాగా ఆదేశించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంజుమన్ ఏ అలావి, షియా ఇమామియా ఇత్నా అసారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతీమా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు వారికి ఊరట కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
దారుల్షిఫాలో 150 ఏండ్ల చరిత్ర కలిగిన ఇబాదత్ఖాన విషయంలో షియా ముస్లిం వర్గంలోని రెండు తెగల మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తున్నది. 2019లో దీన్ని పునర్మించిన తర్వాత ఇక్కడ మత పరమైన కార్యకలాపాలు, ఉత్సవాలు, వేడుకలు జరుగుతున్నాయి. అయితే షియా వర్గంలోని ఉసూలీ తెగ మహిళలను జషన్లు తదితర కార్యకలాపాలకు అనుమతిస్తూ తమ పట్ల వివక్ష చూపుతున్నారని అక్బరీ షియా తెగ మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర వక్ఫ్ బోర్డు, ఇబాదత్ ఖాన ముతావలీ కమిటీకి ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. వివిధ కోర్టుల్లో దీనిపై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్బరీ తెగకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు అక్బరీ తెగ మహిళలను కూడా వేడుకలు, ఉత్సవాలకు అనుమతించాలని ఆదేశాలివ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే వారిని ఎందుకు అనుమతించలేదో పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డును హైకోర్టు ఆదేశించడం గమనార్హం.
– ఎడిటోరియల్ డెస్క్