పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ప్రాణవాయువును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులను కొందరు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం బలిపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. 1969లో బ్యాంకులను జాతీయీకరించి, వాటిని సన్నకారు రైతులకు, బడుగు బలహీనవర్గాలకు కల్పతరువుగా తీర్చిదిద్దిన ఘనత మన దేశానిది. దేశ పారిశ్రామికాభివృద్ధికీ బ్యాంకులు అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ, మన ఆర్థిక సామాజిక మార్పునకు సాధనాలుగా పనిచేసే ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రపంచానికి ఆదర్శంగా చూపించుకోవడానికి బదులు ప్రైవేటుకు అప్పనంగా అప్పగించాలనుకోవడం వివేక భ్రష్టత్వమే. ఇది మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత తిరోగమన చర్య.
పబ్లిక్రంగ బ్యాంకుల మొండి బకాయీలు పెరిగిపోయాయనీ, నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయనీ కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పవచ్చు. కానీ బ్యాంకులు నష్టాల బాటలో నడవడానికి కారణం వాటి సామర్థ్య లోపం కాదు, సామాజిక దృక్కోణం అంతకన్నా కాదు. బ్యాంకుల నష్టాలకు ప్రధాన కారణం రాజకీయపరమైందే తప్ప నిర్వహణ పరమైంది కాదు. మొండి బకాయీలు ఇబ్బడిముబ్బడిగా మారడానికి నాటి కాంగ్రెస్ పాలకులు కారణమయ్యారు. ఆ పాపం మోదీ హయాంలో పరాకాష్టకు చేరుకున్నది. 2012 మార్చిలో బడా పారిశ్రామికవేత్తల మొండి బకాయీలు బ్యాంకుల మొత్తం రుణాలలో మూడు శాతం ఉంటే, ఘనత వహించిన ప్రధాని మోదీ హయాంలో 2018 నాటికి 14 శాతానికి చేరుకున్నాయి. 84 శాతం మొండి బకాయీలు కొన్ని కార్పొరేట్ సంస్థలకు చెందినవే. ప్రధాని మోదీకి జిగ్రీ దోస్తు అయిన ఒక గుజరాత్ వ్యాపారవేత్తకు చెందిన గ్రూపు ఈ రుణాలతోనే ఓడ రేవును, రెండు విద్యుత్ కేంద్రాలను సొంతం చేసుకున్నదనేది జగద్విదితం. బ్యాంకులను నిలువునా ముంచింది ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గమైతే, మరోవైపు చిన్న మధ్యతరహా పరిశ్రమలవారు, రైతులు రుణాలు లేక విలవిలలాడుతున్నారు.
బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లును ఈ వానకాలం పార్లమెంటు సమాశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తున్నది. దేశ శ్రేయస్సుపై ఏ మాత్రం ఆపేక్ష ఉన్నా, పబ్లిక్రంగ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించకూడదు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే బడా పారిశ్రామికవేత్తలను నిలదీసి మొండి బకాయీలను వసూలుచేయాలి. బ్యాంకులను సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి సాధనాలుగా మళ్ళీ తీర్చిదిద్దాలి. గత విధానాలను మెరుగుపరచాలే తప్ప తిరోగమన బాటలో పయనించడం భావ్యం కాదు. మోదీ ప్రభుత్వం ఇదేవిధంగా ఆశ్రిత పక్షపాతంతో పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు సామాజిక అశాంతి ప్రబలుతుందని గ్రహించాలి.