(రెండవ భాగం) ఆంధ్రోద్యమంతోనే విశాలాంధ్ర ఉద్యమం కూడా..: విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్రులు ఎందుకు, ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వనరులు లేకుండా మనుగడ సాగించలేదని వారికి ముందునుంచే తెలుసు. తెలంగాణను కలుపుకోకుండా గోదావరి, కృష్ణా నీళ్లపై ఆధిపత్యం సాధ్యపడదు. పారిశ్రామిక ప్రగతికి, విద్యుత్తు ఉత్పత్తికి కావలసిన బొగ్గు గనులు తెలంగాణాలోనే ఉన్నాయి. సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మాణమై ఉన్న హైదరాబాద్ నగరం తమ చేతికి చిక్కాలంటే తెలంగాణను కలుపుకోవాలి. పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ రాష్ర్టానికి బదిలీ అయిన లక్షలాది ఎకరాల నిజాం సర్ఫేఖాస్ భూములు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మిగులు నిధులు, విస్తారమైన ఉద్యోగ అవకాశాలు- ఇవన్ని తమ ఆధిపత్యంలోకి రావాలంటే విశాలాంధ్ర ఏర్పాటు ఒక్కటే మార్గం. విశాలాంధ్ర నినాదం వెనుక ఈ విస్తరణ ఆకాంక్ష ఉన్నదని ప్రధాని నెహ్రూకి ఆనాడే తెలుసు కనుకనే ‘విశాలాంధ్ర నినాదం వెనుక రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న సామ్రాజ్యవాద భావాలున్నాయి’ అని స్పష్టంగానే ప్రకటించాడు.
ఆంధ్రోద్యమంతో పాటు 1936 నుంచే విశాలాంధ్ర భావ ప్రచారం ప్రారంభమైందని తెలుసుకుంటే వారి దూరాలోచనకు విస్తుపోతాం. విశాలాంధ్ర భావన తెలంగాణలో ఎన్నడూ లేదు. ఇది ప్రధానంగా సర్కారు జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్. 1936లో ఆంధ్రా కాంగ్రెస్, స్వరాజ్య పార్టీలు తెలంగాణను కలుపుకొని ఆంధ్ర రాష్ర్టాన్ని ఏర్పాటుచెయ్యాలని డిమాండ్ చేశాయి. మామిడిపూడి వెంకటరంగయ్య 1937లో తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలిపి ఒకే ప్రదేశంగా ఏర్పాటుచెయ్యాలనే భావనను వ్యాప్తిచేశాడు. ఆ తర్వాత కడప కోటిరెడ్డి వారి సరసన చేరాడు. ఆ తర్వాత 1946లో పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర భావనను సిద్ధాంతీకరించి విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకాన్ని ప్రచురించాడు. అప్పటికే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం జరుగుతున్నందున తెలంగాణ కమ్యూనిస్టులు కూడా సుందరయ్య సిద్ధాంతాన్ని సమర్థించారు. 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటై అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో విశాలాంధ్ర ప్రచారం చేయసాగింది. ఈ రకంగా సర్కారు జిల్లాలలో పుట్టిన విశాలాంధ్ర భావన మెల్లమెల్లగా తెలంగాణలో ప్రవేశించింది. అయితే విస్తృత ప్రజామోదం మాత్రం పొందలేకపోయింది. విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిపిన సమావేశాలు జనం లేక ప్రజాప్రతినిధుల హాజరు లేక వెలవెలబోయినాయని, బడి పిల్లలను కూచుండబెట్టి మమః అనిపించుకున్నారని బీఎన్ శాస్త్రి 1955లో ‘రెండు తెలుగు రాజ్యాలెందుకు?’ అన్న పుస్తకంలో రాశారు. ఈ రకంగా సమావేశాలు జరపడం దండుగని ఆంధ్ర నాయకులు అనుకున్నట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. 1952లో ఉధృతంగా కొనసాగిన నాన్ ముల్కీ గో బ్యాక్- ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమమే అందుకు సాక్ష్యం.
1948 నుంచి 1952 దాకా హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగాల్లోకి ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా చొరబడిన నాన్ ముల్కీలను తరిమివేసేందుకు నాన్ ముల్కీ ఉద్యమం బద్దలైంది. 13 మంది విద్యార్థులు అమరులయ్యారు. అయినా కూడా నాన్ ముల్కీలు మాత్రం తెలంగాణ ఉద్యోగాల్లో దిగబడిపోయినారు.
