గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధానాలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగింది. గత ఎనిమిదేండ్లలో ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల కారణంగా జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ 3వ స్థానానికి చేరుకున్నదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. సబ్సెంటర్లు మొదలుకొని ప్రాథమిక, ఏరియా, జిల్లా, రాష్ట్రస్థాయి ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక వైద్యసేవలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.
దేశ చరిత్రలో ఒకేసారి 8 వైద్య కళాశాలలను ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. వైద్య చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. విద్యార్థులకు మెడికల్, పారా మెడికల్, పీజీ వంటి కోర్సుల్లో సీట్లను కూడా ప్రభుత్వం పెంచుతున్నది. మొత్తం 17కు పెరిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 నుంచి 2,790 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ దవాఖానలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్లో మరో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటవుతుండటం ముదావహం. జిల్లాకో మెడికల్ కళాశాల తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది.
ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే ‘కేసీఆర్ కిట్’ పథకం దేశానికే ఆదర్శం. ప్రభుత్వ దవాఖానల్లో 30 నుంచి 56 శాతం మేరకు ప్రసవాలు పెరగటానికి ఈ పథకం ముఖ్య కారణం. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు 13.30 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రూ.1,176 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు ఏర్పడిన పీహెచ్సీల్లో వైద్యం అందుబాటులోకి రావడమనేది మామూలు విషయం కాదు. ప్రతి దవాఖానలో అన్నిరకాల పరికరాలు, మందులు, పరీక్షలు చేసే ల్యాబొరేటరీలు ఏర్పాటయ్యాయి. సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలను చేసేటందుకే వైద్యులు మొగ్గుచూపుతుండటం అభినందనీయం. కరోనా కాలంలోనూ ప్రజలకు, గర్భిణులకు, పసిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యంత జాగ్రత్తగా వైద్యసేవలందించడం హర్షణీయం. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖకు గతానికి భిన్నంగా బడ్జెట్లో నిధులు పెంచింది. రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో మహిళలకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ఇస్తున్నది. అందుకే తెలంగాణలో ప్రభుత్వ వైద్యానికి జనాదరణ పెరుగుతున్నది. ఆర్థికమంత్రి హరీశ్రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వైద్యసేవలు మెరుగయ్యాయనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి నిత్యం వైద్య ఆరోగ్య శాఖ పనితీరును సమీక్షిస్తుండటం అభినందనీయం.
ఇక బస్తీ దవాఖానల్లోని వైద్యసేవ ల విషయానికి వద్దాం. 57 రకాల పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ జరుగుతున్నది. హెచ్ఎండీఏ పరిధిలో 91 బస్తీ దవాఖానలుండగా; మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 60 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్నది. డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు, కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు, 313 డయాలసిస్ మెషిన్లను ఏర్పాటుచేసింది. రోగుల ఇబ్బంది దృష్ట్యా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. క్యాథ్ ల్యాబ్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు అందిస్తున్నది. రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నది. టీబీ, క్యాన్సర్ పేషెంట్లకు మంచి ఆహారం అందిస్తున్నది. ఆరోగ్య శ్రీ కోసం ఏటా రూ.850 కోట్లు ఖర్చు చేస్తున్నది. తక్కువ బాలింత మరణాల రేటుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం లో నిర్వహించిన జ్వర సర్వే మంచి ఫలితాలనిచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేసి, సమస్యలున్న 41 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనున్నది.
మోటె చిరంజీవి
99491 94327