దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలంగాణ రైతులు జేజేలు పలుకుతున్నారు.
దేశం ఆర్థికంగా ఎదగడానికి నూటికి 64 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న రంగాల్లో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి.వ్యవసాయ రంగానికి ప్రధానంగా కావలసింది సాగునీరు, సారవంతమైన భూమి, ప్రణాళిక బద్ధమైన వ్యవసాయ విధానం. ఈ మూడుంటేనే వ్యవసాయంలో రాణించగలుగుతాం.
తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. ఫలితంగా తెలంగాణ నేడు వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతిని సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్ ముందుచూపు, ప్రణాళిక బద్ధమైన వ్యవసాయ విధానమే దీనికి కారణం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు పథకం, 24 గంటల నాణ్యమైన కరెంట్ వంటివి అందులో భాగమే. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు, పండ్లు, కూరగాయలు కూడా సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. వ్యవసాయం అభివృ ద్ధి సాధించాలంటే దానికి రైతుల నిరంతర కృషి ఎంతగానో అవసరం.ప్రభుత్వ పోత్సాహం, రైతుల శ్రమ ఫలితంగా నేడు తెలంగాణలో వ్యవసాయం జీవనోపాధి దశ నుంచి మిగులు ఉత్పత్తి సాధించే దిశగా పురోగమిస్తున్నది.
తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పంటల సాగు కొత్త రికార్డులు నమోదు చేసుకున్నది. రాష్ట్రం సిద్ధించిన 2014 నుంచి 2022 వరకు గమనిస్తే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేసింది స్పష్టమవుతున్నది.గత రెండు మూడేండ్లుగా తెలంగాణలో నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఒక్క ఎకరం కూడా పడావు పడ్డ భూమి కనిపించటం లేదు. దీనికి ప్రధానమైన కారణం వ్యవసాయ రంగంపట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగమని చెప్పక తప్పదు. పాలకుడు వ్యవసాయదారుడైతేనే వ్యవసాయ రంగంలో లోటుపాట్లు తెలుస్తాయి. స్వయానా రైతు కనుకనే మన ము ఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎనలేనది. దానివల్లే వ్యవసాయం దినదినాభివృద్ధి సాధిస్తున్నది. 2014-15లో 28.18 శాతం ఉన్న వ్యవసాయ వృద్ధి 2016-17లో 19.92 శాతం, 2018-19లో 39.20, 2020 -21లో 38.09, 2021-22లో 31.49 శాతం, 2022-2023 లో 53.82 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 68.53% ఉత్ప త్తి సాధించినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
2014 -15 యాసంగిలో 28.18లక్షల ఎకరాల్లో మొత్తం పంటల సాగు నమోదయింది. అత్యధికంగా 2020- 21 లో 67.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా 2023 యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ అధికారికంగా విడుదల చేసిన నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ప్రస్తుతం మరో 40 .35 లక్షల ఎకరాల్లో సాగు పెరగడం మనం గమనించవచ్చు.
ముఖ్యంగా వరి విషయానికొస్తే ఈ సీజన్లో ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతకాలంలో ఎన్నడు లేని స్థాయిలో 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నది. భారతదేశంలో పంజాబ్, చత్తీస్గఢ్ తర్వాత ధాన్యం అధిక సేకరణ తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతున్నదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. దీన్నిబట్టి దేశంలో మూడో అతిపెద్ద వ్యవసాయ ఉత్ప త్తి రాష్ట్రం తెలంగాణేనని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తే దేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రం నుండి వస్తాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి నిబద్ధత కలిగిన పాలన యంత్రాంగం తప్పనిసరి.
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి: 98495 77610
(వ్యాసకర్త : పౌర సంబంధాల అధికారి, కేయూ)