వలస ప్రాంతంగా తెలంగాణ: 1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినదేమిటో అందరికీ తెలుసు. నెహ్రూ చెప్పినట్టు ఆంధ్రుల సామ్రాజ్య విస్తరణ, వనరుల దోపిడీ నిరాఘాటంగా కొనసాగాయి. ఫజల్ అలీ కమిషన్ పేర్కొన్నట్టు తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతంగా మారిపోయింది. అంతేకాదు, తన ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. ఇవ్వన్నీ జరిగినయి కనుకనే నవంబరు 1 తెలంగాణకు విద్రోహ దినం. అయితే తెలంగాణకు ద్రోహులు ఎవరు? అన్నది కీలక ప్రశ్న. ఆనాడు ఉద్యమకారులు ఈ అంశాన్ని విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం మొదటి ద్రోహి. 60 ఏండ్లుగా సుదీర్ఘ పోరాటం జరుగుతున్నా, తన తప్పును సవరించుకుందామన్న ఇంగితాన్ని చాలాకాలం మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం. సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అన్ని ప్రాతిపదికలను ధ్వంసం చేసి, తెలంగాణ వనరులను కొల్లగొట్టుకుపోతున్న ఆంధ్ర ప్రాంత పాలక వర్గాలు రెండో ద్రోహులు. తెలంగాణ వనరులపై, హైదరాబాద్ నగరంపై తమ భల్లూకపు పట్టును వదిలిపెట్టడానికి ఇష్టపడని ఆంధ్ర సంపన్నవర్గాలు, పెట్టుబడిదారులు ‘కలసి ఉంటే కలదు సుఖమని’ అనేవారు. తెలంగాణకు స్వయం పాలనను నిరాకరించేవారు. దోపిడికి అలవాటుపడిన వీరు తమ దోపిడి సొమ్ముతో కేంద్ర నాయకులను లోబర్చుకొని తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. ఇక మూడో రకం ద్రోహులు ఎవరంటే.. తెలంగాణ ఇంటి దొంగలు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆంధ్ర పాలకవర్గాల మోచేతి నీళ్లు తాగడానికి అలవాటుపడి తెలంగాణ తల్లికి ద్రోహం చేశారు. తెలంగాణ ప్రజలు ఎంత చీత్కరించినా, ఎంత అవమానించినా చూరుకు వేలాడే గబ్బిలాల లెక్క పదవులను పట్టుకు వేలాడారే తప్ప తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటాలతో మమేకం కాలేదు. ఈ ముగ్గురు తెలంగాణ ద్రోహుల విద్రోహ రాజకీయాలు విజయం పొందినరోజు కనుకనే నవంబర్ 1 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమే.
విద్రోహ రాజకీయాలను ఓడించిన తెలంగాణ: అయితే ఎవరైతే విద్రోహ రాజకీయాలకు లొంగి తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల విలీనానికి నిర్ణయం చేశారో వారి వారసులే 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి, వందలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగానికి భయకంపితులై ఉమ్మడి రాష్ట్ర విభజనకు నిర్ణయించడం ఒక చారిత్రిక వైచిత్రి. 1969 మలిదశ ఉద్యమం వైఫల్యాల నుంచి తెలంగాణ గుణపాఠాలు నేర్చుకున్నది. భావ ప్రచారం, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ.. ఈ మూడు సమాంతరంగా నడవాలన్న సిద్ధాంత అవగాహనను ప్రొఫెసర్ జయశంకర్ విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆ వ్యూహంలో భాగంగానే రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. భావ ప్రచారాన్ని, ఉద్యమాన్ని సమాంతరంగా నిర్వహించడానికి ప్రజా సంఘాలు ఏర్పాటైనాయి. దీంతో విస్తృత ప్రజానీకం ఉద్యమంలో భాగమైనారు. మలిదశ ఉద్యమంలో మహత్తర ప్రజా పోరాటాలు పెల్లుబుకినాయి. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్, నెక్లెస్రోడ్లో జరిగిన సాగరహారం, మానుకోట పోరాటం, దిల్లీకి జరిపిన సాంసద్ యాత్ర, కేసీఆర్ నిరాహార దీక్ష సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు ప్రజ్వరిల్లిన ప్రజా ఉద్యమం, వంటావార్పు, తెలంగాణ ప్రజా కళాకారుల ధూంధాం, పెల్లుబుకిన సాంస్కృతిక చైతన్యం, విద్యార్థుల పోరాటాలతో రగిలిపోయిన ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు, అన్నిటికీ తెగించి హక్కుల కోసం పోరాడిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పాటలు, కవిత్వం, కథలు ఇతర రూపాలలో ఆర్తితో వ్యక్తీకరించిన రచయితలు, కవులు, మేధావులు.. ఇవన్నీ తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీటన్నిటిలో మనం కూడా భాగస్వాములమైనందుకు, మన కండ్లముందే ఉద్యమ ఆకాంక్ష నెరవేరినందుకు గర్వపడకుండా ఉండలేం. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి విద్రోహ రాజకీయాలను తలచుకోవడం మనసును కష్టపెట్టే విషయం. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఎన్ని క్లిష్టమైన దశలను దాటుకొని విముక్తమైనదో తెలుసుకోవడం కూడా స్ఫూర్తిదాయకమైనది. కొత్త తరానికి తెలపాల్సిన సందర్భం కూడా ఇదే.
– శ్రీధరరావు దేశ్పాండే