‘గురుబ్రహ్మ, గురర్విష్ణో,
గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీగురవే నమః’
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎందుకంటే?
విద్యార్థులను విజ్ఞానులుగా తీర్చిదిద్ది, ఉపాధి మార్గాలు చూపి, వారిలోని అవ గుణాలను తొలగిస్తున్నందుకు గురువును పరబ్రహ్మ స్వరూపునిగా ఆరాధిస్తున్నది భారతీయ సమాజం. మరి నాడు ‘గురువు’ పాత్ర ఎప్పుడు ప్రవేశించిందో, ఆయన నిర్వహించిన గురుతర బాధ్యత ఏంటో తెలుసుకుందాం! ప్రాచీన భారతంలో ప్రజలు గుం పులు, గుంపులుగా నివసించారు. ఒక్కో గుంపు నివసించే ప్రాంతాన్ని ఒక్కో గ్రామంగా పిలుచుకున్నారు. వ్యవసాయం నేర్చుకున్నాక గ్రామస్థులకు అనేక వస్తువుల అవసరం ఏర్పడింది. అందుకే గ్రామస్థులంతా వివిధ బృందాలుగా ఏర్పడి, ఆయా వస్తువులను ఉత్పత్తి జేస్తూ గ్రామ అవసరాలను తీర్చుకున్నారు.
ఉదాహరణకు గ్రామంలో సగం మంది వ్యవసాయం చేసి పంటలు పండించటం, మిగతావారు వ్యవసాయ పరికరాల తయారీ, కుండల తయారీ, బట్టలు నేయటం, బట్టలుతకటం, చెప్పులు కుట్టడం, బుట్టలల్లటం… ఇలా పనులను విభజన చేసుకున్నారు. వాళ్ళు చేసే పనులను బట్టి ఆయా పని బృందాలను ఆయా ‘కులాలు’గా పిల్చుకున్నారు. ‘కులం’ అంటే ‘బృందం’ అని భావం. ఉదాహరణకు… హలంతో పొలం దున్నేవాళ్లది హాలిక ‘కులం’. కుమ్ము (బూడిద), దుమ్ము (మన్ను)తో కుండలు చేసేవాళ్ళు ‘కుమ్మరులు’, కమ్ములతో పనిచేసేవాళ్ళను ‘కమ్మరులు’, దుస్తులు కుట్టేవాళ్ళు ‘దర్జీలు’, చర్మంతో చెప్పులు కుట్టేవాళ్ళు ‘చర్మకారులు’ అలాగే రజకులు, సాలీలు, క్షురకులు వగైరా బృందాలు (కులాలుగా) రూపొంది గ్రామీణ అవసరాలను తీర్చుకునేవారు. అలా ఒక గ్రామం మరో గ్రామంపై ఆధారపడకుండా జీవిస్తుండేవారు. అందుకే ప్రాచీన భారతంలోని ఈ పని విభజన పద్ధతినే ‘గ్రామీణ స్వయం పోషక ఆర్థిక విధానం’ అన్నారు సామాజిక పరిశోధకులు కార్ల్ మార్క్స్!
గురువు పాత్ర: అప్పుడు ఇంకో సమస్య ఎదురైంది. గ్రామస్థులు పగలంతా శ్రమించి, రాత్రి కాగానే నిద్రలోకి జారుకునేవారు! మరి వాళ్ల బిడ్డలకు చదువు, సంధ్యలు నేర్పి ప్రయోజకుల్ని చేసేదెవరు? అందుకు గ్రామస్థులంతా ఆలోచించి.. గ్రామంలోకెల్లా ఎక్కువ తెలివి, జ్ఞానం, శీలం కలిగిన ‘సజ్జన మేధావి’ని గురువుగా ఎంచుకున్నారు. నాటినుంచి నిరంతరం గురువు కర్తవ్యమదే! అందుకే గురువు పోషణను సమిష్టి బాధ్యతగా స్వీకరించారు గ్రామస్థులు! అలా ‘గురువు’ ప్రవేశించాడు ప్రాచీన భారతంలో! ‘గురువు’ అంటే ‘పెద్ద’, ‘అజ్ఞానపు చీకటి తొలగించేవాడు’ అని భావం.
గురువు గురుతర బాధ్యత: గ్రామ బాల బాలికలందరినీ చెంత కూర్చోబెట్టుకొని అన్నిరకాల ఉత్పత్తి విధానాలను నేర్పించుటే నాటి విద్యాబోధన! ఉపాధి కల్పించే అట్టి విద్యతో పాటు, సమాజానికి తోడ్పడే నైతిక, మానవీయ విలువలనూ ప్రబోధించి విద్యార్థులను సర్వతోముఖంగా తీర్చిదిద్దేవాడు గురువు! అంతేకాదు విరామ సమయాల్లో, గ్రామస్థుల ఉత్పత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే సూచనలిస్తుండేవాడు. రానున్న ప్రకృతి వైపరీత్యాలను ముందుగా పసిగట్టి గ్రామస్థులను హెచ్చరిస్తుండేవాడు. పర్యావరణ పరిరక్షణను ప్రబోధించేవాడు! అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జ్ఞానిగా జన్మనిచ్చిన గురువును మొదటగా పూజించి ఆ తర్వాతే దైవాన్ని పూజించారు నాడు!
గురుకులాలు: పరిణామ క్రమంలో గురుకులాలు వెలిసినాయి. అటవీ ప్రాంతంలో అక్కడక్కడా గురుకులాలుండేవి. సమీప గ్రామాల వారక్కడ తమ బిడ్డలను వదిలేసేవారు. వారందరికీ విద్యా బోధనతోపాటు, వాళ్ల సహకారంతో పండ్లు, కూరలు, ధాన్యాలు, గోవులను పెంచుతూ, వాటి ఫలసాయంతో వాళ్లందరినీ పోషిస్తుండేవాడు గురువు. యుక్త వయసొచ్చేదాక చదివి ప్రయోజకులై గ్రామాలకెళ్లేవాళ్లు, వివాహమాడి కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజానికీ తోడ్పడుతుండేవారు.
