స్వాతంత్య్ర భానోదయ వేళ దేశానికి దిక్సూచి లాంటి రాజ్యాంగం అవసరమైంది. అంబేద్కర్ ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం సరిగ్గా అమలు కావడం వల్లే నేడు ప్రతి పౌరుడికీ ప్రగతి ఫలాలు లభిస్తున్నాయి. ఆయన దేశ ప్రజలందరికీ మార్గ దర్శకులు. ఆయన సేవలు మరువ లేనివి. ఆయన ఆలోచనా విధానం అనుసరణీయం.
“1950 జనవరి 26న మనం వైరుధ్యాల మయమైన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో మాత్రం అసమానత ఉంటుంది. మన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని మనం నిరాకరిస్తూనే ఉన్నాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతే, ఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు’.
– 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేద్కర్ అన్న మాటలివి.
అంబేద్కర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్నంగా పరిశీలించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వేచ్ఛ, సమానత్వాలకు రాజ్యాంగంలో పెద్ద పీట వేశారు.
దేశ భవిష్యత్తును, రాజకీయ నాయకుల స్వార్థాన్ని ముందే ఊహించిన అంబేద్కర్ దేశాభివృద్ధి కోసం సమగ్రమైన రాజ్యాంగాన్ని , చట్టాలను రూపొందించారు. పటిష్ఠమైన పాలనా వ్యవస్థలు ఎలా ఉండాలో రాజ్యాంగంలో నిర్దేశించారు. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థలు దారి తప్పితే న్యాయ వ్యవస్థ వాటిని గాడిలో పెట్టేలా విధానాలను రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించారు. ప్రభుత్వాల బాధ్యత ఏమిటో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు.
అంటరానితనాన్ని రూపు మాపేందుకు అనేక రకాల పౌర స్వేచ్ఛలకు రాజ్యాంగ హామీలు, రక్షణలను అంబేద్కర్ కల్పించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కారణమయ్యారు. దేశంలోని ప్రజలందరికీ కూడు, గూడు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్.
అలాంటి మహనీయుడి పేరును కొత్తగా నిర్మిస్తున్న దేశ పార్లమెంట్ భవనానికి పెట్టాలని తెలంగాణతో సహా యావత్ దేశం కోరుకుంటోంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని ఇక్కడి మేధావులు, ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ పేరును నూతన పార్లమెంట్ భవనానికి పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. సమున్నతమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటుకు పెడితే గౌరవంగా, సముచితంగా, సగర్వంగా ఉంటుంది.
– తీగల అశోక్ కుమార్
79891 14086