రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణను మేల్కొల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలోనే కాదు తెలుగులోనే ఒక ధృవతార సురవరం. తేజోమూర్తులలో ముందు వరుసలో ఉంటారు. ఆయన జీవిత చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర. అపూర్వ పాండిత్యం సురవరం సొంతం. తక్కువ కాలం జీవించినా అనేక చరితలను రాసి చూపించిన ప్రతిభామూర్తి. తెలంగాణ ఆధునికత వైపు పయనించటానికి పలు సంస్థలను స్థాపించి, విద్య, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన సురవరం సేవానిరతి వేనోళ్ల పొగడదగినది.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యమంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. సాహితీవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, సామాజిక పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా సారస్వత పరిషత్ అధ్యక్షులుగా, గ్రంథాలయోద్యమకారులుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనది.
సురవరం ప్రతాపరెడ్డి 1896, మే 28న మహబూబ్నగర్ జిల్లాలోని బోరవెల్లి గ్రామం లో రంగమ్మ-నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. అనంతరకాలంలో ఆలంపూర్ సమీపంలోని ఇటిక్యాలపాడు వారి స్వగ్రామమైంది. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించారు. అతని చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఏబీఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇం టర్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ చదివారు. 1916లో మరుదలు పద్మావతిని వివాహం చేసుకున్నారు.
సురవరం సంపాదకత్వంలో వచ్చిన ‘గోలకొండ కవుల సంచిక’ ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు లేరనే అహంకార నిందాపూర్వ వ్యాఖ్యకు సవాలుగా తెలంగాణలో కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా ‘గోలకొండ పత్రిక’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించి సవాల్ విసిరిన వైతాళికుడాయన. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 మంది కవుల వివరాలున్నాయి.
1926లో అతను నెలకొల్పిన ‘గోలకొండ పత్రిక’ తెలంగాణ సాంస్కృతిక గమనంలో ఒక మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.
తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డిది ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పారసీ, ఆంగ్లం ఇలా బహుభాషల్లో నిష్ణాతులు. గోలకొండ పత్రిక, దానికి అనుబంధంగా ‘భారతి’ సాహిత్య పత్రిక, ‘ప్రజావాణి’ పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. రామాయణం విశేషాలు, మొగలాయి కథలు, ఆంధ్రు ల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, భక్తతుకారం, గ్రంథాలయోద్యమం, యువజన విజ్ఞానం వంటి దాదాపు 20కి పైగా గ్రంథ రచనలు చేశాడు.
1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆం ధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు. ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్నీ తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు. తెలంగాణ గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాల య మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభ కు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అతనే అధ్యక్షుడు.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకుగాను సురవరానికి 1955లోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన తొలి తెలుగు రచయితగా ఇది విశేషకీర్తిని ఆర్జించింది. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, హైదరాబాదులోని ట్యాంక్బ్యాండ్పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహానికి కూడా స్థానం లభించింది.
సురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రముఖ న్యాయవాది వీ రామచంద్రారెడ్డిపై పోటీచేసిన ఆయన విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. సురవరం మొదటినుంచి గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. దానితో అదే జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సురవరానికి మంత్రిపదవి లభించలేదు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా నిర్మొహమాటంగా ఎదురుగానే కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల ధైర్యం ఆయన సొంతం.
సురవరం న్యాయవాదిగా జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడిగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1953 ఆగస్టు 25న ఆయన దివంగతుడయ్యారు.
(నేడు సురవరం ప్రతాపరెడ్డి127వ జయంతి)
-వనపట్ల సుబ్బయ్య
94927 65358