తెలుగువారిని ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఒకప్పుడు మదరాసీ అనేవారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదం తర్వాత ఆంధ్రావాలే అని పిలిచేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ వాలేగా సంబోధిస్తున్నారు. ‘కిదర్ సే అయా’ అని అడిగితే, తెలంగాణ అని చెప్తే.. ‘ఆప్ కేసీఆర్ ఇలాఖా సే అయే క్యా’ అని అంటున్నారు. తెలంగాణకు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది కేసీఆర్ వల్లనే అనేది నిర్విదాంశం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేతగా, పరిపాలనాదక్షత కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్కు వచ్చిన గుర్తింపుతో ‘మాది తెలంగాణ’ అని ప్రతి ఒక్కరూ తలెత్తుకొని సగర్వంగా చెప్పుకొనే స్థాయికి తీసుకొచ్చారు. జాతీయపార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఇక్కడ ఖమ్మంలో పెట్టడం ఏమిటని ప్రశ్నించిన వారికి… అదే రోజు అత్యవసరంగా ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గంతో భేటీ కావడమే.. దమ్మున్న కేసీఆర్ వంటి నాయకుడు సభ ఎక్కడ పెట్టినా దేశవ్యాప్తంగా ఆ సభ ఇప్పుడు ప్రకంపనలు సృష్టించింది. ప్రతి తెలంగాణవాడు గర్వపడేలా చేసింది కేసీఆరే.
విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్లో ఎప్పుడు చేరారని సోషల్ మీడియాలో ఇటీవల ఆమె పెట్టిన పోస్టుతో అనుమానాలు రేకెత్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వదిలిపోయేటట్టు సీనియర్లు వేధిస్తున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రేవంత్రెడ్డి గురించి చేసినవా? లేక పరోక్షంగా బీజేపీలో బండి సంజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి చేసినవా? అని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. రేవంత్రెడ్డిని మార్చాలని అక్కడ సీనియర్లు డిమాండ్ చేసినట్టుగానే బీజేపీలో కూడా సీనియర్లు బండి సంజయ్ని మార్చాలని డిమాండ్ ఏమైనా చేస్తున్నారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయశాంతి వ్యాఖ్యలతో బండి సంజయ్ని మార్చుతారేమో అని చర్చకు తావు ఇవ్వడం వల్లనే ఎన్నికల వరకు అతనే కొనసాగుతారని పార్టీ నేతలు కిషన్రెడ్డి, తరుణ్చుగ్ స్పష్టం చేయాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాల కథనం.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చి పడిందంటే ఇదేనేమో. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్లాన్ తలకిందులైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్టు పార్టీ పెట్టిన కొత్తలోనే ఆమె ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి కూడా ఇటీవల శంకుస్థాపన చేశారు. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్కు జనం బ్రహ్మరథం పట్టడం, సభకు పాలేరు నుంచి జనం భారీగా తరలిరావడంతో ఇక అక్కడినుంచి పోటీ చేస్తే మునుగోడులో పాల్కు ఎదురైన పరిస్థితే వస్తుందేమోనని తాజాగా షర్మిల పునరాలోచనలో పడింది. దీంతో త్వరలో లష్కర్లో పార్టీ కార్యాలయానికి షర్మిల శంకుస్థాపన చేసే అవకాశం లేకపోలేదని లోటస్ పాండ్ వర్గాల కథనం.
– వెల్జాల