తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి మూలకారణాలను అన్వేషించడం, వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది.
Telangana | విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను ఒకసారి విశ్లేషిస్తే.. విద్యార్థులపై అధిక ఒత్తిడి, ఆధునిక గురుకులాల్లో పోటీతత్వం, ర్యాంకుల వేట తదితర అంశాలే మనకు కనిపిస్తాయి. ఇవి విద్యార్థుల మానసిక స్థితిపై దుష్ప్రభావం చూపుతున్నాయి. అధిక మార్కులు సాధించాలనే ఒత్తిడి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అంచనాలను అందుకోలేక కొందరు విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చర్చించేందుకు వేదికల కొరత కూడా తీవ్రంగా ఉంది. మానసిక ఆందోళనతో బాధపడే విద్యార్థులకు తమ భావోద్వేగాలను పంచుకోవడానికి సరైన వేదిక లభించడం లేదు. అండగా నిలిచేవారు లేకపోవడంతో భయంతో వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గురుకులాల్లో క్రమశిక్షణ పేరిట మానసిక, శారీరక వేధింపులకు దారితీసే శిక్షా విధానాలు అమలవుతున్నాయి. సున్నితమైన మనస్తత్వాలు కలిగిన విద్యార్థులు వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు లేకపోలేదు. గురుకులాల్లో చదువుకునే పిల్లలు.. తల్లిదండ్రులు, ఇంటి వాతావరణానికి దూరమవడం వల్ల ఒంటరితనానికి లోనవుతున్నారు. దీనివల్ల వారి ప్రవర్తనలో ప్రతికూల మార్పు లు వచ్చి ఆత్మన్యూనత భావానికి గురవుతున్నారు.
పరీక్షలు, మార్కులపై కాకుండా విద్యార్థుల నైపుణ్యాల గుర్తింపు, వికాసాలపై విద్యా విధానాలను ప్రభుత్వం రూపొందించాలి. విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ నియంత్రణ తదితర జీవిత నైపుణ్యాలను సిలబస్లో భాగం చేయాలి. తప్పనిసరిగా ప్రతి గురుకులంలో అర్హత కలిగిన కౌన్సెలర్, సైకాలజిస్టులను నియమించాలి.
కౌన్సెలర్ల సాయంతో విద్యార్థుల మానసిక సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలి. సోషల్మీడియా, ఆన్లైన్కు విద్యార్థులు బానిసలుగా మారకుండా చూడాలి. వారిని నిరంతరం పర్యవేక్షించాలి. విద్యార్థుల మధ్య జరిగే అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. కేవలం ఆదేశాలివ్వడం, శిక్షించడం కాకుండా విద్యార్థులతో ఉపాధ్యాయులు మమేకం కావాలి. బోధనా విధానం ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించేలా ఉండాలి. ఒత్తిడికి గురిచేయకూడదు. మానసిక ఆరోగ్య సమస్యలున్న పిల్లలు కొన్ని సంకేతాలు ఇస్తుంటారు. ఉపాధ్యాయులు ఇలాంటి సంకేతాలను గుర్తించి వారిని కౌన్సెలింగ్కు తరలించాలి.
ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించాలి. ఎటువంటి లక్షణాలున్న పిల్లల్లో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు కలుగుతాయో వారికి వివరించాలి. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, మానసిక సమస్యల గురించి ఉపాధ్యాయులు ఆరాతీయాలి. వారి మానసిక ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. తెలంగాణలోని గురుకులాలను చదువులకు స్వర్గసీమలుగా చెప్తారు. ఈ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపట్టాలి. విద్యార్థులు మానసిక ఆరోగ్యంతో క్షేమంగా ఉండి, చదువుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– శ్రీధర్