కరోనా కాలంలో దీర్ఘకాలం పాటు బడుల మూసివేతవల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతకాలం పాటు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలుగలేదు. దీనివల్ల అన్ని తరగతుల విద్యార్థుల పఠనా సామర్థ్యాలు క్షీణించాయని 2022లో విడుదల చేసిన అసర్ నివేదిక స్పష్టం చేసింది. ఆ క్షీణత 2012 స్థాయికి పడిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.
ప్రథం ఫౌండేషన్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ప్రతి తరగతిలో విద్యార్థులు తమ స్థాయికి ఉండాల్సిన సామర్థ్యాలు కలిగిలేరు. 5 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై నిర్వహించిన ఈ సర్వే ద్వారా అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. మూడవ తరగతి విద్యార్థులలో పఠనాసామర్థ్యాలు 27.3 శాతం నుంచి 20.5 శాతానికి, ఐదవ తరగతి విద్యార్థులలో 50.5 శాతం నుంచి 42.8 శాతానికి, ఎనిమిదవ తరగతి విద్యార్థులలో 73 శాతం నుంచి 69.3 శాతానికి పడిపోయాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో నెలకొన్నది.
సరైన పఠనాసామర్థ్యాలు ఉన్నప్పుడే విద్యార్థులు దేన్నైనా నేర్చుకోగలరు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలరు. ఈ ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023 -24 విద్యాసంవత్సరంలో పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్) కార్యక్రమాన్ని జూన్, జూలై మాసాల్లో నిర్వహిస్తున్నది. విద్యార్థులందరూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ధారాళంగా చదువగలగాలి. చదువడం ఒక అలవాటుగా మారాలి. స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి అన్నది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు.
ఈ కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక తరగతుల నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తారు. ప్రతి తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఆయా లక్ష్యాలను 37 రోజుల్లో చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వా రా పఠనాసామర్థ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులందరూ ఇందులో భాగస్వాములవుతారు. ఎటువంటి ఒత్తిడి లేని వాతావరణంలో అభ్యసన కార్యక్రమం కొనసాగుతుంది.కార్యక్రమంలో సబ్జెక్టు పుస్తకాలు, గ్రంథాలయ పుస్తకాలు చదివించడం ద్వారా విద్యార్థుల పఠనా సామర్థ్యం పెంచే ప్రయత్నం చేస్తారు. కథల పుస్తకాల ద్వారా విద్యార్థులు చదువడం సులువుగా నేర్చుకుంటారు. అందువల్ల పాఠశాలల్లో వీలయినన్ని కథల పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నారు. కథలను చదవడం, వినడం ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
విద్యార్థుల పఠనా సామర్థ్యాల పెంపుదలలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నది. ప్రతి లైబ్రరీకి నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి 120 పుస్తకాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల పుస్తకాలు పాఠశాలలకు అందజేయనున్నారు.
విద్యార్థులకు ప్రతిరోజూ గ్రంథాలయ పీరియడ్ను కేటాయించి వారంలో 3 రోజులు మాతృభాష (తెలుగు/ఉర్దూ/హిందీ)లో కథల పుస్తకాలు, 2 రోజులు ఆంగ్లభాషలోని కథల పుస్తకాలు, 1 రోజు ద్వితీయ భాషా (హిందీ) కథల పుస్తకాలు చదివిస్తారు. విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా పాఠశాల గ్రంథాలయ కమిటీలను బలోపేతం చేస్తారు. గ్రంథాలయ పీరియడ్లో విద్యార్థులు స్వేచ్ఛగా తమ అభిరుచులకు అనుగుణంగా పుస్తకాలను ఎంచుకోవచ్చు. పఠనోత్సవంలో భాగంగా జూలై 10 నుంచి వారం రోజులపాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారు.
తరగతి గదిలో పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, ఇతర పఠన సామగ్రి ఏర్పాటుచేయడం ద్వారా విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు, గ్రామస్థులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తారు. రూం టు రీడ్ సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, సేవ్ ద చిల్డ్రన్, యూనిసెఫ్, బ్రెడ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు. అధికారులు అవసరమైన సలహాలు సూచనలు చేస్తారు. ‘మన ఊరు మన బడి’ పథ కం ద్వారా బడుల రూపురేఖలు మారుతున్న తరుణంలో పఠనోత్సవ కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే ప్రయత్నం అభిలషణీయం.