గురుపూర్ణిమ: బోధనతో పాటు సద్గ్రంథ రచనలూ చేస్తుండేవారు గురుకులాధిపతులు. నాటి గురువుల కృషి ఫలితాలే వేద, ఉపనిషత్, పురాణేతిహాసాలు, ఆయుర్వేద, గణిత, వాస్తు, భూగోళ, ఖగోళాది శాస్ర్తాలు!వారిలో అద్వితీయులు వ్యాస మహర్షి. అందుకే ఆయన జన్మదినమైన ‘ఆషాడ పూర్ణిమ’ను ‘గురు పూర్ణిమ’గా భావించి నేటికి గురు పూజోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు: పరిణామ క్రమంలో గురుకులాలు వీధి బడులుగా, ప్రభుత్వ పాఠశాలలుగా, గురువులు ప్రభుత్వోపాధ్యాయులుగా మారారు. కొన్ని శతాబ్దాలపాటు గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయులకు మధ్య ఉన్న పరస్పర ప్రేమ, అభిమాన, గౌరవాలు క్రమంగా ఆవిరైపోతున్నాయి.
ప్రైవేటు విద్యాసంస్థలు: పాక్షికంగా విద్యను ప్రైవేటీకరించినా, ప్రభుత్వ విద్యాసంస్థలను మించి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినయి. ఏం చేసైనా ఉత్తీర్ణతా శాతాన్ని, ర్యాంకులను పెంచుకునే లక్ష్యంతో, విద్యను వ్యాపారంగా మార్చేశారు. అందుకే అక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, డాక్టర్, ఇంజినీర్ వగైరా అయిన వారంతా నైతిక, సామాజిక విలువలకు దూరమై, నిరంతరం తేనెను పోగేసే తేనెటీగల్లా… డబ్బును పోగేసే మర మనుషుల్లా మారిపోతున్నారు! వాళ్ల బాటలోనే పలువురు ప్రభుత్వోపాధ్యాయులు కూడా పలు వ్యాపార లావాదేవీల్లో మునిగితేలుతున్నారు! ఇది వ్యవస్థ ప్రభావం కావచ్చు, కానీ ప్రాచీన భారతంలో గురువు నిర్వహించిన గురుతర బాధ్యతను సదా మననం చేసుకుంటూ, వ్యాపార ప్రవాహంలో కొట్టుకుపోకుండా, మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఉపాధ్యాయ సహోదరులారా!.. ఈ వ్యాపార వ్యవస్థలోనూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులూ ఉన్నారు. కానీ వారు కూడా స్కూలుకెళ్లి, సిలబస్ను పూర్తిజేసుకుని చేతులు దులుపుకొంటున్నారు. అలాంటి మంచి ఉపాధ్యాయులే కానీ, మంచి గురువులు కారంటున్నారు ప్రజాకవి వేమన! ‘కారు, కారు గురువులు, కా గుణితములు జెప్ప- శాస్త్ర పాఠములు చదివిచెప్పు-ముక్తిమార్గము చూపుమూలము గురుడయా విశ్వదాభిరామ వినురవేమా!”
ఉపాధ్యాయునిగా సమాజానికేం చేయవచ్చో, ఎంత ఎత్తుకు ఎదగవచ్చో చూపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్! 1888 సెప్టెబర్ 5న చెన్నై దగ్గరి ‘తిరుత్తణి’లో జన్మించారు. తిరుపతిలో ఉన్నత విద్యనభ్యసించి లెక్చరర్, ప్రొఫెసర్, ఆంధ్ర, కాశీ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్గా, ఐరాస సాంస్కృతిక విభాగంలో భారత ప్రతినిధిగా, రష్యాలో భారత రాయబారిగా, భారతదేశ రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించారు. అంతేకాదు సద్గ్రంథ రచనల ద్వారా భారతీయ తత్వశాస్ర్తానికి ప్రపంచ ఖ్యాతినందించారు. అందుకు కృతజ్ఞతగా ‘సెప్టెంబరు 5’ను ‘గురు పూజోత్సవ’ దినంగా జరుపుకొంటున్నాం.
‘ఉపాధ్యాయ సహోదరులారా.. అందరిలో ఆశల కోసం కాకుండా, ఆశయాల కోసం పరిశ్రమించండి!’- ఉన్నది అమ్ముకో, లేనిది కొనుక్కోమంటున్న ఈ వ్యాపార వ్యవస్థలో మనిషికి, మనిషికీ మధ్య కేవలం వ్యాపార లావాదేవీలు తప్ప, ప్రేమ, ఆప్యాయత, స్నేహానురాగ బంధాలన్నీ ఆవిరైపోతున్నాయి. ఈ ప్రమాదకర స్థితి నుంచి సమాజాన్ని గట్టెక్కించండి. సమత, మమతలకు నెలవైన ఒక మంచి సమాజాన్ని రూపొందించేందుకు పరిశ్రమించండి. ‘నైతిక, మానవీయ విలువలతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థులకే గాదు, సరైన దిశానిర్దేశం చేస్తూ సమాజానికీ గురువులుగా ఎదగ’ండి. ఒక్క మీకు మాత్రమే ఉన్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భరతమాతకు ముద్దుబిడ్డలై వర్ధిల్లెదరు గాక! తథాస్తు!!
– పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానోపాధ్యాయులు)