తెలంగాణ అనేక పోరాటాలు, త్యాగాలతో నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. టీఆర్ఎస్కు ముందు తెలంగాణకోసం అనేక పార్టీలు, వ్యక్తులు కృషి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తెలంగాణ అరవై ఏండ్ల గోస నుంచి విముక్తి చేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మలివిడత ఉద్యమం దేశ చరిత్రలో చెరిగిపోని అధ్యాయం.
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న గులాబీ జెండా… ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసే వరకూ అవిశ్రాంతంగా కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలింది. నేడు ఆ గులాబీ జెండానే తెలంగాణ సమాజానికి గుండె బలమై నిలుస్తున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని విముక్తి చేయడానికి కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించిన తీరు అనన్యసామాన్యమైనది. రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, పథకాలతో సబ్బండ వర్గాల సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. కేవలం తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిలా నిలిపారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకం అద్భుతమైనదే. రాష్ట్రంలో అనేక సంస్కరణలతో గుణాత్మకమైన పాలనకు కృషి చేస్తూ వస్తున్నారు. రైతు సంక్షేమమే ఎజెండాగా ఆయన తీసుకొచ్చిన అనేక పథకాలు నేడు దేశంతోపాటు, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఇలా అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు భరోసానిచ్చారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో అద్భుతమైన క్రాంతి జ్యోతిని వెలిగించింది. ఈ పథకం దళితుల జీవితాల్లో గొప్ప పురోగతికి పునాది కానున్నది. ఆర్థిక స్వేచ్ఛ లభించిన నాడే దళితులు అన్ని రంగాల్లో రాణించగలుగుతారన్న స్ఫూర్తితో నేడు ఈ పథకం వారి జీవితాల్లో గొప్ప గుణాత్మకతను తీసుకువస్తున్నది.
అడగనిదే అవ్వ కూడా అన్నం పెట్టదు. అటువంటిది.. అడగకుండానే తెలంగాణ సమాజంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు చేపడుతున్న వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సాధించడం లక్ష్యం అయితే… సాధించిన తెలంగాణలో ప్రతి ఇల్లు ఆనందమయంగా ఉం డాలని.. క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టి గొప్ప పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక సంక్షేమ పథకం అందని ఇల్లు లేదంటే కేసీఆర్ నిస్వార్థ పాలనను అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంలోని ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ప్రైవేటుకు గంపగుత్తగా అమ్ముతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తూ… తెలంగాణ ప్రజలను కష్టాల నుంచి దూరం చేస్తూ గుండె ధైర్యాన్నిస్తున్నది. గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అన్న సంగతి యావత్తు తెలంగాణ సమాజం దృఢంగా విశ్వసిస్తున్నది.
ఇరవై రెండేండ్ల పార్టీ ప్రస్థానంలో గులాబీ జెండా భారత ప్రజలకు అండగా నిలిచే నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ అభివృద్ధి నమునాను దేశమంతా విస్తరించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశంలోని పేదరికాన్ని తొలగించడానికి కేసీఆర్ నడుం బిగించారు. దేశ నలుమూలల నుంచి కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తున్నది.
ఇప్పటికే మహారాష్ట్ర అంతా గులాబీ గుబాళిస్తున్నది. తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి తమకూ కావాలనే భావనతో స్వచ్ఛంధంగా వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పుడు గులాబీ జెండా అంటే కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. భారత ప్రజల గుండె అని బలంగా విశ్వసిస్తున్నారు.
సంపత్ గడ్డం: 7893303516